ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 108 కేంద్రాలు అతి క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. ఫలితంగా పలు రాష్ర్టాల్లో విద్యుత్ కోత విధించే పరిస్థితి ఏర్పడింది.
కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టిన తర్వాత పరిశ్రమలు పునఃప్రారంభించి అవసరాలకు తగ్గట్టు ఉత్పత్తులను అధికం చేశాయి. దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీనికి తగినంత బొగ్గు ఉత్పత్తి, సరఫరా జరగడం లేదు. గృహ, కార్యాలయాలు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలు తమ అవసరాలకు కూడా విద్యుత్తును అధికంగా ఉపయోగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్ నెలలో దాదాపు 15 శాతం అధికంగా విద్యుత్తు వినియోగించాయి.
థర్మల్ కేంద్రాలు, విద్యుత్తు ఉత్పత్తి కోసం 20 నుంచి 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచుకుంటాయి. కానీ ప్రస్తుతం విద్యుత్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు రెండు నుంచి మూడు రోజుల వరకు కూడా సరిపడా లేవని తెలుస్తున్నది. దీనికి కారణం.. బొగ్గు సరఫరా చేసే సంస్థలకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకపోవడం. విదేశాల నుంచి దిగుమతి చేసుకుందామన్నా అంతర్జాతీయ మార్కెట్లో బొగ్గు ధరలు బాగా పెరిగిపోయాయి. దీంతో బొగ్గును సమకూర్చుకోలేక థర్మల్ విద్యుత్ సంస్థలను మూసివేస్తున్న పరిస్థితి ఉన్నది. దీంతో దేశం విద్యుత్ సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కోవాల్సి వస్తున్నది.
మరోవైపు.. కరోనా సమయంలో తగినంత బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయాయి. ఉత్పత్తి అయిన బొగ్గును కూడా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ఆయా పరిశ్రమలకు సమయానుకూలంగా సరఫరా చేయలేదు. దేశంలో 70 శాతం విద్యుత్ ఉత్పత్తి, థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా జరుగుతున్నది. 80 శాతం బొగ్గు, కోల్ ఇండియాలోని 345 గనుల నుంచి సరఫరా అవుతున్నది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది. ఫలితంగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయాయి. మరోవైపు ఇప్పటిదాకా చైనా, ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్న బొగ్గు సరఫరా కావడం లేదు.
కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన విద్యుత్ శక్తి చట్టం- 2003, 2021 సవరణ చట్టం కూడా ఈ విద్యుత్ సంక్షోభానికి ఒక కారణం. ఈ చట్టం ప్రకారం.. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తు మొత్తం కేంద్ర పరిధిలోకి వెళ్లి సరఫరా నియంత్రణ చేస్తుంది. ఎక్కడో మారుమూల ఉన్న పల్లెకు విద్యుత్ సరఫరా చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆయా రాష్ర్టాలు ఇస్తున్న సబ్సిడీలు నిలిపివేయబడుతాయి. అందుకే చాలా రాష్ర్టాలు మోదీ ప్రభుత్వం తెస్తున్న విద్యుత్ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు తీవ్ర విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితులు విషమించకముందే మేల్కొని బొగ్గు కొరతను తీర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.
విద్యుత్తు కోసం బొగ్గుపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ వనరుల కోసం ప్రయత్నించాలి. సాంప్రదాయేతర వనరులైన సోలార్, గాలి మరల టైడల్ విద్యుత్ ఉత్పత్తి ఎంతో శ్రేయస్కరం. ఇలాంటి ప్రత్యామ్నాయాల వల్ల థర్మల్ ప్లాంట్లతో ఏర్పడే కాలుష్య ప్రభావం ఉండదు. సహజ వనరుల సంరక్షణ కూడా జరిగినట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో సోలార్ ప్లాంట్లను నెలకొల్పటానికి 80 శాతం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.
దండంరాజు రాంచందర్ రావు
83092 23872