న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా మరో బాంబు పేల్చింది. నష్టాల్లో ఉన్న పీఎస్యూల మూసివేతకు చర్యలు తీసుకుంటామన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రకటించారు. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి విషయమై తెలంగాణ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అర్జున్ మేఘ్వాల్ పై సంగతి చెప్పారు.
నష్టాల్లో ఉన్న, ఖాయిలాపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడానికి అవసరమైన నిబంధనలను సవరించేందుకు చట్టాలను మారుస్తామని తెలిపారు. త్వరలో విధి విధానాలు ఖరారవుతాయని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని తెలిపారు.