దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇలాంటి భయానక పరిస్థితుల్లోనూ వార్తల సేకరణ కోసం జర్నలిస్టులు విధుల్లో పాల్గొంటున్నారు. సమాచారాన్ని ప్రజలకు అందించాలనే తపనతో నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో జర్నలిస్టులు కొవిడ్ బారిన పడి ప్రాణాలు వదిలారు. నెల రోజులుగా కరోనా రెండవ దశ ఉధృతమవుతున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు మరింత బాధ్యతగా తమ విధులు నిర్వర్తించడం సాహసోపేతమైనది, త్యాగపూరితమైనది.
దేశవ్యాప్తంగా 11 రాష్ర్టాల్లో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా పరిగణిస్తూ ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు మానవతా దృక్పథంతో వాస్తవ పరిస్థితిని గమనించి జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది. జర్నలిస్టులకు వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ అందించాలి. దీంతోపాటు ఆరోగ్య భద్రత, ఆర్థిక చేయూతను అందించే దిశగా ఆయా రాష్ర్టా ల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఒకటి, రెండు రాష్ర్టాలు మరో అడుగు ముందుకేసి ఆరోగ్య బీమా కోసం కొంత మొత్తాన్ని, ఎక్స్గ్రేషియా కింద భారీ మొత్తం అందిస్తామని ప్రకటించటం హర్షించదగినది.
మొదట ఏప్రిల్ 3న ఉత్తరాఖండ్ ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఢిల్లీ సీఎం జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా పరిగణించి వ్యాక్సినేషన్ వేయించడానికి నిర్ణయించారు. ఏపీ ప్రభుత్వం పాత్రికేయుల వైద్యసేవల పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించింది.ఏడు రాష్ర్టాలు జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించా యి. ఒడిషాలో 6,944 మంది జర్నలిస్టులకు ‘గోప బంధు సంబాదిక స్వస్థ్య బీమా యోజన’ పథకం కింద రూ.2 లక్షల ఆరోగ్య బీమా పథకాన్ని తెచ్చారు. ఒకవేళ కరోనాతో జర్నలిస్టు మరణిస్తే రూ.15 లక్షలను ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా కింద చెల్లించనున్నట్లు వెల్లడించారు. అలాగే బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, యూపీ రాష్ర్టాల్లో జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించారు. ఈ పరిస్థితుల్లో మిగతా రాష్ర్టాలు కూడా జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాల్సిన అవసరం ఉన్నది.
గత 20 రోజులుగా 30 మందికి పైగా జర్నలిస్టులు కరోనా బారినపడి మరణించారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించటం ముదావహం. ప్రభుత్వం తరపున కూడా మరింత తోడ్పాటు, భరోసా అందించాల్సిన అవసరం ఉన్నది. సర్వజన సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ జర్నలిస్టుల భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పాత్రికేయుల ప్రార్థన.
-ఆస్కాని మారుతి సాగర్