తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన, గొప్ప పరిపాలన చేసినవారు కాకతీయులు. కాకతి మొదటి బేతరాజు కాలం నుంచి ప్రతాపరుద్రుని కాలం వరకు వందల శాసనాలు వేయించబడ్డాయి. తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో వీరి శాసనాలు లభిస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథెనలో కాకతి గణపతిదేవుని కాలంనాటి శాసనంలో మంథెన మంత్రకూటంగా చెప్పబడింది. చెన్నూరి దేశపాలకుడైన అల్లుం ప్రోలరాజు వేయించిన ఈ శాసనకాలం శక సంవత్సరం 1121= క్రీ.శ.1199 సిద్ధార్థి సంవత్సరం మకర సంక్రాంతి.
ఈశాసనం మంత్రకూటంలోని గోపీజన వల్లభుడైన కృష్ణుని గూర్చిన ప్రార్థనతో మొదలవుతుంది. ఆ తర్వాత గణపతి, విష్ణువు అవతారమైన వరాహమూర్తి ప్రస్తావన ఉంది. ఓరుగల్లు రాజధానిగా కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన గణపతిదేవుని ప్రస్తావన ఉంది. అందులోనే అంచనార్యుడనే ఆచార్యుని గూర్చి పేర్కొనబడింది. వేదాంత శాస్త్రంలో పండితుడైన వ్యక్తి వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించి ఆలయం నిర్మించినట్లు శాస నం ద్వారా తెలుస్తున్నది. జక్కమాంబ కుమారుడైన మల్లికార్జున పండితుడు అద్వైతంలో మంచి పండితుడు.
కాకతీయ గణపతి దేవుని ఆనతిన చెన్నూరి దేశ పాలకుడు, ధర్మమతి అయిన అల్లుం ప్రోలరాజు గణపతిదేవుని పురోహితుడు, త్రిభువన విద్యాచక్రవర్తి బిరుదాంకితుడైన మంచిభట్టోపాధ్యాయునికి గోదావరి ప్రణీత నదుల మధ్య ప్రాంతంలో భూమిని దానమిచ్చినాడు. మంచనార్యుడు ఒక గ్రామాన్ని నిర్మించి, తటాకాన్ని తవ్వించి మంత్రకూట గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాల వారికి, మంచిభట్టోపాధ్యాయుల స్వకుటుంబీకులకు కూడా ఇచ్చినాడు. ఆ స్థలంలోనే మహాదేవ, కేశవదేవులను ప్రతిష్ఠించి, ఆలయం నిర్మించినాడు. మంత్రకూటంలోని గోపీజనవల్లభునికి ఆరామాన్ని సమర్పించినాడు.
మల్లికార్జునసూరి మంత్రకూట గోపీజనవల్లభునికి పలు ప్రాంతాల్లో భూములను దానం చేశాడు. అదేవిధంగా నాగవూరులో ఒక తటాకాన్ని నిర్మించి స్వామికి సమర్పించాడు. అల్లుం ప్రోలరాజు దౌహిత్రుడు సోమేశ్వరుడు గోపీ జనవల్లభునికి దానాదులు చేసినట్లు ఉన్నది.
మల్లికార్జునుడు కొంతమంది బ్రాహ్మణుల వద్దనుంచి కోఠపల్లి గ్రామాన్ని కొని దానికి మల్లికార్జునపురం అని పేరు పెట్టినాడు. అక్కడ ఒక చెరువు తవ్వించాడు. ఈ గ్రామాన్ని, తటాకాన్ని తిరిగి బ్రాహ్మణులకు, తన బంధువులకు దానమిచ్చినాడు. గ్రామం లో గణపతీశ్వర, లక్ష్మీనారాయణులను ప్రతిష్ఠించి ఒక బ్రాహ్మణుడికి ఇంటిస్థలాన్ని దానం గా ఇచ్చినట్లు కూడా తెలుస్తున్నది. ఇంకా వివి ధ స్థలాల్లో 20 ఇండ్లు కట్టించి బ్రాహ్మణులకు సమర్పణ చేసినాడు.
ఈ విధంగా శాసనంలో చాలావరకు ఆయా వ్యక్తులకు దానాలు, దేవప్రతిష్ఠలు, దేవాలయ నిర్మాణం, వాటికై దానధర్మాలు, తటాకాల నిర్మాణం వంటి అంశా లున్నాయి. ఒక్క శాసనంలో పలువురు అనేకవిధాలుగా దానం చేయడం, ఇండ్లు కట్టిం చి ఇవ్వడమనేది అరుదుగా కనిపిస్తుంది. కాక తీయుల కాలంలో శైవ వైష్ణ వ అభేదం పాటించబడిందనడానికి ఈ శాసనం ఒక ఉదాహరణ.