ఉద్యోగ మిత్ర ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలంగాణ సర్కార్ మరోమారు రుజువు చేయబోతున్నది. వేతన సవరణ, కారుణ్య నియామకాలు, 50వేల ఉద్యోగాల నియామక నోటిఫికేషన్ విడుదల, పదవీ విరమణ వయసు పెంపుతోపాటు ఉద్యోగుల సమస్యలన్నింటినీ ఒకే దఫా పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూత్రప్రాయంగా నిర్ణయించడం గమనార్హం. నిజానికి ఏడాది కిందట ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడే కరోనా కష్టకాలం వచ్చిపడింది. లాక్డౌన్ కారణంగా నెలల తరబడి జనజీవనం స్తంభించింది. సకల ఉత్పత్తిరంగాలు నిలిచిపోవడంతో రాష్ర్టానికి పన్నుల రాబడి పూర్తిగా పడిపోయింది. కానీ కొవిడ్ అనంతర పరిస్థితుల్లో అతివేగంగా పుంజుకున్న రాష్ర్టాల్లో తెలంగాణ- దేశంలోనే అగ్రభాగాన నిలిచింది. దీంతో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నది.
ఆర్థిక రంగం పూర్వస్థితికి చేరుకోవడానికి మరికొంతకాలం పట్టే అవకాశం ఉన్నప్పటికీ ఉద్యోగుల సంక్షేమాన్ని విస్మరించకూడదనేది ముఖ్యమంత్రి మనోగతం. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి అనుసరించే విధానం ఎప్పుడూ సౌహార్దపూరితంగానే ఉంటున్నది. లాక్డౌన్ గడ్డు పరిస్థితుల్లో వేతనాల్లో తాత్కాలికంగా కొంత కోత విధించవలసి వచ్చింది. అప్పుడు ఉద్యోగులు కూడా పరిస్థితిని అర్థం చేసుకున్నారే తప్ప, అభ్యంతరం చెప్పలేదు. అనతికాలంలోనే, ఆర్థిక అనిశ్చితి నుంచి పూర్తిగా బయటపడకముందే, రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలను ఉద్యోగులకు చెల్లించింది. ఉద్యోగులు ఆందోళనకు దిగడం కాదు గదా, కనీసం నోరువిడిచి అడగకముందే ముఖ్యమంత్రి డబ్బులు చెల్లించడం గమనార్హం. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గల సామరస్య సంబంధాలకు ఇదొక తాజా ఉదాహరణ.
తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను భారీ ఎత్తున చేపట్టింది. వేతనాల పెంపు కూడా సంతృప్తికరంగానే సాగింది. అంగన్వాడి కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వంటి చిరుద్యోగుల విషయంలో ముఖ్యమంత్రి మరింత ఔదార్యంతో ఉంటారు. పదవీ విరమణ చేసిన వారి పట్ల మానవీయంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించడం తెలిసిందే. తాజాగా 9.50 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు నిర్ణయించారు. వారి క్రమబద్ధీకరణలో న్యాయపరమైన చిక్కులు వచ్చినా సరే, ముఖ్యమంత్రి వేతనాల విషయంలో విశాల దృక్పథంతో ఆలోచించారు. అందువల్లనే ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య ఎడబాటును సృష్టించాలనే కొందరి కుయుక్తులు సఫలం కాలేదు. కేసీఆర్, ఉద్యోగుల మధ్య ఎన్నడూ ద్వైదీభావం లేదు. అది ఉద్యమమైనా, పరిపాలన అయినా అందరి లక్ష్యం సమాజ సంక్షేమమే. బంగారు తెలంగాణ నిర్మాణమే.