కాకతీయుల కాలంలో తెలుగుసాహిత్యం ఆస్థానంలో గాక, రాజుల పోషణలోగాక కవులు వ్యక్తులుగా, సంస్థలుగా చేరి ఉద్యమాలను ఆసరాగా చేసుకొని రచించడం ఒక గొప్ప విశేషం. ఒక వైపు శైవం వ్యాపిస్తున్నా, ఇంకోవైపు వైష్ణవాన్ని ఆభిమానించి గోన బుద్ధారెడ్డి ‘రామాయణ’ కావ్యాన్ని రచించాడు. గోన బుద్ధారెడ్డి గణపతిదేవ చక్రవర్తి సమకాలికుడు. అతని తండ్రి గోన గన్నారెడ్డి గొప్ప వీరుడు. కాకతీయ రాజులకు ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. దాన్ని మెచ్చి కాకతీయరాజు అతన్ని వర్ధమానపురము ప్రాంతానికి సామంతరాజుగా చేశాడు.
గోన గన్నారెడ్డి వైష్ణవాన్ని స్వీకరించి, తర్వాత విఠ్ఠలనాథుడుగా పేరుపొందాడు. ఒకనాడు విఠ్ఠల భూపతి ఆస్థానంలో పండితులను ఉద్దేశించి ‘రమణమై తెనుగున రామాయణంబు, క్రమమప్పజెప్పెడి ఘన కావ్య శక్తి.. గల కవులెవ్వారు గలరుర్విననుచు’ అని అడిగినప్పుడు.. సభలోని పండితులు అతని కొడుకు బుద్ధభూపతి గొప్పకవి, పండితుడు, కవిభోజుడు అని అతడే ఈ రామాయణ రచనకు సమర్థుడు అని చెప్తారు. అప్పుడు తండ్రి ఆజ్ఞతో బుద్ధభూపతి రామాయణ రచనకు పూనుకుంటాడు. వాల్మీకి రామాయణ కథను అనుసరించినా, లోకంలో జనబాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న- జంబుమాలి, కాలనేమి వృత్తాంతాలు, సులోచన కథ, అహల్య రాయిగా మారిందనటం, రాముడు బాల్యంలో మందర కాలు విరిచాడనటం, లక్ష్మణుడు పర్ణశాల చుట్టూ రేఖను గీశాడనడం మొదలైన వాల్మీకి రామాయణంలో లేని, లోకలో జనబాహుళ్యంలో వ్యాప్తిలో ఉన్న వృత్తాంతాలను తీసుకొని బుద్ధభూపతి రామాయణం రచించాడు. అంటే వస్తువిషయంలో దేశీయతను పాటించాడు.
కవి శైలి సమాస రహితంగా, సరళ సులభంగా వుంటుంది. పాటగా పాడుకొవడానికి వీలుగా ఉంది. అందుకే రామాయణ ద్విపదలను జనులు కొంతకాలం కిందివరకు పాటలుగా పాడుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. కవి సందర్భానుకూలంగా వర్ణనలు చేశాడు. పాత్రల చిత్రణ, సంభాషణలు సహజంగా ఉన్నాయి. అలంకారాలను ప్రయోగించినా శైలిలో కాఠిన్యం లేదు. బుద్ధభూపతి ఈ రామాయణాన్ని క్రీ.శ. 1240 ప్రాంతంలో రచించాడని పండితుల అభిప్రాయం. బుద్ధభూపతి పూర్వరామాయణాన్ని రాయగా, అతని కొడుకు కాచవిభుడు, విఠ్ఠలనాథుడు ఉత్తర రామాయణాన్ని రచించి రామాయణాన్ని పూర్తి చేశారు. బుద్ధభూపతి పూర్వ రామాయణాన్ని తండ్రి పేర రాయగా, ఈ కవులు ఉత్తర రామాయణాన్ని బుద్ధభూపతికి అంకితంగా రచించారు. ఇక్కడ తమ తాతపేరు గోన గన్నారెడ్డి అని పేర్కొన్నారు.
గోన బుద్ధారెడ్డి రచించిన రామాయణం కర్త గోన బుద్ధారెడ్డి కాదని రంగనాథుడు అనే ఒక అభిప్రాయం లోకంలో ఏర్పడింది. దీనికి మధ్యకాలంలో ‘రంగనాథ రామాయణం’ అనే పేరు కూడా వచ్చింది. కాని లభించిన రాత ప్రతుల్లో ఎక్కడ కూడా ‘రంగనాథ రామాయణం’ అనే పేరు లేదు. కేవలం ‘రామాయణం’ అనే ఉంది. తెలుగు సాహిత్యంలో ‘రంగన’ అనే పేరుతో ఏ కవీ లేడు. కాని చక్రపాణి రంగన అని మాత్రం ఉన్నాడు. అతడు మొదట వైష్ణవుడు. అతడు శ్రీశైల మార్గంలో సాగుతూ మల్లికార్జునుడిని దర్శించకపోవడం చేత గుడ్డివాడైనాడని, ఆ తర్వాత పాల్కురికి సోమనను కలిసి శివదీక్షతో కండ్లు పొందాడని ఐతిహ్యం. దీన్ని బట్టి సోమనాథుని దర్శనం చేత రంగన వీరశైవుడైన తర్వాత మనోనయనం తెరచుకొని జ్ఞానోదయమై వీరశైవ సంబంధమైన రచనలు అనేకం చేశాడు.
అట్లా చక్రపాణి రంగన వీరశైవ కవిగానే ప్రసిద్ధుడు. అతని పేరుమీద గోన బుద్ధారెడ్డి రామాయణాన్ని ‘రంగనాథ రామాయణం’గా పిలువడంలో ఔచిత్యం లేదు. వైష్ణవ మతంలో శ్రీరంగ రంగనాథునికి ఎక్కువ ప్రాధాన్యం. గోన గన్నారెడ్డి వైష్ణవుడైన తర్వాత తన పేర రామాయణాన్ని రచించమని కోరడంతోనో ఏమో వైష్ణవ దైవమైన రంగనాథుని పేరుమీద ఈ రామాయణానికి ‘రంగనాథ రామాయణం’ అని లోకంలో ఈ మధ్యకాలం లో పేరు వచ్చి వుండవచ్చును.
గోన బుద్ధారెడ్డి ఆది కవీశ్వరుడైన వాల్మీకి మీద ఆదరణతో పుణ్యులందరు మెచ్చేటట్లుగా శ్రీరామ చరితను రాస్తానని అన్నాడు. కాని బుద్ధారెడ్డి జాతీయాభిమాని, దేశీయాభిమాని. జనపదుల పాటలను బాగా తెల్సినవాడు కాబట్టి అవాల్మీకమైన జానపదులు పాడుకొనే కథలు ఈ రామాయణంలో అలవోకగా వచ్చి చేరాయి. గోన బుద్ధారెడ్డి రామాయణము తెలంగాణ గడ్డమీద కాక తెలుగులోనే మొట్టమొదట రాయబడిన రామాయణ గ్రంథం. ఇది ఒక గొప్ప విశేషం. తెలంగాణకు గర్వకారణం.
ముదిగంటి సుజాతారెడ్డి 99634 31606