‘పండు వైభవం చెట్టు మూలంగా, చెట్టు వైభవం పండు మూలంగా వస్తుంది. అలాగే గురుశిష్యుల కీర్తి. వాటి మధ్య ఎవరూ రారు. నాలుగు యుగాల్లోనూ, వారి పాద ధూళే.. నాకు ఎంతో విలువైనది, దానినే నా శిరస్సు మీద ఉంచుకుంటాను’ అని భక్తమాల్ చివర్లో చెప్పుకోవడం విశేషం.
యోగుల చరిత్రలు నిరూపించగలిగేవి కాదు, ప్రమాణయోగ్యమైనవీ కాదు. అయినా ఇతిహాసకులు వ్యయప్రయాసలకోర్చి, యోగుల మీద ఉన్న పూజ్యభావంతో వారి వివరాలు సేకరించి రాశారు. అతి తక్కువమంది యోగులకు, వారి కుటుంబసభ్యులో, దగ్గరి శిష్యులో రాసినవి వారి జీవితాలకు దగ్గరగా ఉండొచ్చు. పైగా గతించిన వారికోసం మంచిని మాత్రమే చెప్పుకోవడం అనాదిగా వస్తూన్నది.
యోగులు, గొప్ప భక్తులు, భగవన్నామస్మరణలోనే గడిపినవారవడంతో అతిశయోక్తులు లేకుండా ఉండవు. ఏవో ప్రామాణికమైన ఆధారాలు దొరికితే తప్ప, కొన్ని శతాబ్దాల తర్వాత వారి చరిత్ర సేకరించినపుడు జరిగినది జరిగినట్టు తెలుసుకోవడం అసాధ్యం. అయినా ఇతిహాసకుల పాత్ర మూలంగానే మనకు ఆయా అద్భుత యోగుల చరిత్రతో పాటు, వారువదిలివెళ్లిన అమోఘమైన సాహిత్యం తెలుస్తున్నది.
ఇతర భాషల్లోని సాహిత్యాన్ని ఏ రూపంలో అయినా అందిస్తున్న అనువాదకులు లాంటి వారు ఈ ఇతిహాసకులు. అయితే అనువాదకులకు మూలం వారి ఎదుట ఉంటుంది. మూలాల్ని వెతికి పట్టుకొని, తెలిసేవరకూ తవ్వుతూ, యోగుల జీవితాలను సాహిత్యాలను, చరిత్రకెక్కించిన చరితార్థులు ఇతిహాసకులు. పూర్వం రాజులు నియమించిన వారో, లేక రాజహోదాలో ఉన్నవారో వారికి నచ్చిన, ఇష్టమైన వారివో జీవితచరిత్రలు రాయించుకునేవారు. నియమించినవారిని ఆకట్టుకునే విధంగానే ఆ చరిత్రలుండేవి. వారికి వారే తమ జీవితమంతా ధారబోసి సేకరించిన వివరాలు నమో దు చేసిన చరిత్రకారులు కొందరైనా మనకు లేక పోలేదు. వారి మూలంగానే ముందుతరాల అమూల్యమైన గర్వించదగ్గ విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. అలాంటి 16వ శతాబ్దపు నాభాదాస్ అనే ఒక తెలుగువాడు, భద్రాచలం నివాసి, ఉత్తరభారతదేశంలో నాలుగు యుగాలలోని 200 మంది కంటే ఎక్కువ యోగుల చరిత్రలను తన ‘భక్తమాల్’ (భక్తుల మాల)లో గ్రంథస్థం చేశాడు.
