క్రీ.శ 15వ శతాబ్దం పూర్వభాగంలో ఉన్నటువంటి కవులు నాటి రాజకీయ కల్లోలం వల్ల రాజాదరణ లేక తమ రచనలను దేవునికి అంకితంగా ఇచ్చారు. వీరశైవులైన కవులేమో రాజాదరణను కోరుకోకుండానే కావ్యాలు రచించారు. మల్లన ‘రుక్మాంగద చరిత్ర’ అనే కావ్యాన్ని రచించాడు. దీనికి ‘ఏకాదశి మాహాత్మ్యం’ అనే పేరు కూడా ఉంది. ఈ కావ్యాన్ని భీమేశ్వర స్వామికి అంకితంగా ఇచ్చాడు.
ఇది ఐదు ఆశ్వాసాల ప్రౌఢ కావ్యం. మల్లన తన గురువైన శక్తినాథున్ని శివ స్వరూపునిగా భావించి కీర్తించాడు. ‘మల్లన’ భాగవతం రచించిన పోతన కుమారుడని కొందరు భావించారు. కాని గోత్రాదులు భిన్నం కావడంతో మల్లన పోతన కుమారుడు కాదని చెప్పవచ్చు. మల్లన తన కావ్యంలో ప్రబంధోచితమైన వర్ణనలను ప్రవేశపెట్టి ప్రబంధం వలె రచించాడు.
క్రీ.శ.15వ శతాబ్దం చివరలో పాల్కుర్కి సోమనాథుని ప్రశిష్యులైన పిడపర్తి కవులు శైవమత ప్రచారం కోసం రచనలు చేశారు. పిడపర్తి కవులలో ప్రధానమైన వాడు బసవన. బసవన ‘పిల్లనైనారు కథ’, ‘బ్రహ్మోత్తర ఖండం’, ‘దీక్షాగాథ’ అనే ద్విపద కావ్యాలను రచించాడు. ఇవి వీరశైవ మత సిద్ధాంతాలను, ఆచారాలను తెలుపుతున్న గ్రంథాలు. బసవన కుమారుడు సోమన.. కన్నడంలో చామరసు అనే కవి రచించిన ‘ప్రభులింగ లీల’ను ద్విపద కావ్యం గా తెలుగులో రచించాడు. పాల్కుర్కి సోమనాథుని ద్విపద బసవ పురాణాన్ని సోమన పద్యకావ్యంగా అనువదించాడు. ఇది చాలా ప్రసిద్ధి చెందిన కావ్యం.
క్రీ.శ.15వ శతాబ్దం చివరలో ఉన్న కవి పోశెట్టి లిం గకవి. ఇతడు కుమ్మరి కులజుడు. గార్లపాటి లక్ష్మణకవి శిష్యుడు. ఈ కవి వీరశైవుడు. నవచోళులు గొప్ప శివభక్తులుగా వీరశైవ కావ్యాలలో స్తుతింపబడినారు. ఆ నవచోళుల కథలను తీసుకొని ఈ కవి ‘నవచోళ చరి త్ర’ అనే ఐదు ఆశ్వాసాలు గల ద్విపద కావ్యాన్ని రచించాడు. ‘నవచోళ చరిత్ర’ వీరశైవ మతపరంగానే కాక, కావ్యశిల్ప విషయంలోనూ అద్వితీయమైన గ్రంథం. పోశెట్టి లింగకవి ‘మల్లన చరిత్ర’, ‘శంకరం దాసమ య్య చరిత్ర’, ‘వీరసంగయ్య దేవ చరిత్ర’, ‘శిష్య ప్రభోధము’ అనే ద్విపద కావ్యాలను రచించినట్లుగా తెలుస్తున్నది. ఈ కాలంలోనూ వీరశైవులు దేశీ ఛందస్సు అయిన ‘ద్విపద’లో రచించడం చెప్పుకోదగిన విశేషం.
