‘నాయకుడన్నవాడికి నోటి పస ముఖ్యం’- ఇది నేటి రాజకీయ సామెతల్లో ఒకటి. ‘నోటి పస లేనివాడు ఓటుకు పనికివస్తాడా’ అనేది మరొక కొత్త సామెత.ఎంత బలవంతుడైన రాజకీయ నాయకునికైనా వక్తృత్వ కళ ఉంటే బంగారానికి తావి అబ్బినట్లు అవుతుంది. నాటి తెలుగు ప్రధాని పీవీ గారికి ‘మౌన ముని’ అనే బిరుదు కాని బిరుదు ఉండేది. వక్తగా ఆయనను ఏ మాత్రం పరిగణించేవారు కారు. కానీ ఆయన రాణించడానికి ఐదేండ్లు నిరాఘాటంగా ప్రధానిగా పనిచేయడానికి ఆయనకు వేరే శక్తులు తోడ్పడ్డాయి. అమెరికా అధ్యక్షుడిగా నిలబడ్డవారికి వక్తృత్వం బాగా బలంగా ఉండటం అనేది ఒక మంచి ప్రధానమైన అవసరమైన లక్షణంగా అక్కడ పరిగణిస్తారు. వక్తృత్వం లేనివారు అక్కడ ఆ పదవిలో నెగ్గడం చాలా కష్టం. ప్రజల ముందు నిలబడి తన ప్రత్యర్థికి సరిగ్గా ఎదురుగా నిలిచి తన వాదాన్ని గట్టిగా సూటిగా ప్రతిభావంతంగా వినిపించినవాడే అక్కడ అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు. ఈ లక్షణం ఇక్కడ కూడా బాగా పనిచేస్తుంది.
నాయకుడికి వాదించే శక్తికి తోడు సేకరించిన గట్టి విషయం ఉండి, దానిని సృజనాత్మకంగా చెప్పగలిగితే ఇక అతని శక్తికి అగ్నికి వాయువు తోడైనట్లే. ప్రజల ముందు ఇలా నిలిచిన వారికి విజయం నల్లేరుపైన బండి నడక అవుతుంది. భారతదేశంలో నేడున్న అన్ని పార్టీల యువ నాయకుల్లో కేటీఆర్ చాలా ప్రముఖంగా కనిపిస్తాడు. జాతీయస్థాయిలో మీడియాలో బలంగా కనిపించే యువ నాయకులలో కేటీఆర్ అగ్రశ్రేణిలో కనిపిస్తాడు. ఇలా కనిపించడానికి అతనికున్న పైన చెప్పిన ఉత్తమ వక్తృత్వ లక్షణాలు ముఖ్యకారణాలు.
కొంత వెనకకు పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనుకుంటా శాసనసభలోనే అని నాకు బాగా గుర్తుంది. నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ చాలా చల్లగానైనా ‘నల్లారి వారి తెలివి తెల్లారినట్లే ఉంది’ అని విమర్శించాడు. కేటీఆర్ అప్పుడు విషయాన్ని వివరించి చెప్పిన తర్వాత నాటి ముఖ్యమంత్రికి మాటలు దొరకలేదు. అదీ కేటీఆర్లోని సమయస్ఫూర్తి. ఇక్కడ ఈ వాక్యాన్ని కేటీఆర్ అలవోకగా చెప్పాడు. కిరణ్కుమార్ ఇంటిపేరు నల్లారి అనే దాన్ని ఠక్కున పట్టుకోవడం దానికి ప్రాస తూగేలాగా తెల్లారినట్లే ఉంది అని చెప్పడం. చాలా బలంగా పనిచేసింది. ‘తెలివి తెల్లారినట్లే ఉంది’ అనేది మంచి తెలుగు పలుకుబడి. ఉపన్యాసానికి, సామెతలు పలుకుబడులు అంటే ఇడియమ్స్ చాలా బలాన్ని ఇస్తాయి. కాని వాటిని సరిగ్గా వాడటం తెలియకపోతే మిస్ ఫైర్ కూడా అవుతాయి. కేటీఆర్ పలుకుబడిని చాలా బలంగా వాడటంలో మంచి ప్రజ్ఞ చూపిస్తాడు. అంతేకాదు ఏనాడైనా ఝటితిగా అనర్గళంగా ప్రసంగించడమే కాని కాగితం చూచి ఉపన్యాసాన్ని చెప్పడం ఆయన చేయడు. ప్రత్యేకించిన సెమినార్ వంటి వాటిలోనే టెక్స్ట్ని చదవడం బాగుంటుంది.