గోదావరినది ఒడ్దున ఖమ్మం జిల్లా భద్రాచలంలో 1537 ఏప్రిల్ 8న నాభాదాస్ జన్మించాడు. తల్లి జానకీ దేవి తండ్రి రామదాసు. వారు వెదురుతో తట్టలు, బుట్టలు, చాటలు తయారుచేసే మేదరిలు. సంగీత వాయిద్యాల్లో నేర్పున్నవారు. రామ భక్తులు. సంతానం కోసం శ్రీరాము ని పూజ ఫలంగా నాభాదాస్ జన్మించాడు. అతన్ని నారాయణదాసుగా పిలుచుకునేవారు. ఐదేండ్ల ప్రాయంలోనే తల్లిదండ్రులిద్దరూ మరణించడంతో నాభాదాస్ అనాథగా మిగిలాడు. భద్రాచలం రాముల వారి గుడిలో, నదిఒడ్డున తన ఈడు పిల్లలతో ఆడుకుంటూ, గుడిలో ప్రసాదంతో కాలం గడిపేవాడు. భద్రాచలం అడవుల గుండా వెళ్తున్న అగ్రదాస్, కీహాదాస్ అనే ఉత్తర భారత గురువులకు.. నాభాదాస్ ఒక చెట్టు కింద ఒక్కడే ఆడుకుంటూ కనిపించాడు. ఆ బాలున్ని చూసి ముచ్చటపడి, అనాథ అని తెలుసుకొని, వారితోబాటే రాజస్థాన్ జైపూర్ దగ్గరలో ఉన్న ఘట్టాధాం గుడికి తీసుకుపోయారు. వారు రామానంద్ సంప్రదాయానికి చెందిన వారు. ఆ బాలునికి సన్యాసదీక్ష ఇచ్చి వారి దగ్గరే ఉంచుకున్నారు. ఆ బాలుడు పుట్టు గుడ్డి అని, అడవిలో కనిపించిన వాడని, ఆ గురువుల మంత్ర జలంతో చూపు వచ్చిందని మరో కథనం కూడా ఉంది. అలాగే అతను తెలుగువాడే కాదన్న కథనాలూ ఉన్నాయి. అయితే పండితులందరూ అంగీకరించింది మాత్రం భద్రాచలం వాసి అనే.
గురువు అగ్రదాస్ ఆ బాలుడికి విద్యాబుద్ధులు నేర్పుతూనే ఒక పని అప్పగించాడు. బోధనలు వినడానికి వచ్చిన యాత్రికులకు భక్తులకు దాసులకు సేవచేయమని. గురువుల బోధనలు వింటూ నేర్చుకుంటూ, సేవ లు చేస్తూనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు గురువు అగ్రదాస్ తన బోధనల్లో ఏకాగ్రత కోల్పోతూ ఉండటం గమనించాడు. దానికి కారణం అతని వ్యాపారి శిష్యుడొకడు తుఫానులో చిక్కుకొని, గురువుని తలుచుకొని తనని, తన మునిగిపోతున్న ఓడని రక్షించమని ప్రార్థించడం గురువు ఏకాగ్రతని దెబ్బతీస్తోందని గ్రహించి, యువకుడైన నారాయణదాసు గురువుని తన బోధనలు కొనసాగించమని చెప్పి, తన తపోదీక్షతో ఆ శిష్యుడిని కాపాడాడు. నారాయణదాసు ఎదుగుదలని మహత్తుని తెలుసుకొని గురువు ఆశ్చర్యపోయి, ఆనందంలో మునిగిపోయాడు. తనలోని అలజడిని తెలుసుకోవడమే కాకుండా, ఎక్కడో కష్టాల్లో ఉన్న తన శిష్యుడిని కాపాడినందుకు అతన్ని అభినందిస్తూ, నువ్వొక గొప్ప మునివర్యుడివి, ఇప్పటినుంచి నువ్వు నాభాదాసుగా పిలవబడతావని ప్రకటించాడు. గంగానదిలో స్నానంచేసి వచ్చి, ఇప్పటివరకూ ఉన్న యోగుల జీవితచరిత్రలు గ్రంథస్థం చేయమని ఆదేశపూర్వకంగా కోరాడు.
నాభాదాసు భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శనం చేసుకున్న తర్వాతనే తీర్థయాత్రలు ప్రారంభించాడు. బృందావనం, అయోధ్య, వారణాసి, చిత్రకూట్, పూరీ లాంటి అనేక ప్రాంతాలను సందర్శించాడు. గురువు ఆదేశానుసారం యోగుల జీవితచరిత్రలను ఒక మాలగా భావించి, ప్రజాభాషలో సరళంగా రచించి, దానికి 1585లో ‘భక్తమాల్’ అని పేరు పెట్టాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు నారాయణదాసునే భక్తమాల్ రచయితగా చెప్పుకొన్నాడు. ఆ భక్తుల మాలను ఒద్దికగా కట్టి ఉంచే దారంగా వైష్ణవ భక్తిని వాడుకున్నాడు. ‘రామచరిత్ మానస్’ రాసిన సంత్ తులసీదాసును వాల్మీకి అవతారంగా అందులో పేర్కొన్నాడు. గొప్ప గ్రంథాన్ని రచించినందుకు ప్రశంసిస్తూ అతనికి ‘గోస్వామి’ బిరుదును గురువులు ప్రసాదించారు.
