కరోనా మూలంగా దాదాపు ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసన దెబ్బతిన్నది. ఆన్లైన్ తరగతుల వల్ల పాఠశాలకు, సమాజానికి దూరం పెరిగిందనే అభిప్రాయం ఉన్నది. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నది. ‘ప్రథమ్’ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ‘అసర్’ సర్వే ద్వారా ఈ విషయం వెల్లడైంది. అసర్ 2020 వేవ్ 1 సర్వే గత ఏడాది సెప్టెంబరులో జరిగింది. సర్వే జరిగే నాటికి సుమారు ఆరు నెలల నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు కోవిడ్ కారణంగా మూతపడ్డాయి.
కరోనా వల్ల ప్రత్యక్ష తరగతులు చాలా కాలం లేకపోవడం, ఆన్ లైన్ తరగతులపై ఆధార పడటం వల్ల విద్యార్థుల అభ్యసనలో సమా జ భాగస్వామ్యం తప్పనిసరి అని ప్రభుత్వాలు కూడా భావించాయి. అందువల్లే సమాజంలోని వివిధ వర్గాల సహకారంతో పిల్లల అభ్యసన ఈ కాలంలో సాగింది. సమవయస్క బృంద అభ్యసనం గతంలోనూ ఉంది. అయితే ఈ మహమ్మారి కాలంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవడం జరిగింది. పూర్వ విద్యార్థుల సహకారం దేశవ్యాప్తంగా సగటున కేవలం 36.7 శాతం ఉంటే తెలంగాణలో దీనికి దాదాపు రెట్టింపుగా 72.2 శాతం ఉన్నది. ఏపీతోపాటు పదహారు రాష్ర్టాల సగటు కంటే ఇది ఎక్కువ. దక్షిణ భారతంలో తెలంగాణ ప్రథమస్థానంలో ఉన్నది. దీని అర్థం తెలంగాణలో పాఠశాల నుండి వెళ్ళిపోయిన విద్యార్థులతో బంధాన్ని పాఠశాలలు ఇంకా కొనసాగిస్తున్నాయని. వీరంతా ప్రస్తుత విద్యార్థుల కంటే కొన్ని సంవత్సరాల వయస్సు మాత్రమే ఎక్కువ కాబట్టి వీరి సహకారం ఉంటే పిల్లల అభ్యసన ప్రభావ వంతంగా కొనసాగుతుంది. వీరి సహకారం కూడగట్టడంలో తెలంగాణలోని పాఠశాలలు సఫలమయ్యాయి. గ్రామపెద్ద లేదా వార్డు సభ్యుల సహకారం విషయంలో జాతీయ సగటు 24.6శాతం ఉంటే తెలంగాణలో 34.7 శాతం ఉన్నది. పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారంలో జాతీయ సగటు 49.4 శాతం ఉంటే, తెలంగాణలో 66.7 శాతం ఉండటం గమనార్హం.
సర్వే జరిపే నాటికి పాఠశాలలు మూతపడి ఆరు నెలలు గడిచినా 68.1 శాతం పిల్లల దగ్గర పాఠ్యపుస్తకాలు ఉండటం కూడా సర్వేలో గమనించిన విష యం. ప్రభుత్వ పాఠశాలల్లో 89.3 శాతం పిల్లల దగ్గర, ప్రైవేటు బడుల్లో 37.1 శాతం విద్యార్థుల దగ్గర పుస్తకాలు ఉన్నాయి. చదువు విషయంలో కుటుంబసభ్యుల సహకారం పొందుతున్నవారి సంఖ్య 71.2 శాతంగా ఉన్నది. ఐదో తరగతి లోపు పిల్లల చదువుపై కుటుంబ సభ్యులు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని తెలుస్తున్నది. సర్వే జరిపిన కాలం లో బోధనాభ్యసన సామగ్రి పొందిన పిల్లల సంఖ్య కూడా తెలంగాణలో గణనీయంగానే ఉన్నది. సర్వే జరిపినవారిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 67.4 శాతం మంది బోధనాభ్యసన సామగ్రి పొందారు. వీరిలో మూడో వంతు మందికి ఉపాధ్యాయులు స్వయంగా అందజేయడం గమనార్హం.
