అమ్మవారు ప్రధానాంశ రూపాలలో ‘కాళి’ ఆరవది. మహాకాళి వేరు. బ్రహ్మదేవుడి వరంతో పాతాళం నుంచి వచ్చిన ‘శుంభ-నిశుంభ’ రాక్షసులు మానవ లోకాన్నేకాక దేవతా లోకాన్నికూడా తమ దౌర్జన్యంతో అల్లకల్లోలం చేశారు. దేవతలందరి ప్రార్థనతో శక్తిస్వరూపిణి దుర్గాదేవి వారిని సంహరించ డానికి వచ్చింది. అప్పుడు ఆ రాక్షసులు ముందుగా తమ సైన్యంలో ‘చండముండు’లను అమ్మవారిపైకి యుద్ధానికి పంపగా, ఆమె కోపంతో తన కనుబొమ్మలు ముడి వేశారట. ఆ కనుబొమ్మల ముడినుండి ‘కాళి’ పుట్టింది. ‘కనుబొమ్మల ముడి’ అంటే ‘ఆజ్ఞాశక్తి’. ఈమె ఉద్భవిస్తూనే నోరు తెరిచి శత్రుసైన్యంలోని రథ, తురగ, సైన్య బలాన్ని ‘చేతికందింది అందినట్లు’ నోట్లో వేసుకుంది. ‘ఏమిటీ భయంకర రూపం’ అంటే, అది కాలానికి ప్రతీక. కాలం అన్నిటినీ మింగేస్తుంది కదా.
ఉజ్జయిని మహాకాలుడిచేత ఎంతగా ప్రసిద్ధి చెందిందో, మహాకాళి చేతకూడా ఆ నగరం అంతే ప్రఖ్యాతిగాంచింది. మహాకాలుడు శివుడు, మహాకాళి అమ్మవారు. ‘కాళ’ అన్న శబ్దం లయ కారకమైంది. పుట్టించడమెలానో తినడమూ అలాంటిదే. ‘భగవద్గీత’లో భగవంతుడు, ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షిస్తున్నాను’ అంటాడు. కాలంలోంచి వచ్చిన వస్తువు కాలంలోకే వెళ్ళిపోతుంది. ప్రాణులన్నిటినీ పుట్టించి, గిట్టించేది కాలమే. ఆ కాలమే స్త్రీరూపంలో కాళిక. ఈమె ఉగ్రంగా కనపడుతుంది. కాళీదేవి కింద శివుడు పడుకొని ఉండటానికి కారణం, యుద్ధభూమిలో ఈ అమ్మవారు ఉగ్రంగా విజృంభిస్తుంటే ‘ఎలా ఆపాలో’ ఎవరికీ తెలియలేదట. పరమశివుణ్ని ప్రార్థిస్తే, ఆయన యుద్ధభూమిలో కెళ్ళి పడుకున్నాడట. ఆమె తాండవం చేస్తూ శంకరుడినీ తొక్కింది. స్పర్శచేత ‘తన భర్త’ అని తెలుసుకొని, ‘ఎంతటి అపచారం’ అని ఆగిపోయిందట. ఆమె ఆ స్థితిలోనూ అంతటి పతివ్రత. శక్తిని తట్టుకోవాలంటే శివుడు వుండాల్సిందే. అమ్మవారి ఉపాసకులకు శివభక్తి తప్పనిసరి. శివుని ఆరాధన తర్వాతే అమ్మవారిని కొలవాలి. ‘లలితా సహస్రనామాలు’ పారాయణం చేసేప్పుడు ‘శివాయ గురవే నమః’ అని పలుమార్లు జపించాకే, అసలు నామాలు మొదలు పెట్టాలి. ఆ గురువే శక్తిని తట్టుకొనే శక్తిని మనకిస్తాడు. మనకు ఆయన గురువు. శక్తికి ఆయన ఆధారమైతే, ఆయనకు శక్తి ఆధారం. జ్యోతిని ఆధారం చేసుకుని కాంతి ఉన్నట్టు, శివుని ఆధారంగా శక్తి ఉంటుందన్నదే ‘శివశక్తి తత్వం’. ఈ తల్లి దుర్గాదేవి అర్ధాంశ కనుక గుణంలోనూ, తేజస్సులోనూ దుర్గాదేవితో సమానమే. శరీరం నల్లగా ఉన్నా కోటిసూర్యప్రభలతో వెలుగుతుంది. నీలకాంతి వర్ణం ఈ తల్లిది. బలస్వరూపిణి. యోగసాధన చేసేవారికి ఆ యోగశక్తులను ప్రసాదిస్తుంది. ఒకసారి కాళికాదేవి శివునితో అందట.. ‘ఇంతవరకు నేను స్త్రీని. మీరు పురుషులు. ఇప్పుడు అటు ఇటు అవుదాం’ అని. అప్పుడాయన ‘సరే’ అన్నాడట. ఆ కాళియే కృష్ణుడు, శివుడే రాధాదేవి అయ్యారు. అందుకే, కృష్ణుడు నల్లన, రాధాదేవి తెల్లన. ఇందులోని మర్మం ఏమిటంటే, కాళీతత్వం, కృష్ణతత్వం ఒక్కటే. శివతత్వం రాధాతత్వమూ ఒక్కటే.
కాళి అమ్మవారు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో లోకాన్ని లోపలికి తీయగలదు, బయటికి విడువగలదు. ‘చండముండు’లను సంహరించినందున ఆమెకు ‘చండముండి’ అనే పేరుంది. ‘చమూ’ అంటే ‘సమూహం’. ‘భగవద్గీత’లో శ్రీకృష్ణుడు చెప్పినట్టు, ‘అనేక’ అంటే ‘అజ్ఞానం’. ఏకమే జ్ఞానం. అజ్ఞానభావం పోయి బ్రహ్మ విద్యాజ్ఞానం కలగాలని అర్థం. ఈ తల్లిని ఉపాసిస్తే ‘ధర్మార్థ కామమోక్షాల’ను ఇస్తుంది. మోక్షాన్ని బ్రహ్మవిద్యే ఇవ్వగలదు. ఏది తినగలదో, అదే ‘నేను నిన్ను తినను ’అని వదిలివేయనూ వచ్చు. అంటే, మనలను మృత్యువునుండి తప్పించగల తల్లి ఈమెయే. లోక క్షేమం కోసం ఆమెను ఆరాధిద్దాం.
వేముగంటి శుక్తిమతి
99081 10937