ప్రకృతి అందాలతో ‘పారడైజ్ ఐలాండ్స్’గా పేరుగాంచిన లక్షద్వీప్ ఆందోళనలతో అట్టుడుకుతున్నది. ‘లక్షద్వీప్ను రక్షించండి’ అన్న నినాదం మార్మోగుతున్నది. నూతన పాలనాధికారి ప్రపుల్ ఖోడా పటేల్ను తొలగించాలని కరోనా కాలంలో నోటికి నల్లటి మాస్క్లు, తలకు నల్ల రిబ్బన్లతో డిమాండ్ చేస్తున్నారు. గత డిసెంబర్లో ప్రపుల్ ఖోడా నియామకం జరిగిన నాటినుంచే ఆందోళనలు మొదలయ్యాయి. లక్షద్వీప్లో దేశంలోనే అతితక్కువ నేరాలు జరుగుతాయి. ప్రశాంత జీవనానికి ఆలవాలమైన లక్షద్వీప్లో అలజడులు, ఆందోళనలు చెలరేగడమే ఆశ్చర్యకరం. ఇందుకు నూతన పాలనాధికారి తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే కారణమనే విమర్శలున్నాయి. పాలనాధికారి విధానాల మూలంగా తమ జీవన సంస్కృతులు విధ్వంసమవుతాయని లక్షద్వీప్ వాసులు ఆందోళన చెందుతున్నారు.
మనోహరమైన ప్రకృతి అందాలు, స్పటిక సమానమైన తెల్లటి ఇసుక తిన్నెలు స్వచ్ఛమైన సముద్రతీరాలు గల లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. దేశ ప్రధాన భూ భాగానికి 400 కిలోమీటర్ల దూరం లో అరేబియా సముద్రంలో ఉన్నది. 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ దీవుల్లో 65 వేల జనాభాలో 96 శాతం ముస్లింలు. కేరళకు అతి సమీపంలో ఉండటంతో మలయాళం వ్యావహారిక భాష. పాలనాధికారిగా పగ్గాలు చేపట్టిన మరుసటిరోజు నుంచే ఖోడా తనదైన తరహాలో పాలనకు ఉపక్రమించారు. లక్షద్వీప్ డెవలప్మెంట్ అథారిటీ, అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టం, జంతు సంరక్షణ చట్టం పేరిట ప్రజల్లో భద్రతా రాహిత్యాన్ని పెంచారు. అండమాన్, సింగపూర్లను తలదన్నేవిధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. పదివేలున్న పర్యాటకుల సంఖ్యను పదిలక్షలకు పెంచటమే లక్ష్యం అన్నారు. ఇప్పటివరకు లక్షద్వీప్లోని ఒక దీవిలోనే మద్యం అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు అన్ని దీవులలోనూ మద్యాన్ని అనుమతించడం వివాదాస్పదమైంది.
ఎటూ ఐదు కిలోమీటర్ల నిడివిలేని ద్వీప సముదాయంలో పర్యాటకరంగ అభివృద్ధి పేరిట నాలుగులేన్ల రహదారులు నిర్మిస్తున్నారు. తీరప్రాంత అభివృద్ధి అంటూ మత్స్యకారుల ఆవాసాలను నేలమట్టం చేస్తున్నారు. సహజ వనరుల వెలికితీత పేరుతో తవ్వకాలు చేపట్టడం వల్ల ప్రకృతి అందాలు ధ్వంసమవుతున్నాయి. మరోవైపు జంతు సంరక్షణ పేరుతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో మాంసం, గుడ్డును నిషేధించారు. ఈ చర్యలను నిరసిస్తూ ప్రధాని మోదీకి లేఖ రాసినందుకు పాఠశాల విద్యార్థులను కూడా అరెస్టు చేశారు. ఖోడా పాలనా విధానాలను నిరసిస్తూ అతన్ని ‘జీవాయుధం’గా ట్వీట్ చేసినందుకు ప్రముఖ నటి, దర్శకురాలు ఆయేషా సుల్తానాపై రాజద్రోహనేరం మోపడం విమర్శలకు తావిస్తున్నది. ఖోడాను బాధ్యతల నుంచి తప్పించాలని కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తమిళనాడుతో సహా దేశవ్యాప్తంగా పలు రాజకీయపక్షాలు ఖోడా చర్యలను నిరసిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్రం కలుగజేసుకొని లక్షదీవులను కాపాడాలి. ప్రజల ఆకాంక్షలను గౌరవించి అశాంతిని తొలగించాలి.