బోధనాభ్యసన కృత్యాల విషయంలో కూడా తెలంగాణ విద్యార్థులు వెనుకబడలేదు. ఉపాధ్యాయులు పిల్లల ఇంటికి వెళ్ళి కృత్యాలను సరిచూడడం లేదా అందజేయడం వల్ల పిల్లలు బాగా చేయగలిగారు. ఆయా కృత్యాలను పిల్లల తరగతి వారీ వాట్సాప్ సమూహాల్లో షేర్ చేయడం ద్వారా మరి కొంత మంది పిల్లలు లబ్ధి పొందగలిగారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 75.1 శాతం టీవీ పాఠాలు చూస్తూ, 52.1 శాతం మంది వర్క్ షీట్లను చూస్తూ కృత్యాలు చేయగలిగారు. సర్వే జరిగిన వారం రోజుల పరిస్థితినే చూస్తే మూడు కంటే ఎక్కువ కృత్యాలను చేసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య 49.3 శాతంగా ఉంది. మరో 25.7 శాతం పిల్లలు రెండు కృత్యాలను చేశారు. అం టే దాదాపు 75 శాతం విద్యార్థులు ఒక్క వారంలో రెండు కంటే ఎక్కువ కృత్యాలను చేశారన్నమాట.
పాఠశాలలు మూతపడి ఉన్నప్పుడు ఉపాధ్యాయుడితో తల్లిదండ్రులు లేదా పిల్లల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయనేది కూడా అసర్ సర్వే పరిశీలించింది. ప్రభు త్వ ఉపాధ్యాయులు ఈ సర్వే కాలంలో పిల్లల ఇండ్లకు వెళ్ళడం లేదా వారికి ఫోన్ చేయడం గానీ 67.5 శాతం విద్యార్థుల విషయంలో జరిగింది. ఈ సంఖ్య జాతీయ స్థాయిలో 46.9 శాతం గా ఉంది. తెలంగాణలో 52.4 శాతం సందర్భాల్లో ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫోన్ చేశారు. తెలంగాణలో ఉభయుల సంబంధాలు దెబ్బతినలేదని దీనివల్ల తెలుస్తున్నది.
సమాజంతో పాఠశాలల సంబంధాలు కొనసాగడానికి తెలంగాణ పాఠశాల విద్యాశాఖ చేపట్టిన చర్యలు ప్రధాన కారణం. టీవీ పాఠాల నిర్వహణ, వాట్సాప్ ద్వారా పాఠాల సమాచారం చేరవేత, కృత్యపత్రాల రూపకల్పన, ఉపాధ్యాయులు కృత్యపత్రాలను వాట్సాప్లో స్వీకరించి సరిచేయడం మొదలైన వాటిద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులతో సత్సంబంధాలను పాఠశాల విద్యాశాఖ కొనసాగించింది. విద్యార్థుల ఇండ్లకు వెళ్ళడం, అక్కడే సందేహాలను నివృత్తి చేయడం, ఆన్ లైన్ పాఠాల నిర్వహణ మొదలైన చర్యల ద్వారా ప్రభుత్వ కృషికి ఉపాధ్యాయుల అంకి త భావం తోడవడం సత్సంబంధాల పెంపుదలకు ఊతమిచ్చింది. గత ఏడాదిన్నర కాలంగా పిల్లలు పూర్తి స్థాయిలో పాఠశాల నుండి లబ్ధి పొందలేకపోవచ్చనే ఆలోచనతో ముందుగా ఆ అంతరాన్ని పూరించేందుకు బ్రిడ్జి కోర్సు పాఠాలను రూపొందించారు. సమాజ సంబంధాల కొనసాగింపులోనూ, పిల్లల అభ్యసనాభివృద్ధి లక్ష్యంలోనూ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ- ఎస్సీఈఆర్టీ ఉన్నతాధికారుల కార్యాచరణ ప్రణాళిక, క్షేత్రస్థాయి అధికారుల పర్యవేక్షణ, ఉపాధ్యాయుల అంకిత భావం సత్ఫలితాలనియన్న ఆశాభావం విద్యారంగ అభిమానుల్లో ఉన్నది.
సమాజ సంబంధాల కొనసాగింపులోనూ పిల్లల అభ్యసనాభివృద్ధి పెంపుదలలోనూ ప్రభుత్వ ఆశయం, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ- ఎస్సీఈఆర్టీ ఉన్నతాధికారుల కార్యాచరణ ప్రణాళిక, ఉపాధ్యాయుల అంకిత భావం సత్ఫలితాలనిస్తుందన్న ఆశాభావం విద్యారంగ అభిమానుల్లో ఉన్నది…పిల్లల అభ్యసనలో తల్లిదండ్రులు, సంరక్షకుల సహకారంలో జాతీయ సగటు 49.4 శాతం ఉంటే, తెలంగాణలో 66.7 శాతం ఉండటం గమనార్హం.
డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు (వ్యాసకర్త: జిల్లా సమన్వయకర్త; ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ మొబిలైజేషన్ మీడియా,సమగ్ర శిక్ష, మెదక్ జిల్లా )