ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావానికి లొంగని జీవనరంగం ఏదీ లేదు. అందులో విద్యారంగం చాలా తీవ్రమైన ప్రభావానికి లోనైన వాటిలో ఒకటి. విశేషించి పాఠశాల విద్య బాగా దెబ్బతిన్నది. ఉన్నతవిద్య కొంతలో కొంత తట్టుకోగలుగుతున్నది. దానికి కారణంఉన్నతవిద్యలో విద్యార్థులు కొంత పరిణత వయస్సులో ఉండటం. అంతర్జాల ఆధారిత సాంకేతిక సౌకర్యాలు వారికి తోడ్పడటం దీనికి ప్రధాన కారణం. కొవిడ్ రెండో దశ ప్రమాదకారిగా తయారై ఎనలేని నష్టాన్ని కలుగజేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నది. ఆయా కోర్సులకు కొత్త సెమిస్టర్ పాఠాలు మొదలుకావాల్సి ఉంటుంది.
పాఠశాల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనే సరైన బోధన. కానీ ఉన్న పరిస్థితిలో వారికి కూడా వీలైనంతవరకు ఒక రాజీమార్గంగానైనా ఆన్ లైన్ బోధన తప్పడం లేదు. ఉన్నతవిద్యలో పరిణత విద్యార్థులుండే కారణంగా ఆన్లైన్ బోధన పూర్తిగా ఫలవంతంగా చేయవచ్చు. ఇందులో కూడా రెండు ప్రధానమైన విధానాలు అవలంబించవచ్చు. ఒక ఉపాధ్యాయుడు తన కు ఉన్న యూట్యూబ్ ఛానెల్లో ఒక గంట పాఠాన్ని తన ఇంటివద్ద కానీ మరొకచోట కానీ రికార్డు చేసి పెట్టుకోవ చ్చు. దీని లింక్ను తన తరగతిలోని విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆ పాఠాన్ని విద్యార్థి తనకు అనుకూలమైన ఏ సమయంలోనైనా చూడవచ్చు, వినవచ్చు. ఆ పాఠాన్ని ఎన్ని సార్లయినా చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ పద్ధతిలో విద్యార్థి ప్రత్యక్షంగా అధ్యాపకుడిని ప్రశ్నలు అడగటం సమాధానాలు పొందడం సాధ్యం కాదు. కాకపోతే ఈ పద్ధతిలో విద్యార్థి అధ్యాపకునికి టెక్స్మెసేజ్ ద్వారా ప్రశ్నను పంపి అధ్యాపకుని నుంచి సమాధానాన్ని కూడా మెసేజ్ ద్వారానే పొందవచ్చు. ఈ పద్ధతిలో కొన్ని సౌకర్యాలు, అసౌకర్యాలున్నాయి. విద్యార్థి అధ్యాపకుని పాఠాన్ని లైవ్ గా చూసే, లైవ్లో మాట్లాడే సౌకర్యం ఉండవు.
ఇక రెండో పద్ధతిలో ఆన్లైన్ పాఠాలు పొందే విధానం లో మరికొన్ని కొత్త సౌకర్యాలున్నాయి. ఇక్కడ అధ్యాపకుడు జూమ్, గూగుల్, జియో వంటి మీటింగ్ సాఫ్ట్వేర్లను ఉపయోగించి పాఠాన్ని చెప్పవచ్చు. అధ్యాపకుడు మీటింగ్ ఐడీని క్రియేట్ చేసి దాని లింక్ను తన విద్యార్థులకు పంపి ఫలానా తేదీ ఫలానా సమయానికి పాఠం ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. దీనిప్రకారం ఆ విద్యార్థులందరూ పాఠానికి అదే సమయానికి హాజరవుతారు. ఆన్లైన్లోనే అదే సమయానికి లైవ్లో పాఠాన్ని చూడవచ్చు. అధ్యాపకుడు కూడా తెరమీద విద్యార్థులందరినీ చూసి ప్రశ్నించవచ్చు. ఒక సంవాదం అందరూ కలిసి చేయడానికి వీలవుతుంది. అది అసలు తరగతి గది పాఠానికి మంచి ప్రత్యామ్నాయమవుతుంది. తరగతి గది పాఠమంత సజీవంగా ఇది ఉండకపోవచ్చు. కానీ యూట్యూబ్ పాఠం కన్నా ఇది చాలా బాగుంటుంది. అప్పటికప్పుడే అధ్యాపకుడు, విద్యార్థి ఒకరికొకరు సంభాషించుకునే వీలుంటుంది.
అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు, పరిమితులున్నాయి. విద్యార్థులందరికీ వారున్న చోట ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలి. వారు ఐప్యాడ్లలో లేదా మొబైల్ ఫోన్లలోనూ పాఠం వినవచ్చు. కానీ కంప్యూటర్లో ఉండే అన్ని సౌకర్యాలు వీటిలో ఉండవు. సరైన బ్యాండ్ విడ్త్తో, సరైన వేగంతో ఇంటర్నెట్ పనిచేయాలి. ప్రస్తుత పరిస్థితులలో జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు వేగవంతమైన నెట్ను అందిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందే వీలుంది. లైవ్గా జరిగే ఈ పాఠాలు యూట్యూబ్ పాఠంలాగా పదే పదే వినే సౌకర్యం ఉండదు. కానీ ఇక్కడే అధ్యాపకుడు పైన చెప్పిన రెండు పద్ధతులను కలిపి ఆన్లైన్ పాఠాన్ని అందించవచ్చు. తను లైవ్గా మీటింగ్ కోసం చెప్పే పాఠాన్నే వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టవచ్చు. తనకున్న యూట్యూబ్ ఛానెల్లో పెట్టి విద్యార్థులకు యాక్సెస్ ఇవ్వవచ్చు. ఇదే పాఠాన్ని యూనివర్సిటీ సొంత వెబ్సైట్లో పెట్టి ఆ సెమిస్టర్ మొత్తం పాఠాన్ని అందుబాటు లో ఉండేలా చేయవచ్చు. సాంకేతికంగా ఈ రెండు విధానాలు ఇప్పటికే ఉన్న సౌకర్యాలతో చేయవచ్చు. ఈ రెండు పద్ధతుల్లో ఆన్లైన్ పాఠాలు చెప్పడానికి ముందుగా ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. ఆధునికమైన ఇంట ర్నెట్ సాంకేతికత, వీడియో సాంకేతికత యువతరం ఉపాధ్యాయులకు తెలిసి ఉండాలి. గ్రామీణ విద్యార్థులకూ కొంత శిక్షణ అవసరం కావచ్చు. ఏదేమైనా 2021-22 విద్యాసంవత్సరంలో ప్రారంభం కావలసిన సెమిస్టర్కు ఆన్లైన్ బోధన తప్పనిసరవుతుంది. ఈ పరిస్థితిని ఎదుర్కొని విద్యాసంవత్సరం విజయవంతంగా చేయడానికి ఆన్లైన్ బోధన తప్పనిసరి.
విశ్వవిద్యాలయాలు ఆన్లైన్ బోధనకు తమను తాము సిద్ధం చేసుకోవాలి. సైన్స్ విద్యార్థులు థియరీ భాగం వరకు ఈ పద్ధతిని అనుసరించే వీలుంది. మెథడాలజీ తరగతుల వరకు ఆన్లైన్ బోధన, పైన చెప్పిన పద్ధతిలో చేసుకోవచ్చు. ఈ వ్యాసరచయిత రిటైర్ ప్రొఫెసర్. సాహిత్య విమర్శ, జానపదానికి చెందిన ఫీల్డ్వర్క్ మెథడాలజీకి చెందిన పాఠాలను తెలుగు, ఇంగ్లిషులలో తయారుచేసి యూట్యూబ్ ద్వారా విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చాడు. పాఠాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారుచేసింది. గూగుల్ కూడా విద్యార్థులకు అపరిమితంగా స్పేస్ ఇవ్వడం, పాఠాలు చెప్పడానికి, వినడానికి దానిలోనే ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించింది. వీటిని అధ్యాపకులు విద్యార్థులు వినియోగించుకోవచ్చు.
సెమిస్టర్ చివరలో పరీక్షలు నిర్వహించడం తప్పనిసరి. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే ఎలా నిర్వహించుకోవాలని వర్సిటీలు ఇప్పటినుంచే వ్యూహాలు రచించుకోవాలి. పరోక్ష పద్ధతిలో పరీక్షలు నిర్వహించుకోవడానికి ఉన్న అవకాశాలు సాదక బాధకాలను చర్చించుకోవాలి. విశ్వవిద్యాలయాలు కొవిడ్ పరిస్థితిలో విద్యా పరిపాలన, విద్యాబోధన, పరిశోధన కొనసాగింపులు ఎలా అనే వ్యూహరచనతో ముందుకుసాగాలి. కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే చాలా సఫలమైన విధానాలను అమలు చేస్తున్నాయి. 70 శాతం పాఠ్యాంశాలను ఆన్లైన్లో తీసుకురాగలిగాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సాంకేతికతను, కంప్యూటర్ సాంకేతికతను వాడుకొని విద్యాసంస్థలన్నీ ఆన్లైన్ విద్యా ప్రణాళికలు చేసుకొని కొవిడ్ పరిస్థితిని అధిగమించవలసి ఉన్నది.
పాఠాల కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారుచేసింది. గూగుల్ కూడా విద్యార్థులకు అపరిమితంగా స్పేస్ ఇవ్వడం, పాఠాలు చెప్పడానికి, వినడానికి దానిలోనే ప్రత్యేకమైన
సౌకర్యాలు కల్పించింది. వీటిని అధ్యాపకులు విద్యార్థులు వినియోగించుకోవచ్చు.
–ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి