హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఆదివారం జరగనుంది. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం 202 పట్టణాల్లో 3842 పరీక్ష కేంద్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఏర్పాటు చేసింది. పెన్ను పేపర్ విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కాగా, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని ఏడు పట్టణాల్లో 112 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్నగర్, హయత్నగర్లో ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతిస్తారు. మాస్కు తప్పనిసరని, చిన్న శానిటైజర్ బాటిల్ను కూడా అనుమతిస్తామని తెలిపారు. మాస్క్ తప్పని సరి ధరించాలని తెలిపారు. అయితే షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్, నగలు వేసుకోవద్దని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా గైడ్ లైన్స్ పాటించాలన్నారు.