తెలంగాణలోని మహబూబ్నర్, నల్లగొండ, ఖమ్మం మండలాలతో తెలుగు చోడవంశీయులలో కందూరి చోడులు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. వీరు కళ్యాణీ చాళుక్యులకు సామంతులుగా ఉన్నారు. కాకతీయులు కూడా చాళుక్యుల సామంతులే. కొంతకాలం కాకతీ యులకు కూడా సామంతులుగా ఉండి ఆ తర్వాత స్వతంత్ర రాజులయ్యారు. ఈ రాజుల్లో ఏఱువ తొండయ చోడుడు-2, భీమదేవ చోడుడు, గోకర్ణ దేవ చోడుడు, ఉదయనచోడుడు, ఉదయాదిత్య దేవ చోడుడు ప్రసిద్ధి చెందినవారు.
రెండవ ఏఱువ తొండయ చోడుని (తొండరస చోడుడు) భార్య మైలాంబిక. ఈమె ద్రాక్షారామంలో ఒకటి, పానుగల్లులో రెండు శాసనాలు వేయించినది. పానుగల్లు శాసనాలు రెండింటిలో ఒకదానిపై శాసనకాలం లేదు. మరొకటి శ.సం. 1046= క్రీ.శ.1124 నాటిది. క్రోధి సంవత్సరం సూర్యగ్రహణ సమయంలో వేయించబడిన ఈ శాసనంలో కొన్ని అక్షరాలు చెదరినా విషయం అర్థమయ్యేవిధంగా ఉన్నది.
ఈ శాసనం పానుగల్లు పచ్చల సోమేశ్వరాలయం లో ఉంది. మైలాంబిక తొండరస మహారాజు దంపతులకు ముగ్గురు కొడుకులు. ఉదయాదిత్యుడు, భీమదేవుడు, గోకర్ణుడు. మైలాంబిక తన రెండవ కుమారుడైన భీమదేవ చోడుని క్షేమం కాంక్షించి అష్టోత్తర శత (108) మంది బ్రాహ్మణులకు అగ్రహారమును ఇచ్చి శాసనం వేయించింది. ఈ అగ్రహారానికి చోడ భీమ నారాయణపురం అని పేరు పెట్టింది.
మైలాంబిక విద్యావంతులచే అపర సరస్వతిగా కొనియాడబడింది. సేవకులు ఆమెను కులదేవతగా భావించి పూజించేవారట. ఆశ్రయించినవారికి అన్ని సంపదలను ఇచ్చే కరుణామూర్తిగా, వీరపత్నిగా, వీరమాతగా కీర్తించబడింది. కాలం పేర్కొనబడని ఇంకో శాసనం పానగల్లులో ఒక మహమ్మదీయ గోరీ వద్ద లభించింది. 11 పంక్తుల్లో ఉన్న ఈ శాసనంలో మైలాంబిక ‘పిట్టంపలి’్ల గ్రామాన్ని బ్రాహ్మణులకు, భీమనారాయణ దేవునికి దానమిచ్చు సందర్భంలో వేయించినట్టిది. ప్రతి గ్రామం నుంచి రెండు నివర్తనాల వరి పొలాన్ని, ఐదురకాల పన్నులను (కర పంచకం) రాజైన తొండయచోడుని అనుమతితో దానంగా సమర్పించినట్లు ఉంది.