గడచిన ఐదారేండ్లలో కేటీఆర్ ప్రసంగాలు చాలా విన్నాను. కానీ ఆయన చేసిన ఇటీవలి ప్రసంగాలు ప్రకటనలలో నుంచే కొన్ని విషయాలను ఇక్కడ ఉటంకించి ఆయన వక్తృత్వంలో సృజనాత్మకశక్తిని, నైపుణ్యంతో అవతలివాడి విమర్శను తిప్పి కొట్టి అతడిని భ్రష్టు పట్టించడం ఇక్కడ ప్రస్తావిస్తాను. వాటిని కేటీఆర్లో బాగా చూడవచ్చు.
తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం చేసిన వాగ్దానం, ఇచ్చిన ఉద్యోగాల గురించి చర్చ, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీగా పోటీచేసిన బీజేపీ ప్రత్యర్థి రాంచంద్రరావు, ‘నేను బహిరంగ ముఖాముఖి చర్చకు సిద్ధం, కేటీఆర్ రావాలి’ అని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఒక టేబుల్ పెట్టి అటొక కుర్చీ ఇటొక కుర్చీ వేసుకొని కొంతమంది కార్యకర్తలని వెనుకబెట్టుకొని కూర్చొని ట్వీట్లు చేస్తూ కూర్చొన్నాడు. కేటీఆర్ అంతకుముందే విస్పష్టమైన సమాచారంతో 1,38,899 ఉద్యోగాలు ప్రభుత్వం ఇచ్చినట్లు ఆధారాలతో ప్రకటన చేశారు. కానీ ప్రత్యర్థి ఇంకా ఏదో చర్చ చేయాలని దానికి అవతలివాడు రాకుంటే ఇది అబద్ధం అని చెప్పాలని ఉద్దేశంగా పెట్టుకున్నాడు.
ఈ ఎత్తుగడని కనిపెట్టిన కేటీఆర్ దానికి సరిగ్గా తిరుమంత్రం వేశాడు. తాను కూడా ట్వీట్ చేశాడు. బీజేపీ 12 కోట్ల ఉద్యోగాలిస్తానని వాగ్దానం చేసింది. ‘మీరిస్తామన్న ఉద్యోగాలు వెదుకుతున్నా వాటి వివరాలు ఎక్కడ ఉన్నాయా అని ఇంకా వెదుకుతున్నాను’. అని ట్వీట్ చేసి అవతలివాడి నోరు నొక్కాడు. అంతే కాదు NDA అంటే No Data Availabel అని NDAకి కొత్త అర్థం చెప్పి ట్వీట్ చేస్తూ ప్రత్యర్థికి దిమ్మతిరిగేలా సమాధానం చెప్పాడు. ఆ ప్రహసనం అక్కడ ఆగిపోయింది. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గడచిన ఆరేండ్లలో ఎంత తక్కువ ఉద్యోగాలు ఇచ్చాయో అంకెలు చూపిస్తూ అవతలివారిని నోరు మూపించే పనిచేశాడు. ఇక్కడ బిజేపీ NDAలో భాగమని గుర్తుంచుకొని దానికి ఉన్న అసలు అర్థం (National Democratic Alliance) అనే అర్థాన్ని భ్రష్టుపట్టిస్తూ ఈ అబ్రివేషన్కి కొత్త అర్థం చెప్పాడు నో డేటా అవైలబుల్ అని. దీని వెనుక ఇంకో అర్థం కూడా ఉంది. నేను నీ ఎదురుగా మాట్లాడే స్థాయి కాదు నీది అని ప్రత్యర్థికి చెప్పడం ఉంది. ఇలా కొత్త అర్థాలు సృష్టిస్తూ వాక్చమత్కారాన్ని ప్రదర్శించడంలోనే నాయకుడి సృజనాత్మక శక్తి ఉంటుంది. కేటీఆర్లో అది చాలా ప్రతిభావంతంగా ఉంది.
‘అసత్యాల పునాదుల మీద పేకమేడలు కట్టుకోవడం, అసలు నిజాలు కప్పిపుచ్చడం, విపక్షాలకు పనిగా మారింది’ ఈ వాక్యం ఆయనదే. ‘బండి అంతా తొండి’ అనడం, ఐటీఐఆర్ విషయంలో ‘బండి సంజయ్ లేఖ అబద్ధాల జాతర’ అని అనడం. మీ ప్రాంతాల్లో ఎందుకు అమలు కాలేదని సూటిగా అడగడం అనేది నాయకునికి ప్రధానంగా ఉండవలసిన కీలెరిగి వాతపెట్టడం అనే నైపుణ్యం. ఈ నైపుణ్యం కేటీఆర్కు వెన్నతో పెట్టిన విద్య వంటిది.
‘మేకిన్ తెలంగాణ అంటే మేకిన్ ఇండియా కాదా, తెలంగాణ అంటే ఇండియాలో లేదా’ అని సూటిగా నిలదీస్తూ ఇక్కడి పరిశ్రమలకు మీరెందుకు తోడ్పడరు అని, రాష్ట్రం ఏర్పడే సమయంలో ఇచ్చిన వాగ్దానాలను ఎందుకు పట్టించుకోరు అని సూటిగా నిలదీయడంతో ఇక ప్రతిపక్షానికి సమాధానం చెప్పే
శక్తి ఉండదు.