హరిభట్టు (క్రీ.శ.1475-1550) అనే కవి ‘వరాహ పురాణం’, ‘నరసింహ పురాణం’, ‘మత్స్యపురాణం’, భాగవతంలోని 6, 11, 12 స్కంధాలను రచించాడు. విజయనగరంలో నందిమల్లయ్య, ఘంట సింగనలు రచించిన ‘వరాహ పురాణం’ కన్నా హరిభట్టు రచించిన ‘వరాహ పురాణం’ విస్తారంగా, భిన్నంగా ఉన్నది. ఈ కావ్యాన్ని కవి కంభంమెట్టు గ్రామకరణం కొలిపాక
ఎర్రయామాత్యునికి అంకితంగా ఇచ్చాడు.
నర్సింహ పురాణంలో ప్రహ్లాదుడు యవ్వనంలో వామనాసురుణ్ని దుర్బోధతో వైకుంఠం మీదికి దాడికి పంపిన వృత్తాంతం, ఆ క్రమంలో విష్ణుమాయ తొలిగిపోగా వామనాసురుడు విష్ణుభక్తుడైన వృత్తాంతం ఉన్న ది. ఈ కవి తన కావ్యంలో సందర్భోచితంగా ప్రబంధ వర్ణనలను చేర్చాడు. ‘అష్టఘంటావధాన’ అనే బిరుద ము ఈ కవికి ఉన్నది. హరిభట్టు కూడా పోతన వలెనే రాజాశ్రయం కోరుకోలేదు.
కుతుబ్షాహీల పాలన- తెలుగు సాహిత్య వికాసం
గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్షాహీలు క్రీ.శ. 1500-1687 మధ్యకాలంలో పాలించారు. ముస్లిం లు అయినా, వారి మాతృభాష తెలుగు కాకపోయినా కుతుబ్షాహీలు తెలుగును ఆదరించారు. కవులను అభిమానించారు. వీరి కాలంలో తెలుగులో కొన్ని రసవంతమైన కావ్యాలు రచించబడ్డాయి. కుతుబ్-ఉల్-ముల్క్ అనే వీరుడు ఇరాన్ దేశం నుంచి వచ్చి బహుమనీ రాజుల వద్ద సైన్యాధిపతిగా ఉండి ఎన్నో విజయా లు సాధించిపెట్టాడు.
క్రీ.శ.1500 ప్రాంతంలో బహుమనీ రాజ్యం విచ్ఛిన్నమై ఐదు స్వతంత్రమైన ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డా యి. అందులో ఒకటి తెలంగాణ ప్రాంతంతో కూడిన గోల్కొండ రాజ్యం. కుతుబ్ ఉల్ ముల్క్ మొదట గోల్కొండకు రాజప్రతినిధిగా ఉన్నా, ఆ తర్వాత స్వతంత్రించి కుతుబ్షాహీ వంశ పాలన ప్రారంభించా డు. కుతుబ్ ఉల్ ముల్క్ను చంపి అతని కుమారుడు జంషీద్ రాజైనాడు. క్రీ.శ. 1543-1550 వరకు పాలించాడు. జంషీద్ క్రూరుడు. తన సోదరులను కూడా చంపించాడు. ఇబ్రహీం మాత్రం తప్పించుకొని పారిపోయి విజయనగరంలో అళియరామరాయల ఆశ్రయంలో చేరాడు. ఏడేండ్లు అక్కడే ఉండిపోయా డు. అక్కడే అతడు తెలుగు మాట్లాడటం, కవిత్వం చెప్పటాన్ని నేర్చుకోవటంతోపాటు తెలుగు కవులను ఆదరించేవాడు. కుతుబ్షాహీల కాలంలోనే తెలుగు, మరాఠీ భాషల ప్రభావంతో ‘దక్కనీ’ అనే పేరుతో ఉర్దూలో ఒక ‘బోలీ’ (వ్యక్తీకరణ) ఏర్పడింది.
