టామ్ టామ్’ అనే అంతర్జాతీయ సంస్థ గతేడాది 57 దేశాల్లోని 416 నగరాల్లో ట్రాఫిక్ సమస్యపై సమగ్ర అధ్యయనం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టాప్-10 నగరాలను వెల్లడించింది. దాంట్లో మన దేశంలోని ముంబై 2, బెంగళూరు 6, ఢిల్లీ 8వ స్థానంలో ఉన్నాయి. మున్ముందు మన హైదరాబాద్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉన్నది. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేశారు.
గత ఏడేండ్లలో నగరంలోని వాహనాల సంఖ్య రెట్టింపయ్యింది. ప్రతీ రోజు సుమారు 1000- 1500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లలో సగం హైదరాబాద్లోనే కావడం విశేషం. ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టకపోతే, ట్రాఫిక్కు తగినట్లు రోడ్డు సదుపాయాలు మెరుగుపర్చకపోతే ట్రాఫిక్ సమస్య చేయిదాటిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే రానున్న 30- 50 ఏండ్ల అవసరాలను, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ)ను నగరంలో అమలుచేస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ) కింద రూ.30 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది.
హైదరాబాద్ విశ్వనగరం దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ప్రపంచ ప్రముఖ ఐటీ, పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్కు వస్తున్నాయి. ఇప్పటికే టీఎస్ఐపాస్ ద్వారా 15 వేల పరిశ్రమలకు అనుమతి లభించింది. వాటిలో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 90 శాతం ఉంటాయి. టీహబ్ ఎన్నో స్టార్టప్లకు వేదికైంది. 250 ఐటీ కంపెనీలొచ్చాయి. భవిష్యత్లో నగరంలో పెరగనున్న రద్దీ, అవసరమయ్యే మౌలిక సదుపాయాలను మంత్రి కేటీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకోసమే రూ.30 వేల కోట్లతో ఎస్ఆర్డీపీని ప్రారంభించారు.
ఐదు దశలలో ప్రభుత్వం ఎస్ఆర్డీపీని పూర్తిచేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో 20 జంక్షన్లను రూ.2,631 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నది. రెండో విడతలో మూసీ నది ఒడ్డున ఈస్ట్- వెస్ట్ కారిడార్ను నిర్మించడంతో పాటు కేబుల్ బ్రిడ్జి, రెండు జంక్షన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకుగానూ రూ.6,757 కోట్లను వెచ్చించనున్నది. మూడో విడతలో రూ.6,830 కోట్లతో తొమ్మిది కారిడార్లు, నాలుగో విడతలో రూ.5,431 కోట్ల వ్యయంతో మరో తొమ్మిది కారిడార్లు అభివృద్ధి చేయనున్నది. ఈ నాలుగు విడతలకుగానూ ప్రభుత్వం రూ.21,649 కోట్లను వెచ్చిస్తున్నది. ఐదో విడతగా ఐదు స్కైవేల నిర్మాణానికి రూ.5,180 కోట్లను ఖర్చు చేయనున్నది. ఎస్ఆర్డీపీ ద్వారా 135 కిలోమీటర్ల మేర స్కైవేలు, 166 కిలోమీటర్ల మేర మేజర్ కారిడార్లు, 348 కిలోమీటర్ల మేజర్ రోడ్లతో పాటు 1,400 కిలోమీటర్ల ఇతర రోడ్లు, 54 గ్రేడ్ సెపరేటర్లను నిర్మించే ప్రణాళికకు కేసీఆర్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇప్పటికే అయ్యప్ప సొసైటీ అండర్పాస్, మైండ్స్పేస్ అండర్పాస్, మైండ్స్పేస్ ఫ్లై ఓవర్, చింతల్కుంట చెక్పోస్ట్ జంక్షన్, ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వద్ద ఫ్లై ఓవర్, ఎల్బీనగర్లో మరో ఫ్లై ఓవర్ పనులు పూర్తయ్యాయి. వీటివల్ల ప్రత్యేకించి ఐటీ కారిడార్లో, ఎల్బీనగర్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తగ్గింది.
కరోనా కాలంలో ప్రపంచమంతా స్తంభించినా ఎస్ఆర్డీపీ పనులు మాత్రం ఆగిపోలేదు.కరోనా కాలంలో రూ.2 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, 300 కిలోమీటర్ల మేర రోడ్లు, 29 లింక్ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఇప్పటికే నగరంలో 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్పాస్లు, 3 ఆర్వోబీల నిర్మాణం పూర్తయింది. నగరవ్యాప్తంగా మరికొన్ని ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం కూడా జరుగుతున్నది.
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సీఎం కేసీఆర్ పట్టణాలు, పల్లెల అభివృద్ధికి విశేషంగా కృషిచేస్తున్నారు. ఈ రెండింటికీ సమ ప్రాధాన్యమిస్తూ బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. ప్రస్తుత బడ్జెట్లోనూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.15,030 కోట్ల నిధులు కేటాయించారు. ఇవే కాకుండా వరంగల్కు రూ.250 కోట్లు, ఖమ్మంకు రూ.150 కోట్ల చొప్పున ప్రత్యేకంగా నిధుల కేటాయింపు జరిగింది. అలాగే హైదరాబాద్లో మెట్రో రైలుకు రూ.1000 కోట్ల నిధులను కేటాయించారు.
కరోనా కాలంలో ప్రపంచమంతా స్తంభించినా ఎస్ఆర్డీపీ పనులు మాత్రం ఆగిపోలేదు. కరోనా కాలంలో రూ.2 వేల కోట్లతో ఫ్లై ఓవర్లు, 300 కిలోమీటర్ల మేర రోడ్లు, 29 లింక్ రోడ్ల నిర్మాణాలను పూర్తిచేశారు. ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా ఇప్పటికే నగరంలో 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్పాస్లు, 3 ఆర్వోబీల నిర్మాణం పూర్తయింది. నగరవ్యాప్తంగా మరికొన్ని ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణం కూడా జరుగుతున్నది. అలాగే నగరంలో జరుగుతున్న వివిధ జాతీయ రహదారుల పనులకు జీహెచ్ఎంసీ రూ.587 కోట్ల నిధులను వెచ్చిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులతో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. అన్ని పనులు మొత్తం పూర్తయితే నగరంలో ట్రాఫిక్ సమస్య ఉండదు. సమీప భవిష్యత్తులో ట్రాఫిక్ అనే సమస్యనే రాదు.
(వ్యాసకర్త: జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్)