‘వివిధ దేశాల వారొచ్చి తెలంగాణ పథకాలను మెచ్చుకుంటుంటే, మీ ప్రభుత్వమే వేరు వేరు పథకాలకు అవార్డులు ఇస్తుంటే మీరేమో వీటిని విమర్శిస్తారా’ అని నిలదీస్తాయి కేటీఆర్ వాక్యాలు. ఇక బీజేపీని విమర్శిస్తూ ఒక సృజనాత్మకమైన వాక్యాన్ని విసిరాడు కేటీఆర్ అది ‘బాత్ కరోడోఁ మేఁ, కామ్ పకోడీమేఁ’ ఇది ఆయన సొంత సృష్టే.
ప్రత్యర్థి రాజకీయాలను తిప్పికొట్టడానికి వారి వైఫల్యాలు బలహీనతలే కేటీఆర్కు పెద్ద సోర్సు అవుతుంది. వాటినే చాలా సృజనాత్మక కళతో చెప్పడం ఆయనకు పరిపాటిగా మారింది. మనం కేంద్రానికి ఇచ్చింది ఎంత మనకు వచ్చింది ఎంత అని లెక్కలు చూపిస్తూ.. ‘బండి సంజయ్కి జ్ఞానం ప్రసాదించండి’ అని అడుగుతాడు. వీరందరూ ‘వాట్సాప్ యూనివర్సిటీలలో చదివి బొంకుతుంటారు’ అని అవతలివారిని ఎండగడతాడు కేటీఆర్.
‘తెలంగాణకి ఏమివ్వకుండా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు. ఏమన్నా అంటే ఇండియా పాకిస్థాన్, దేశం కోసం ధర్మం కోసం అంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తారు’ అని కేటీఆర్ చేసే విమర్శ అవతలివాడి ప్రాణ నాడిని పట్టుకొని నొక్కడమే.
ప్రత్యర్థి ‘ఆత్మనిర్భర్ భారత్’ అని చేసే వాదాన్ని విమర్శిస్తూ వాళ్ల పథకాలన్నీ దేశసంస్థలను అమ్మేసే క్రమంలో ఉన్నాయని వివరిస్తూ. వారిది ‘బేచో ఇండియా’ పథకం అని కొత్తగా నిర్వచనాన్ని సృష్టిస్తాడు కేటీఆర్. విశాఖ ఉక్కుపరిశ్రమని అమ్మడం గురించి చెబుతూ అదే స్థితిలో ఉన్న గుజరాత్లోని పరిశ్రమలను ఎందుకు అమ్మడం లేదు అని విమర్శిస్తూనే ప్రభుత్వరంగ సంస్థలని అమ్మడం ఏ అభివృద్ధి కోసం అని అడుగుతాడు. ‘పెద్ద ఎన్నికలకు సరిహద్దులలో చిన్న ఎన్నికలకు భైంసాలో అల్లర్లు’ అని అవతలి వారి నైజాన్ని పట్టిస్తాడు. బీజేపీకి ఓటేస్తే ప్రైవేటీకరణకు ఓటేసినట్లే అని సమకాలంలో ప్రత్యర్థి చేసే అభివృద్ధి నిరోధకతను ఎండగట్టే ప్రయత్నం చేస్తాడు రాష్ట మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు.
బీజేపీ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ప్రభుత్వం పైన ప్రయోగించిన అస్ర్తాన్నే తిరిగి బీజేపీపైన అత్యంత సృజనాత్మకంగా ప్రయోగించాడు కేటీఆర్ ఇటీవలి ఎన్నికల్లో. అదేమంటే ‘నేను సిలిండర్కి దండం పెట్టి ఓటెయ్యడానికి పోతున్నా’ అనే నినాదం వెనుక పెట్రో ధరలు, గ్యాస్ సిలిండర్ ధర ఇటీవలి కాలంలో బాగా పెంచడం అనే సామాన్యుని నడ్డివిరిచే చర్యలున్నాయి. ఈ చర్యలనే కేటీఆర్ ప్రధాన విమర్శనాస్త్రంగా వాడుకున్నాడు. కేటీఆర్ ఈ నినాదం ఇచ్చిన తర్వాత చాలామంది తాము సిలిండర్కి దండం పెట్టే ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. పత్రికలు కూడా ఈ ఫొటోను ప్రచురించాయి. కేటీఆర్ సంధించిన ఈ సృజనాత్మక అస్త్రం బాగా పనిచేసింది. ప్రజలను బాగా ఆకట్టుకొని విజయానికి మార్గం వేసింది.
ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేటీఆర్ ప్రధాన ప్రచార సారథి. కేసీఆర్ ఆ బాధ్యతను
అధికంగా కేటీఆర్పైన ఉంచినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన వ్యూహకర్త కేసీఆర్ అనేది స్పష్టాతిస్పష్టం. ఈ ఎన్నికల్లో కేటీఅర్ సృజనాత్మకంగా చేసిన ప్రచారం తిరుగులేని ఆయుధంగా పనిచేసింది, విజయాన్ని సాధించింది. వక్తృత్వంలో అత్యంత సృజనాత్మక
కళ కేటీఆర్లో ఉంది. ఇది భవిష్యత్తులోను ఆయనకు పెట్టని కోటగా తిరుగులేని
శక్తిగా ఉపయోగపడుతుంది.
కేటీఆర్ తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీషు, దక్కనీ ఉర్దూ కూడా అనర్గళంగా మాట్లాడగలడు. కేటీఆర్ ఇంగ్లీషు చాలా బాగుంటుందని ఉచ్ఛారణ, ఇడియం కానీ చాలా బాగా ఉంటాయని విదేశీ నాయకులే అన్నారు. ‘హీ ఈస్ ద బెస్ట్ లీడర్’ అని ప్రశంసించారు. ఈ ప్రశంసలు అందుకోవడానికి అతను పనిచేసే, చేయించే శక్తితో పాటు ఆయన చాలా చక్కటి భాషతో ప్రసంగించడం కూడా ముఖ్యకారణం. భారతదేశంలో రాజకీయ వ్యూహరచనతో పాటు సృజనాత్మక వక్తృత్వ కళలో, నేటి యవతరం నాయకుల్లో కేటీఆర్కు సాటి రాగలిగిన నాయకులు లేరనే చెప్పాలి. ఆయన ఉజ్వల భవిష్యత్తుకు ఇవి నిచ్చెన మెట్లు.
వ్యాఘ్రగిరి
నాటి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ చాలాచల్లగానైనా ‘నల్లారి వారి తెలివి తెల్లారినట్లే ఉంది’ అని విమర్శించాడు. కేటీఆర్ అప్పుడు విషయాన్ని వివరించి చెప్పిన తర్వాత నాటి ముఖ్యమంత్రికి మాటలు దొరకలేదు. అదీ కేటీఆర్లోని సమయస్ఫూర్తి. ఇక్కడ ఈ వాక్యాన్ని కేటీఆర్ అలవోకగా చెప్పాడు. కిరణ్కుమార్ ఇంటిపేరు నల్లారి అనే దాన్ని ఠక్కున పట్టుకోవడం దానికి ప్రాస తూగేలాగా తెల్లారినట్లే ఉంది అని చెప్పడం. చాలా బలంగా పనిచేసింది. ‘తెలివి తెల్లారినట్లే ఉంది’ అనేది మంచి తెలుగు పలుకుబడి.
ప్రత్యర్థి ‘ఆత్మనిర్భర్ భారత్’ అని చేసే వాదాన్ని విమర్శిస్తూ వాళ్ల పథకాలన్నీ దేశసంస్థలను అమ్మేసే క్రమంలో ఉన్నాయని వివరిస్తూ. వారిది ‘బేచో ఇండియా’ పథకం అని కొత్తగా నిర్వచనాన్ని సృష్టిస్తాడు కేటీఆర్. విశాఖ ఉక్కు పరిశ్రమని అమ్మడం గురించి చెబుతూ అదే స్థితిలో ఉన్న గుజరాత్లోని పరిశ్రమలను ఎందుకు అమ్మడం లేదు అని విమర్శిస్తూనే
ప్రభుత్వరంగ సంస్థలని అమ్మడం ఏ అభివృద్ధి కోసం అని అడుగుతాడు. ‘పెద్ద ఎన్నికలకు సరిహద్దులలో, చిన్న ఎన్నికలకు భైంసాలో అల్లర్లు’ అని అవతలి వారి నైజాన్ని పట్టిస్తాడు.
కేటీఆర్ తెలుగు మాత్రమే కాదు ఇంగ్లీషు, దక్కనీ ఉర్దూ కూడా అనర్గళంగా మాట్లాడగలడు. కేటీఆర్ ఇంగ్లీషు చాలా బాగుంటుందని ఉచ్ఛారణ, ఇడియం కానీ చాలా బాగా ఉంటాయని విదేశీ నాయకులే అన్నారు. ఈస్ ద బెస్ట్ లీడర్’ అని ప్రశంసించారు. ఈ ప్రశంసలు అందుకోవడానికి అతను పనిచేసే, చేయించే శక్తితో పాటు ఆయన చాలా చక్కటి భాషతో ప్రసంగించడం కూడా ముఖ్యకారణం.