సకలం ఇంట్లోనే ఉంటున్నాం.. వైరస్ బారిన పడకుండా ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ అలుపెరగకుండా శ్రమిస్తూ కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. గంటల తరబడి కంటికి రెప్పలా కాపాడే డాక్టర్లు, సపర్యలు చేసే సిబ్బంది.. కుటుంబాలను వదిలి కరోనా రోగుల సేవలో నర్సులు.. తమవారికి మహమ్మారి సోకొద్దని దవాఖానల్లోనే ఉంటున్న వైద్య నిపుణులు.. చెత్తను సేకరించే పారిశుధ్య కార్మికులు.. ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే చేస్తున్న ఆశ వర్కర్.. ఇలా వివిధ రూపాల్లో ఫ్రంట్లైన్ వారియర్స్ సమాజసేవలో నిమగ్నమవుతున్నారు. కరోనా విజృంభణ వేళ పరిస్థితి మరింత విషమించకుండా తమ సేవలతో వేలాది ప్రాణాల్ని కాపాడుతున్నారు.
కనికరం లేని కరోనాకు ఎదురొడ్డి..అనుక్షణం విధుల్లో తలమునకలవుతున్నారు. బంధాలు, అనుబంధాలకు దూరంగా.. ఇంటికి వెళితే.. ఎదురొచ్చే పిల్లలను దగ్గరకు తీసుకోలేని నిస్సాహాయ స్థితి ఉన్నా సేవలో వెనుకాడేది లేదంటున్నారు. కొవిడ్ విపత్తు ప్రపంచాన్ని వణికిస్తున్నదని, ఈ మహమ్మారికి ఎదురొడ్డి పనిచేయడం సంతృప్తినిస్తున్నది చెబుతున్నారు. శుక్రవారం ‘నమస్తే తెలంగాణతో తమ మనోభావాలను పంచుకున్న ఫ్రంట్లైన్ వారియర్స్.. కష్టంగా ఉన్నా.. ఇష్టంగా పనిచేస్తున్నామని, కలిసికట్టుగా మహమ్మారిని తరిమికొడుతామని స్పష్టం చేస్తున్నారు. ఇంకా ఏమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
కమ్యూనిటీ సెంటర్లో ప్రతి రోజూ ర్యాపిడ్ టెస్టులు చేసి పాజిటివ్ వచ్చిన వారికి మందు కిట్లను అందజేస్తున్నాం. పాజిటివ్ అని తెలియగానే భయాందోళనలకు గురికాకుండా బాధితులకు సలహాలు ఇచ్చి ధైర్యానిస్తున్నాం. ఒకవైపు పరీక్షలు చేస్తూనే.. మరోవైపు టీకాలు వేస్తున్నాం. కొవిడ్ రోగులకే కాదు.. ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సైతం సేవలందిస్తున్నాం. ప్రజలకు సేవ చేయడంలో మంచి సంతృప్తి లభిస్తున్నది. -శ్రీనివాస్, 104 వింగ్ మహేశ్వరం కమ్యూనిటీ సెంటర్
రోజూ కరోనా బాధితుల మధ్యే ఉంటున్నాం. వారికి మందులు, జాగ్రత్తలు, సలహాలు, సూచనలు ఇస్తున్నాం. త్వరగా కోలుకునేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. టెస్టులు, వ్యాక్సిన్ల కోసం అనేక మంది వస్తుంటారు. ఆ సమయంలో సిబ్బందికి పాజిటివ్ కూడా వచ్చిన సందర్భాలున్నాయి. అయినా భయపడకుండా ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నాం. – డాక్టర్ రాధిక, కందుకూరు ప్రభుత్వ వైద్యశాల
నిత్యం గ్రామాల్లో పర్యటిస్తున్నాం. ఇంటింటికీ సర్వే చేస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారి గృహాలకు వెళ్లి మందులు ఇస్తున్నాం. అయితే కొందరు బాధితులు విసుక్కుంటారు. అయినా ఎంతో ఓపికతో ప్రభుత్వం మాకు ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తూ.. అందరితో స్నేహంగా ఉంటూ.. ధైర్యం చెబుతున్నాం. నెగెటివ్ రిపోర్టు వచ్చే వరకు రోగులను కంటికి రెప్పలా కాపాడుతున్నాం. -చీమల అనిత, ఆశా వర్కర్, కొత్తగూడ
కొవిడ్ సమయంలో బాధ్యతగా పనిచేస్తున్నాం. గ్రామంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి ఇంటికి వెళ్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాం. ప్రజలు సైతం ఆరోగ్య సమస్యలు వస్తే.. నేరుగా మాకు సమాచారం ఇస్తున్నారు. కొవిడ్ టెస్టులు చేయించి.. పాజిటివ్ వచ్చిన వారికి మందుల కిట్లు ఇచ్చి ధైర్యం చెబుతున్నాం. -కమలమ్మ, అంగన్వాడీ టీచర్, నర్కూడ
అనారోగ్యంతో వచ్చిన వారికి మా కుటుంబ సభ్యుల్లా ప్రత్యేక చొరవ తీసుకొని వైద్యసేవలందిస్తున్నాం. కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రజలు విధిగా మాస్కులు ధరించాలి. నిర్లక్ష్యం చేయకుండా మందులు వేసుకోవాలి. మా సెంటర్కు వచ్చిన వారికి టెస్టుల్లో పాజిటివ్ వస్తే బాధితులు మానసికంగా ఆందోళనకు గురికాకుండా భరోసా కల్పిస్తున్నాం. -బాబు గౌడ్, ల్యాబ్ టెక్నీషియన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దషాపూర్
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఉదయం 5 గంటలకే నిద్రలేస్తాం. ప్రతి బస్తీలో వ్యర్థాలను తొలగించి.. పరిశుభ్రంగా మారుస్తున్నాం. రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఏ సేవకైనా.. ముందు వరుసులో ఉంటాం. పారిశుధ్య నిర్వహణ పక్కాగా నిర్వహిస్తున్నాం. ప్రజలంతా విధిగా మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. కొవిడ్ను తరిమికొట్టాలి. -మైలారం బాలయ్య, పారిశుధ్య కార్మికుడు, సుల్తాన్పల్లి.
