నిజామాబాద్ : కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోరలు చాచిన కరోనా రక్కసికి కుటుంబాలకు కుటుంబాలే బలవుతున్నాయి. ఈ మహమ్మారి విజృంభణతో జగిత్యాలలో ఒకే కుటుంబంలో ముగ్గురు, విజయవాడలో ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు.
తాజాగా నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్లో ఇద్దరు భార్యాభర్తలు కరోనాకు బలయ్యారు. గంట వ్యవధిలోనే కరోనాతో ఆ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆర్మూర్కు చెందిన ఎంఐఎం నేత గోరేమియా కరోనా బారిన పడటంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గోరెమియాను అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తరలిస్తుండగా, ఆయన భార్య కూడా చనిపోయింది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నిజామాబాద్ జిల్లాలో రోజుకు 400 పాజిటివ్ కేసులకు తగ్గకుండా నమోదు అవుతున్నాయి.