దక్షిణ భారతంలో ముఖ్యంగా తెలంగాణలో ఉర్దూ భాషలో ఎంతో కవిత్వం వచ్చింది. ఇబ్రహీం కులీ కుతుబ్షా వలీ, అతని కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్షా తెలుగులో కవిత్వం రచించారు. ఇబ్రహీంను ‘ఇధ రాముడు’, ‘మల్కిభ రాముడు’ అని నాటి కవులు వర్ణించారు. అతన్ని గురించి చెప్పిన చాటుపద్యాలు చాలా ఉన్నాయి. ఇబ్రహీం హఠాత్తుగా మరణించాడని అంటారు. అతని మరణవార్త విని తట్టుకోలేక ఒక కవి ఈ కింది చాటువును చెప్పాడు..
‘రార విధాత! యోరి వినరా! తగురా! తలకొట్టమారి!ని
ప్పాణు లోభిరాజులను చంపక మల్కిభరామ భూవరున్
చారు యశోధనున్ సుగుణి చంపితివ అర్థుల కేమి దిక్కురా!
చేరికనింత రాజును సృజింపగ నీ తరమా వసుంధరన్..’
ఈ పద్యాన్ని చదువుతున్నప్పుడు కృష్ణదేవరాయల మరణ సమయంలో పెద్దన దుఃఖిస్తూ కవితాత్మకంగా చెప్పిన చాటువు పద్యం గుర్తుకువస్తుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలం తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అయితే, ఇబ్రహీం కుతుబ్షా కాలం తెలంగాణ తెలుగు సాహిత్యం లో స్వర్ణయుగం అని చెప్ప వచ్చు.
కుతుబ్షాహీల కాలంలో హిందూ, ముస్లిం సం స్కృతుల సమ్మేళనం జరిగి తెలంగాణలో ఒక జీవన విధానం ఏర్పడింది. ఒక ‘నిర్మాణ కళ’ అభివృద్ధి చెందింది. కుతుబ్షాహీల కాలంలో ఈ నేలకు ‘తెలంగాణ’ అన్న పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చిం ది. మహమ్మద్ కులీ కుతుబ్షా కాలంలో హైదరాబాద్ నిర్మాణం జరిగి, గోల్కొండ నుంచి హైదరాబాద్కు రాజధాని మారింది. చార్మినారు, జామామసీదు, కుతుబ్షాహీల సమాధులు.. చక్కని నిర్మాణ కళతో కూడిన కట్టడాలు చాలా నిర్మించబడ్డాయి. కుతుబ్షాహీలు మతసామరస్యాన్ని పాటించి పాలించారు. పారశీ రాజభాష. ఉర్దూ, తెలుగు ప్రజల భాషలు. ఉర్దూ, పారశీలతో పాటు తెలుగును కుతుబ్షాహీ రాజులు పోషించారు. ఈ కాలంలో తెలంగాణలో తెలుగు సాహిత్యం అనేక ప్రక్రియలతో అభివృద్ధి చెందింది. కవులు రాజులను ఆశ్రయించి గౌరవాన్ని పొందారు.
కుతుబ్షాహీ వంశంలో చివరి రాజు అబుల్ హసన్ తానీషా క్రీ.శ.1672-1687 మధ్య కాలంలో పాలించాడు. అతని మంత్రులు హిందువులైన అక్కన్న, మాదన్నలు. ఔరంగజేబు ఢిల్లీ రాజ్యం నుంచి సైన్యంతో వచ్చి బీజాపూరు రాజ్యాన్ని జయించిన తర్వాత 1687లో గోల్కొండ మీద దండెత్తాడు.
మహమ్మద్ కులీ కుతుబ్షా
కుతుబ్షాహీల కాలంలో హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనం జరిగి తెలంగాణలో ఒక జీవన విధానం ఏర్పడింది. ఒక ‘నిర్మాణ కళ’ అభివృద్ధి చెందింది. కుతుబ్షాహీల కాలంలో ఈ నేలకు
‘తెలంగాణ’ అన్న పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది.
ముదిగంటి
సుజాతారెడ్డి
99634 31606