Amritpal Singh | న్యూఢిల్లీ, మార్చి 20: ఖలిస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే అధినేత అమృత్పాల్ సింగ్ మద్దతుదారులు విదేశాల్లో రెచ్చిపోతున్నారు. భారత రాయబార కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. సోమవారం అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరిన అమృత్పాల్ మద్దతుదారులు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. డోర్లు మూసి ఉండటంతో జెండా కర్రలు, రాడ్లు, కత్తులతో డోర్లు, కిటికీలను పగలగొట్టేందుకు ప్రయత్నించారు. కార్యాలయం ముందు ఖలిస్థానీ జెండాలు కట్టారు. వీటిని తొలగించిన కాన్సులేట్ సిబ్బందిపై దాడికి యత్నించారు.
లండన్లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఆదివారం దాడి చేసిన ఖలిస్థానీ మద్దతుదారులు భారత జాతీయ పతాకాన్ని తొలగించిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతిగా అక్కడే భారీ త్రివర్ణ పతాకాన్ని భారత హైకమిషన్ సిబ్బంది ఏర్పాటుచేశారు. దాడి ఘటనపై లండన్ పోలీసులు విచారణ ప్రారంభించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్లోని యూకే దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకమిషన్ కార్యాలయానికి బ్రిటన్ సెక్యూరిటీ కల్పించకపోవడం వల్లే ఈ దాడి జరిగిందని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని భారత్ పేర్కొంది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఖలిస్థానీల చర్యను నిరసిస్తూ న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమిషన్ కార్యాలయం ముందు సిక్కులు ఆందోళన చేశారు. భారత్కు అనుకూలంగా నినాదాలు చేశారు. మరోవైపు కాన్బెర్రాలోని ఆస్ట్రేలియా పార్లమెంటు భవనం ముందు కూడా ఖలిస్థాన్ మద్దతుదారులు అమృత్పాల్పై పోలీసుల చర్యలకు నిరసనగా ఆందోళన చేపట్టారు. బ్రిస్బేన్లో ఖలిస్థాన్కు అనుకూలంగా రెఫరెండం నిర్వహించారు.
అమృత్పాల్ సింగ్ను పట్టుకునేందుకు మూడో రోజు కూడా పంజాబ్ పోలీసులు వేట కొనసాగించారు. పంజాబ్ వ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతున్నది. శాంతిభద్రతల సమస్యలు రాకుండా పోలీసులు ఫ్లాగ్ మార్చ్లు, పీస్ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వదంతులు నమ్మవద్దని, వదంతులు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మంగళవారం వరకు మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్లపై నిషేధం కొనసాగుతుందన్నారు. అమృత్పాల్ అనుచరుల వద్ద అక్రమ ఆయుధాలు పట్టుబడటంతో ఎన్ఐఏ ఈ కేసు విచారణ బాధ్యతలు తీసుకోనున్నట్టు తెలుస్తున్నది. కాగా, అమృత్పాల్ సింగ్ ప్రధాన అనుచరులైన ఐదుగురిపై జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించనున్నట్టు ఐజీ సుఖ్చయిన్ సింగ్ గిల్ తెలిపారు. ఇప్పటివరకు ఆరు ఎఫ్ఐఆర్లు నమోదుచేసి 114 మంది అమృత్పాల్ అనుచరులను అరెస్టు చేశామన్నారు. అమృత్పాల్ మామ హర్జీత్ సింగ్, డ్రైవర్ హర్ప్రీత్ సింగ్ జలంధర్లో పోలీసులకు లొంగిపోయారు. వీరి కారును పోలీసులు సీజ్ చేశారు.
మానవబాంబు దాడులకు
ఖలిస్థాన్కు మద్దతుగా పంజాబ్ యువతను రెచ్చగొడుతున్న అమృత్పాల్ సింగ్ భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. మాదకద్రవ్యాల వినియోగాన్ని మాన్పించేందుకు ఏర్పాటుచేసిన రిహాబిలిటేషన్ సెంటర్లో మానవబాంబులను సిద్ధం చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. వీటిని అక్రమ ఆయుధాలకు కేంద్రంగా మార్చాడని గుర్తించారు. కొంతమంది యువతను మానవబాంబులుగా మార్చేలా అమృత్పాల్ బ్రెయిన్వాష్ చేస్తున్నాడని భావిస్తున్నారు. మానవబాంబుగా మారి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ను హతమార్చిన ఉగ్రవాది దిలావర్ సింగ్ బాటలో నడవాలని డీఅడిక్షన్ సెంటర్లలో చేరిన యువతను అమృత్పాల్ ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించారు.
అమృత్పాల్ సింగ్(30) స్వస్థలం పంజాబ్లోని అమృత్సర్ జిల్లా జల్లుపూర్ ఖేరా ప్రాంతం. వీరి కుటుంబానికి దుబాయిలో ట్రాన్స్పోర్టు వ్యాపారం ఉంది. అమృత్పాల్ సింగ్ 2012 నుంచి ఏడాది కింది వరకు దుబాయిలోనే నివసించాడు. వారిస్ పంజాబ్ దేను స్థాపించిన నటుడు దీప్ సిద్ధూ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈ సంస్థకు నాయకత్వలోటు ఏర్పడింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అమృత్పాల్ దీనిని వినియోగించుకున్నాడు. వారిస్ పంజాబ్ దేకు నాయకుడిగా ప్రకటించుకొని ఈ సంస్థ కార్యకలాపాలను, కార్యకర్తలను నడిపించారు. ఇటీవల తన అనుచరుడు లవ్ప్రీత్ సింగ్ను పోలీసులు అరెస్టు చేస్తే వందలాది మంది అనుచరులు, ఆయుధాలతో పోలీస్ స్టేషన్ను ముట్టడించి అతడిని విడిపించుకుపోవడంతో అమృత్పాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. కాగా, అమృత్పాల్ సింగ్కు విదేశాల నుంచి నిధులు అందుతున్నాయని, పాకిస్థాన్ ఐఎస్ఐతో పాటు పలు విదేశీ ఉగ్రవాద సంస్థల ప్రోద్భలంతో పని చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.