ముక్కుసూటితనం, మచ్చలేని రాజకీయ జీవితం, నిండైన అమాయకత్వం వెరసి మానేని సత్యనారాయణరావు. ఈ పేరు చెప్తే వెంటనే స్ఫురణకు రాకపోవచ్చు కానీ, ఎమ్మెస్సార్ అంటే మాత్రం తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎమ్మెస్సార్ మృతితో తెలంగాణ ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ కలిగిన పాత తరం నాయకుడిని కోల్పోయింది.
కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం వెదిర గ్రామంలో 1934, జనవరి 14న జన్మించిన ఎమ్మెస్సార్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై స్పందించేవారు. 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి లాంటి నాయకులతో కలిసి చురుకుగా పాల్గొన్నారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి ఎంపీగా గెలుపొందిన ఎమ్మెస్సార్, ఆ తర్వాత మరో రెండు పర్యాయాలు కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. పద్నాలుగేండ్ల పాటు ఎంపీగా కొనసాగారు. 1980- 1983 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెస్సార్కు ఇందిరాగాంధీతో సన్నిహిత సంబంధాలు ఉండేవి.
1990-94 వరకు ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఎమ్మెస్సార్ 2000-2004 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004-07 వరకు వైఎస్ఆర్ మంత్రివర్గంలో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖలు నిర్వహించారు. 2007 తర్వాత మళ్లీ ఆర్టీసీ చైర్మన్గా సేవలందించారు. 1977-79 లోకసభ సభ్యుడిగా, హౌజ్కమిటీ బాధ్యునిగా ఆస్ట్రేలియా, ఇతర దేశాలకు పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో వెళ్లారు.
ఎమ్మెస్సార్ అంటే కాంగ్రెస్ పార్టీలో తెలియని వారుండరు. ముఖ్యంగా ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కొనసాగించేవారు. నెహ్రూ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఎమ్మెస్సార్కు గుర్తింపు ఉన్నది. నాగర్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభ సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూను కలిశారు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్తో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. నెహ్రూతో నిజామాబాద్ను సందర్శించినప్పుడు ఆయన తన భావాలను వ్యక్తం చేసినట్లు చెప్పేవారు. గత పదేండ్లుగా ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
రాజకీయాలకు దూరంగా, పైలెట్గా ఉన్న రాజీవ్గాంధీని, ఇందిర కోరిక మేరకు ఒప్పించి తానే రాజకీయాల్లోకి తీసుకువచ్చానని చెప్తుండేవారు. రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎమ్మెస్సార్కు కొన్నిరోజుల కిందట కరోనా మహమ్మారి సోకింది. నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
రామకిష్టయ్య సంగనభట్ల