ఈ మధ్యకాలంలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య తగ్గుతున్నదని ఐరాస సంస్థ ‘యూనెస్కో’ పేర్కొనడం గమనార్హం. ఇదే విషయాన్ని అనేక అధ్యయన సంస్థలు కూడా తెలియజేశాయి. ఆంగ్ల మాధ్యమాల మోజులో తెలుగు అభ్యసనం నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలోనే తెలుగులో చదువుకున్నవారు, మాట్లాడేవారు న్యూనతకు లోనయ్యే దుస్థితి ఏర్పడింది. దీనివల్ల మన భాష, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు ఈ తరంతో పాటు భవిష్యత్ తరాలు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. ఈ పరిస్థితిని అధిగమించి ‘తెలుగు’ను ప్రతి ఒక్కరూ అభ్యసించేలా చేయడం తక్షణ అవసరం.
వనరులను సమకూర్చడం, అన్ని పాఠశాలల్లో తెలుగును సమర్థవంతంగా బోధించడానికి అధ్యాపకులను నియమించాలి. దీనికి తోడు విద్యార్థులు నేర్చుకోడానికి వీలుగా పాఠశాలల్లో గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలి. బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చాలి. అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతికతను వినియోగించాలి. డిజిటల్ పాఠాల బోధనను చేపట్టాలి.
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్రంలోని విద్యార్థులందరూ తప్పనిసరిగా తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలని ఆకాంక్షించారు. దీనికి చట్టాన్ని రూపొందిస్తామని 2017 డిసెంబర్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారం భ, ముగింపు సమావేశాల్లో ప్రకటించి తన భాషాభిమానాన్ని చాటారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. కమిటీ సభ్యులు పంజాబ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ర్టాలతో పాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాలు వంటి సంస్థలను సందర్శించి, వాటిలో భాషా వినియోగం, వివిధ భాషల అభ్యసనం, అమలు తీరుతెన్నులను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ముఖ్యమంత్రి ఈ నివేదికను పరిశీలించి, చర్చించి 1 నుంచి 10వ తరగతి వరకు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, అన్ని మాధ్యమాలకు చెందిన పాఠశాలల్లో తెలుగును తప్పనిసరి బోధనాంశంగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా 2018 మార్చిలో జరిగిన శాసన సభ, శాసనమండలి సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తెలుగును బోధించడం, నేర్చుకోవడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం చట్టం రూపొందించింది.
చట్టంలోని అంశాలను అమలుపర్చటానికి అవసరమైన విధివిధానాలు, వివిధ అంశాలతో 2018 జూన్ 1న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వును విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు, అన్ని మాధ్యమాలకు చెందిన పాఠశాలల్లో 2018-19 నుంచి తెలుగును విధిగా బోధించాలని తెలుపుతూ పాఠశాల విద్యాశాఖ 2018 జూన్ 29న ఉత్తర్వులు జారీ చేసింది.
దీన్ని అనుసరించి.. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలు అన్నిరకాల పాఠశాలల్లో 2018-19 నుంచి తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుపరుస్తున్నారు. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగు ఇప్పటికే అమల్లో ఉన్నది. అయితే ఇతర మాధ్యమ పాఠశాలల్లో అంటే ఉర్దూ, హిం దీ, కన్నడ, తమిళం, బెంగాళీ, మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ పాఠశాలల్లో కూడా తెలుగును దశలవారీగా అమలుపరుస్తారు. అంటే ఇప్పటివరకు తెలుగును అమలుచేయని పాఠశాలల్లో 2018-19 నుంచి 1వ తరగతితో ప్రాథమిక స్థాయిలో ప్రారంభించి సంవత్సరానికి ఒక తరగతి చొప్పున అన్ని తరగతులకు విస్తరిస్తారు. అట్లాగే ఉన్నత పాఠశాలల్లో 2018-19లో 6వ తరగతితో ప్రారంభించి ఒక్కో సంవత్సరానికి ఒక తరగతి చొప్పున విస్తరిస్తారు.
ఇతర మాధ్యమ పాఠశాలల్లో తెలుగు బోధించడానికి ఉపాధ్యాయులను లేదా విద్యా వాలంటీర్లను ప్రభుత్వం నియమిస్తుంది. ఏ పాఠశాలలో అయి నా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ రూపొందించిన తెలుగు వాచకాలనే వినియోగించాలి. ఇందుకోసం 2018-19లో ఇతర మాధ్యమ పాఠశాలల విద్యార్థులు తెలుగు నేర్చుకోవడానికి 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించారు. ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 17, 2014 మే 14 ప్రకారం నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తెలుగు భాష కోసం నిర్వహించాలి. 10వ తరగతిలో ప్రభుత్వం నిర్దేశించిన కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాల్సి ఉంటుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలల్లో తెలుగుతో పాటు ఆంగ్లాన్ని అభ్యసిస్తారు, నేర్చుకుంటారు. ఇది గతంలో వలె కొనసాగుతుంది. అయితే ఇతర మాధ్యమాలు అనగా ఉర్దూ, హిందీ, బెంగాళీ, తమిళం, కన్నడ, మరాఠీ మాధ్యమ పాఠశాలల్లో ఇప్పటివరకు వారి మాతృభాష, ఆంగ్లాన్ని మాత్రమే నేర్చుకుంటున్నారు. 2018-19 నుంచి తెలుగును కూడా తప్పనిసరిగా బోధించాలి. అట్లాగే ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో తెలుగును నేర్చుకొంటున్నారు. అయితే ఇతర మాధ్యమ పాఠశాలల్లో 2018-19 నుంచి తెలుగు, ఆంగ్లం భాషలతోపాటు తృతీయ భాషగా హిందీ/ఉర్దూ/సంస్కృతం/వారి మాతృభాషలలో ఏదైనా ఒక దానిని కూడా నేర్చుకోవచ్చు.
సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో రెండు భాషలనే నేర్చుకుంటారు. దీంట్లో ఆంగ్లం తప్పనిసరి. అయితే ద్వితీయ భాషగా తెలుగు నేర్చుకునే అవకాశం ఉన్నది. కానీ తప్పనిసరి కాదు. కాబట్టి తాజా చట్టం వల్ల తప్పనిసరిగా తెలుగును నేర్చుకోవాల్సి ఉంటుంది. వారి మాతృభాషను తృతీయ భాషగా నేర్చుకోవచ్చు. 5వ తరగతి వరకు తెలు గు చదవకుండా 6వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థుల కోసం సరళమైన తెలుగు వాచకాలను చదవడం, రాయడం, చేయగలిగేలా రూపొందించారు. 5వ తరగతి వరకు తెలుగు చదివినవారికి 6వ తరగతిలో సాధారణ తెలుగు వాచకం ‘నవ వసంతం’ను వినియోగించాలి. 1వ తరగతిలో కూడా తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో సాధారణ తెలుగువాచకం ‘జాబిలి-1’ ని, ఇతర మాధ్యమాలలో ‘తేనె పలుకులు-1’ సరళమైన తెలుగు వాచకాన్ని వినియోగించాలి. ఎవరైనా పిల్లలు 7వ తరగతి వరకు తెలుగు చదవకుండా 8వ తరగతిలో లేదా ఆపై తరగతుల్లో మన రాష్ట్రంలో విద్యను అభ్యసించడానికి పాఠశాలల్లో ప్రవేశం పొందితే వారు ‘తెలుగు’ నేర్చుకోవడానికి మినహాయింపు ఇస్తారు. అయితే దీనికి సంబంధిత జిల్లా విద్యాధికారి ద్వారా సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ అధికారికి దరఖాస్తు చేసుకొని మినహాయింపు పొం దాల్సి ఉంటుంది.
తెలుగు తప్పనిసరి చట్టాన్ని ఉల్లంఘించడం అంటే.. ఎ.తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా బోధించకపోవడం. బి.తెలుగు భాషోపాధ్యాయుడిని / బోధకుడిని తెలుగును బోధించడానికి కేటాయించకపోవడం. సి.రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రభుత్వ తెలుగు పాఠ్యపుస్తకాలను వినియోగించకపోవడం. డి.చట్టంలో పేర్కొన్న ఇతర నియమాలను పాటించకపోవడం. పైన తెలిపిన విధం గా ఏదైనా ప్రైవేటు యాజమాన్యానికి చెందిన పాఠశాలలు తెలుగును తప్పనిసరి బోధనాంశంగా అమలుచేయడంలో విఫలమైతే చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తారు.
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో తెలుగును తప్పనిసరిగా బోధించడాన్ని పరిశీలించి చర్యలు చేపట్టడానికి రాష్ట్రస్థాయిలో ఒక కమిటీని, అట్లాగే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్లాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. ఈ కమిటీలు మొదటి సంవత్సరంలో ప్రతి మూడు నెలలకో ఒకసారి, రెండవ సంవత్సరం నుంచి ఆరు నెలలకోసారి సమావేశమై సమీక్షించి తగు చర్యలు చేపట్టడానికి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తుంది.
రాష్ట్రంలోని అధికారులు, మానిటరింగ్ సభ్యులు, ఉపాధ్యాయులు మొదలైన వారందరికీ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ ఏటా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయ విద్యా కళాశాలల ప్రిన్సిపల్స్, ఉపవిద్యాధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అట్లాగే ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు మొదలైన వారికి జిల్లా విద్యాధికారి నేతృత్వంలో జిల్లాస్థాయిలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వనరులను సమకూర్చడం, అన్ని పాఠశాలల్లో తెలుగును సమర్థవంతంగా బోధించడానికి అధ్యాపకులను నియమించాలి. దీనికి తోడు విద్యార్థులు నేర్చుకోడానికి వీలుగా పాఠశాలల్లో, గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలి. బోధనాభ్యసన సామగ్రిని సమకూర్చాలి. అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతికతను వినియోగించాలి. డిజిటల్ పాఠాల బోధనను చేపట్టాలి. ముఖ్యంగా పాఠశాలల్లో బాలసాహిత్యం పిల్లలకు అందుబాటులో ఉంచడం ద్వారా తెలుగు ను నేర్చుకొనే వాతావరణాన్ని కల్పించాలి.
రాష్ట్రంలో తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అన్ని పాఠశాలల్లో బోధించాలి. తద్వారా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సంప్రదాయాలు వంటి వి పిల్లలు అర్థం చేసుకొని, వాటి గొప్పదనాన్ని గుర్తించి గౌరవించేలా చేయాలి. తెలుగేతరులు తెలుగును నేర్చుకోవడం ద్వారా తెలంగాణ సమాజంతో మమేకమై, ఉన్నతమైన మానవ సంబంధాలను నెలకొల్పాలి. ఈ సదుద్దేశంతో రూపొందించిన చట్టాన్ని అమలుపరచడంలో అందరూ భాగస్వాములు కావాలి.(వ్యాసకర్త: తెలుగు పాఠ్యపుస్తకాల కో-ఆర్డినేటర్, తెలుగు అమలు కమిటీ సభ్యుడు ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ మాజీ సభ్యుడు)
–సువర్ణ వినాయక్