పాకిస్థాన్ నివురు గప్పిన నిప్పులా ఉన్నది. ప్రధాని ఇమ్రాన్కు, తెరవెనుక అధికారం చెలాయిస్తున్న సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలలో తీవ్ర అసంతృప్తి పేరుకుపోయి భుగభుగలాడుతున్నది. కొన్ని నెలల కిందటే రాజకీయ పక్షాల నేతలు విభేదాలను మరిచి సైన్యానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు సాగించాలని అవగాహనకు వచ్చారు. ఇమ్రాన్ను గద్దె దింపడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహిళలు, మతవాదులు ఆందోళనలకు దిగారు. ‘మహిళలపై దాడులకు వారి వేషధారణే కారణం’ అంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇటీవల ఫ్రాన్స్లో ఒక అభ్యంతరకర కార్టూన్ ప్రచురితమైన నేపథ్యంలో ఆ దేశ రాయబారిని వెనుకకు పంపాలని ఇస్లామిక్ మతవాదులు ఆందోళనకు దిగారు. దీంతో పాకిస్థాన్ ఆందోళనలతో అతలాకుతలమవుతున్నది.
క్రికెట్ క్రీడాకారుడిగా ప్రజాభిమానాన్ని చూరగొన్న ఇమ్రాన్ ఖాన్ సొంత రాజకీయ పక్షం పెట్టుకున్నప్పటికీ చాలా కాలం అధికారానికి ఆమడదూరంలోనే ఉండిపోయాడు. ఇమ్రాన్ అధికార కాంక్షను గమనించిన సైన్యం తెరచాటు పాలన సాగించడానికి అనువుగా అతడిని పావుగా వాడుకున్నది. ప్రధాన రాజకీయ పక్షాలు తమ మాట వినకపోవడం, ప్రజలలో ప్రజాస్వామ్య కాంక్ష బలంగా ఉండటంతో సైన్యం బహిరంగంగా అధికారం చేపట్టలేకపోతున్నది. దీంతో ఇమ్రాన్ను ముందు పెట్టుకొని ఎన్నికల తంతు నడిపించింది. ఎన్నికల్లో అక్రమాలతో, మిలటరీ దన్నుతోనే 2018లో ఆయన అధికారం చేపట్టారు. ఇమ్రాన్ పాలనలో ప్రతిపక్ష నేతల వేధింపులు, అరెస్టులు నిత్యకృత్యంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఐక్యంగా ఉద్యమించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన సాగించడానికి కొద్ది కాలం కిందట పదకొండు రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి పాకిస్థాన్ డెమొక్రటిక్ మువ్మెంట్ (పీడీఎం)గా ఏర్పడ్డాయి. పాకిస్థాన్ ముస్లింలీగ్ (ఎన్) నేత మార్యం నవాజ్ షరీఫ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావర్ భుట్టో ఆధిపత్యం కోసం ప్రయత్నించ కుండా, జేయూఐ-ఎఫ్ నేత మౌలానా ఫజల్ రహమాన్కు ఐక్యకూటమి పగ్గాలు అప్పగించటం గమనార్హం. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన హింసలో వంద మందికి పైగా పోలీసులు గాయపడ్డారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయ పక్షాల నాయకత్వంలోని ఉద్యమం ఇంకా స్పష్టమైన రూపం సంతరించుకోలేదు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్, మయన్మార్ వంటి దేశాలలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం సాగుతున్న ఉద్యమాలకు భారత్తో సహా ప్రజాస్వామిక దేశాలు సంఘీభావం తెలుపాలి. పొరుగు దేశాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నప్పుడు భావ సారూప్యత ఏర్పడి సత్సంబంధాలు నెలకొంటాయి.