ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకునే వాళ్లు ఒంటరిగానే పోటీ చేయవచ్చని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి కూటమి భాగస్వామిగా కాకుండా తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సంజయ్ రౌత్ స్పందించారు.
తమ పార్టీ రాజకీయ పోరాటాలను సొంతంగానే చేస్తుందని, ఒంటరిగా పోటీ చేయాలనుకునే పార్టీలు ఆ విధంగానే చేసుకోవచ్చని రౌత్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కూటములు ఏర్పాటవుతుంటాయని, రాజకీయ పోరాటాలు మాత్రం స్వతంత్రంగా ఉంటాయని ఆయన చెప్పారు. మహారాష్ట్ర ప్రతిష్ట, పార్టీ ఉనికి కోసం కోసం శివసేన పోరాడుతూనే ఉంటుందన్నారు.
శనివారం పార్టీ 55వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కూడా ఒంటిరిగా పోటీ చేస్తామంటూ మాట్లాడేవాళ్లు అలాగే చేసుకోవచ్చని తమ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారని రౌత్ గుర్తుచేశారు. శివసేన రాజకీయ పోరాటాలు కూడా సొంతంగానే చేస్తుందని, ఎన్నికల్లో పొత్తులున్నా, పోరాటాలనేవి సొంతంగానే ఉంటాయని చెప్పారు.