కొవిడ్ వ్యాప్తితో ప్రజలంతా అవస్థలు పడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో సేవ చేసే భాగ్యం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అధికారుల సహకారం, ప్రోత్సాహంతో త్రికరణ శుద్ధిగా విధులను నిర్వర్తిస్తున్నాం. మా విభాగం పనులకే పరిమితం కాకుండా అవసరమైన వారికి వ్యాక్సినేషన్, కొవిడ్ పరీక్షలను చేయిస్తున్నాం. -శరణ్జీత్సింగ్, జనన, మరణ విభాగం, ఎల్బీనగర్ సర్కిల్.
కొవిడ్ సెకండ్ వేవ్ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మా విభాగం తరఫున కాలనీలు, బస్తీల్లో వైరస్ నిర్మూలనకు సోడియం హైపోక్లోరైట్ ద్రావణంతో పిచికారి చేయిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం కష్టాన్ని ఓర్చుకుంటూ.. విధులు నిర్వర్తిస్తున్నాం. -స్వామి, ఎంటమాలజీ సూపర్వైజర్, ఓల్డ్బోయిన్పల్లి
కరోనాతో తోటి సిబ్బంది చనిపోయినప్పుడు చాలా బాధపడ్డా. కరోనా సోకిన వారి ఇండ్లకు నేరుగా వెళ్లి రసాయనాలను పిచికారీ చేస్తున్నాం. ఎక్కువ కేసులు వచ్చిన కాలనీలు, అపార్ట్మెంట్లకు వెళ్లాలంటే అందరికీ కంగారే. కానీ వైరస్ను నియంత్రించాలంటే రసాయనాలను పిచికారీ చేయడం తప్పనిసరి. జాగ్రత్తలు తీసుకుంటూ..పాజిటివ్ వచ్చిన రోగుల గృహాలకు వెళ్లి సూచనలు ఇస్తున్నాం. విధులు ముగించుకొని ఇంటికొచ్చిన తర్వాత కుటుంబసభ్యుల వద్దకు వెళ్లాలంటే కొంత భయంగా అనిపిస్తుంటుంది. నా వల్ల కరోనా వస్తుందేమోనని దూరంగా ఉండాల్సి వస్తున్నది. – మహేందర్రెడ్డి, ఎంటమాలజీ సిబ్బంది, కేపీహెచ్బీకాలనీ
జ్వర సర్వేతో ఎంతో మేలు జరుగుతున్నది. లక్షణాలున్న వారిని ఇంటి వద్దే గుర్తిస్తుండటంతో వైరస్ చైన్ను నివారించగలమన్న నమ్మకం పెరిగింది. లక్షణాలతో టెస్ట్ సెంటర్కు వెళ్లిన వ్యక్తుల ద్వారా మరికొందరికి వైరస్ సోకే అవకాశాలున్నాయి. సర్వేతో ఈ సమస్య తీరిపోతున్నది. ఇంటింటికీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను కూడా నిర్వహిస్తే పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ తగ్గుతుంది. – లక్ష్మి, అంగన్వాడీ టీచర్
వైద్యులతో కలిసి అంగన్వాడీ సిబ్బంది జ్వర సర్వేలో పాల్గొంటున్నారు. లాక్డౌన్ సమయం కావడంతో గ్రామాల్లో గర్భిణుల యోగక్షేమాలు తెలుసుకుంటూ.. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాం. శాటిలైల్ చానల్ ద్వారా కొవిడ్ జాగ్రత్తలు సూచిస్తూ.. పిల్లలకు ఆన్లైన్లో అవగాహన కల్పిస్తున్నాం. ఇతర రాష్ర్టాల కంటే మన తెలంగాణలోనే మంచి పౌష్టికాహారం అందుతున్నది. కరోనా కష్టకాలంలో పేదలకు సేవ చేయడం సంతృప్తినిస్తున్నది. -సరిత, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి, మహేశ్వరం.
వైరస్ తీవ్రత చాలా ఉంది. ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. కొవిడ్ రోగులు వస్తే జాగ్రత్తలు తీసుకుంటూ.. సేవలందిస్తున్నాం. కంటి మీద కునుకు లేకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాం. కరోనా బాధితులకు మందుల కిట్లు ఇస్తున్నాం. రోగుల్లో భయాన్ని పోగొట్టి.. ధైర్యాన్ని ఇస్తున్నాం. ప్రజలంతా మాస్కులు ధరించాలి. స్వీయ నియంత్రణ పాటించాలి. -కీర్తి, ల్యాబ్ టెక్నీషియన్, ఓల్డ్బోయిన్పల్లి.
వైరస్ కట్టడిలో పోలీసుల పాత్ర కీలకంగా మారింది. కొవిడ్ వ్యాప్తితో బాధ్యతలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుత లాక్ డౌన్ నేపథ్యంలో నిరంతరాయంగా డ్యూటీ చేయాల్సి వస్తున్నది. చెక్ పాయింట్ల వద్ద అనుక్షణం పర్యవేక్షిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి తగిన కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తున్నాం. -ప్రేమలత, కానిస్టేబుల్, బాలానగర్ పోలీస్స్టేషన్.
వివిధ ప్రాంతాల్లో కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో విద్యుత్కు అంతరాయం కలుగకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటున్నాం. రాత్రి వేళల్లో సరఫరాలో ఆటంకం కలిగితే తక్షణమే స్పందిస్తున్నాం. వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. బాధ్యతగా విధులు నిర్వర్తిస్తున్నాం. నిరంతరాయంగా సేవలందిస్తున్నాం. -శామ్యూల్ జాన్, విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్, బాలానగర్
కొవిడ్ పరీక్ష కోసం వందల సంఖ్యలో తరలివస్తారు. పీపీఈ కిట్టు ధరించి..విధుల్లో చేరుతాను. మూడు గంటల పాటు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఉక్కపోతతో దుస్తులు తడిసిముద్దవుతాయి. అయినా నిబద్ధతతో పనిచేస్తూ.. సేవలందించడం గర్వంగా భావిస్తున్నా.-పండరిరెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్, యూహెచ్సీ హఫీజ్పేట్
ప్రజల కోసం అనునిత్యం బాధ్యతగా సేవలందిస్తున్నాం. కాలనీల్లో రెండు రోజులు వ్యర్థాలు తొలగించకుంటే ఇబ్బందులు కలిగే ఆస్కారమున్నది. కొవిడ్ నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాం. క్రమం తప్పకుండా శక్తివంచన లేకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. – లక్ష్మి, పారిశుధ్య కార్మికురాలు, కుత్బుల్లాపూర్
ప్రతిరోజూ కాలనీల్లో రసాయనాలు పిచికారీ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేసిన తర్వాత ఎవరూ అనవసరంగా బయటకి రావొద్దంటూ.. సూచిస్తున్నాం. విచ్చలవిడిగా బయట తిరిగి ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడరాదని, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరిస్తున్నాం. కొవిడ్ వస్తే భయపడవద్దని భరోసా కల్పిస్తున్నాం. – కె. ఉమేశ్, ఎంటమాలజీ సిబ్బంది, కుత్బుల్లాపూర్
ఈ కష్టకాలంలో కరోనా కట్టడికి పాటుపడుతున్నాం. ఇంటింటికీ తిరిగి సర్వే చేయడంతో పాటు.. కొవిడ్ బాధితులకు మందులు పంపిణీ చేస్తున్నాం. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో విలువైన సేవలు అందిస్తున్నందుకు గర్వంగా ఉన్నది. చాలా మంది బయటకు రాలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి మేము అందించే సేవలు చాలా సంతృప్తిని ఇస్తున్నాయి. -అనిత, అంగన్వాడీ టీచర్, గాజులరామారం
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విధించిన లాక్డౌన్లో పోలీసులు చేస్తున్న సేవలు అత్యంత విలువైనవి. వీటిని ప్రజలు గుర్తించి, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండి, కరోనాను కట్టడి చేసి ప్రాణాలను కాపాడుకోవాలి. ఎంతో మంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. యువతలో మార్పు రావాలి. బాధ్యతగా ఉంటూ ప్రతి ఒక్కరూ కరోనాను దూరం చేయాలి. -సైదులు, సీఐ , జగద్గిరిగుట్ట