‘భక్తమాల్’ గ్రంథం మీద అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. వాటిల్లో 1769లో ప్రియదాసు రాసిన వ్యాఖ్యానమే గుర్తింపు పొందింది. అదే పేరుమీద కొందరు రాసిన గ్రంథాలూ వచ్చాయి. అయినా సనాతన ధర్మం మీద భక్తమాల్ గ్రంథమే ప్రామాణికంగా పరిగణించబడుతున్నది. దీనికిముందు అలాంటి గ్రంథాలు లేకపోలేదు. 63 నాయనార్ల జీవిత చరిత్రలతో 11వ శతాబ్దపు తమిళ పెరియపురాణం, 13వ శతాబ్దపు పాల్కుర్కి సోమనాథుని, తెలుగు బసవపురాణంలో కూడా వంద మంది భక్తుల వివరాలున్నాయి. అయితే అవి భక్తమాల్ అంత విస్తృతంగా లేవు. 18వ శతాబ్దపు మహీపతి రాసిన మరాఠీ భక్తవిజయకు మూలం భక్తమాల్ అనే చెప్పుకొన్నాడు.
నాభాదాసు యాత్రలు చేస్తున్న తరుణంలో అనేక అద్భుతాలు ప్రదర్శించాడని, వాటి మూలంగా అతని ప్రాముఖ్యత పెరగడమే కాకుండా అతనిని దేవుడుగా భావించే స్థితికి చేరుకున్నాడని అంటారు. నాభాదాసుని గోస్వామిగా అంగీకరించలేని పండితులను ఉద్దేశించి పవిత్ర యోగుల జాతిమత కులాలను అడగొద్దు, ముక్తి మార్గాన్ని మాత్రమే వారినుంచి తెలుసుకోండని వారికి చెప్పాడు. అయినా అతనిని పరీక్షించడానికి హోమం కోసం గంధం కట్టెలు తెచ్చి ఇమ్మని వారంతా కోరారు. దానికి కారణం అక్కడి అడవుల్లో గంధం దొరకడం దుర్లభం, పాములు గంధం చెట్లను చుట్టుకొని ఉంటాయి, సింహాలు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాయి. అయినా వాటినన్నింటినీ తన తపశ్శక్తితో అధిగమించి గంధం కట్టెలను తీసుకురాగలిగాడు. ఆ పరిస్థితుల్లో అది అందరికీ సాధ్యమయే పనికాదు. ఇలాంటివే ఎన్నో కథలు వ్యాప్తిలో ఉన్నాయి.
జపమాలలో 108 పూసలుంటాయి. కావున, భక్తమాల్లో కూడా ఆరేసి చరణాల 108 కవితలు నాభాదాసు రాశాడు. నాలుగు యుగాల వైష్ణవ భక్తుల చరిత్రలు 200 వరకూ అందులో నమోదు చేశాడు. భక్తమాల్లో ప్రతీ భక్తుడు లేదా భక్తుల సమూహం ఒక పుష్పం. అందులోని ప్రతీ పుష్పానికీ అంతే ప్రాముఖ్యం ఉంది. నాభాదాసు పూర్వ యుగాలలోని దేవుళ్లను, మానవులను, రాజులను, సేవ కులను, పురుషులను, స్త్రీలను, శూద్రులను, భక్తులను, ఇంకా అతని సమకాలికులను కూడా అందులో కీర్తించాడు.
రాజస్థాన్, సికర్లో 1643లో నాభాదాసు స్వర్గస్థుడయ్యాడు. భక్తులు అనుయాయులు ఇప్పటికీ అతన్ని పూజిస్తారు. పంజాబ్లోనే 30 లక్షలవరకూ నాభాదాసు అనుయాయులున్నారు. నాభాదాసు కులం తెలుగు ప్రాంతాల్లో వెనకబడిన కులాల జాబితాలో ఉంటే, ఉత్తరభారతంలో ఎస్సీ జాబితాలో ఉంది. ఆ కారణంగా తెలుగువాడైన నాభాదాసు అక్కడ, దళితయోగిగా దళిత కవిగా దళిత చరిత్రకారుడిగా కూడా గుర్తించబడ్డాడు. అక్కడ అతని పేర గుడులు సైతం ఉండటం విశేషం.
ముకుంద
రామారావు
99083 47273