మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన 12 శాతం రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్నీ కేసులో ఏర్పరిచిన 50 శాతం పరిమితి దాటుతుందని దరఖాస్తుదారుల వాదన. బొంబాయి హైకోర్టు ఈ రిజర్వేషన్ను తప్పుగా పరిగణించలేదు. ఇంద్రా సాహ్నీ కేసులో రిజర్వేషన్లపై విధించిన పరిమితిని అన్ని ప్రభుత్వాల కోరిక మేరకు సుప్రీం కోర్టు తొలగిస్తుందా? ఆ కేసును పునఃసమీక్ష చేస్తుందా?
రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్నీ (1992) కేసులో నిర్దేశించింది. అయితే అదే సుప్రీంకోర్టు ఈ పరిమితిని పునఃపరిశీలన చేయాలని జయశ్రీ లక్ష్మణ్రావు పాటిల్ కేసులో అభిప్రాయపడింది. విద్యాసంస్థల్లో అదేవిధంగా ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లను మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడాన్ని సవాలు చేసిన కేసులో సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలకు నోటీసులు జారీచేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్.అబ్దుల్ నజీర్, ఎల్.నాగేశ్వరరావు, హేమంత్ గుప్తా, రవీంద్రభట్లతో కూడిన ధర్మాసనం ఈ రిజర్వేషన్లకు ఏర్పరిచిన పరిమితి గురించి పునఃపరిశీలించాలన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చింది.
రిజర్వేషన్ల అనుకూలురు, వ్యతిరేకులు తమ వాదనలను పదునుచేయడం మొదలుపెట్టారు. కేంద్ర ప్రభుత్వంతో పాటూ దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పరిమితి తొలగించాలన్న అభిప్రాయంతో ఉన్నాయి. పార్టీ నేపథ్యంతో సంబంధం లేకుండా ఈ అభిప్రాయంతో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్లు యాభై శాతానికి మించడం న్యాయబద్ధమా? రాజ్యాంగబద్ధమా అన్నది ప్రధాన ప్రశ్న. మన దేశంలో రిజర్వేషన్లు ఏర్పరచాలన్న డిమాండ్ కారణంగా 1882లో హంటర్ కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పరిచింది. ఇండియన్ కౌన్సెల్ చట్టం, 1909 ద్వారా మన దేశంలో మొదటిసారి రిజర్వేషన్లకు దారి ఏర్పడింది. ఆ తర్వాత కమ్యూనల్ అవార్డ్ 1933 ద్వారా ముస్లింలకు, సిక్కులకు, క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్, యూరోపియన్లకు, దళితులకు వేరుగా ప్రాతినిధ్యం కల్పించారు. షెడ్యూల్డ్ కులాలు అన్న పదాన్ని మొదటిసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 1935 చట్టంలో పేర్కొన్నారు. రాజ్యాంగం తయారు చేస్తున్నప్పుడు తమకు రిజర్వేషన్లు అవసరం లేదని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, పార్సీలు చెప్పారు. దానివల్ల వాళ్లు రిజర్వేషన్లను కోల్పోయారు. కె.యం.మున్షీ వెనుకబడిన తరగతులకు ఇచ్చిన నిర్వచనంలో చాలా కులాలు వచ్చాయి. ఇందులోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలతో పాటు ఆర్థికంగా, సాంఘికంగా, విద్యాపరంగా వెనకబడిన కులాలున్నాయి.
మన రాజ్యాంగం 1950 జనవరి 26 రోజున అమల్లోకి వచ్చింది. అందులోని ఆర్టికల్ 15, 16 ప్రకారం దేశ పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలి. కుల, మత, లింగ వివక్షతలకు తావు ఉండటానికి వీల్లేదు. అయితే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారి కోసం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారి అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన చట్టాలను, నిబంధనలను ప్రభుత్వం రూపొందించవచ్చు. ఆర్టికల్ 15 (4)లో కులాల పేర్లను పేర్కొనలేదు. అదేవిధంగా ఆర్టికల్ 16 (4)లో కూడా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రస్తావన లేదు. 16 (4 ఏ) నిబంధనను 1.4.2002లో ఏర్పరిచారు. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలవారికి సరైన ప్రాతినిధ్యం లేదని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం భావించినప్పుడు కొన్ని తరహాల ఉద్యోగాలకు సంబంధించి సీనియారిటీతో కూడిన పదోన్నతిని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను రూపొందించుకోవచ్చు. రిజర్వేషన్లు ఇంకానా..? అంటున్న గొంతులు ఎన్నో వినిపిస్తున్నాయి. అది ప్రాథమిక బాధ్యతల్లోని 51 (జె)కు అదేవిధంగా ప్రవేశికకు, ఆర్టికల్ 14కు విరుద్ధమన్న వాదనలు కూడా చేస్తూ ఉంటారు. ఆర్టికల్ (జె) ప్రకారం- దేశ పౌరుడు వ్యక్తిగతంగానూ, సమష్టి కృషి ద్వారానూ ఉన్నత శిఖరాలను అధిరోహించటం ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా కృషిచేయాలి. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆ విషయాన్ని ఆర్టికల్ 15 (4) అతిక్రమిస్తుందని కొందరి వాదన. ఈ వాదనలన్నింటిని నెహ్రూ తోసిపుచ్చారు.
‘ఆర్థికంగా సామాజికంగా, వెనుకబడిన కులాలకు న్యాయం జరగాలంటే వారికి సమాన అవకాశాలు ఉండాలి. అది చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావొచ్చు, అందుకని రిజర్వేషన్లు అవసరం. అవి కులపరంగా ఉండాలి. అప్పుడే వాళ్ల జీవితాల్లో వెలుగు వస్తుంది. అన్నిరాష్ర్టాల వాదనలను అభిప్రాయాలను వినాలని సుప్రీంకోర్టు జయశ్రీ లక్ష్మణ్రావు పాటిల్ కేసులో అభిప్రాయపడింది. మరాఠా కమ్యూనిటీకి విద్యా, ఉద్యోగ విషయాల్లో ఇచ్చిన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన కేసులను విచారిస్తున్న క్రమంలో ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ కేసు తీర్పు ప్రభావం దేశవ్యాప్తంగా ఉంటుందని అందుకని అన్ని రాష్ర్టాల వాదనలు వినడం మంచిదని సీనియర్ న్యాయవాదులు సూచించిన మేరకు సుప్రీంకోర్టు అన్ని రాష్ర్టాలకు నోటీసులను జారీచేసింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342 ఏ ను రాజ్యాంగంలో చేర్చారు. ఏదైనా క్లాస్ను, కమ్యూనిటీని, సామాజికంగా, విద్యాపరంగా వెనకపడిందని ప్రకటించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికరణ ద్వారా ఏర్పడుతుంది. మరాఠాలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పరిచిన 12 శాతం రిజర్వేషన్ వల్ల సుప్రీంకోర్టు ఇంద్రా సాహ్నీ కేసులో ఏర్పరిచిన 50 శాతం పరిమితి దాటుతుందని దరఖాస్తుదారుల వాదన. బొంబాయి హైకోర్టు ఈ రిజర్వేషన్ను తప్పుగా పరిగణించలేదు. ఇంద్రా సాహ్నీ కేసులో రిజర్వేషన్లపై విధించిన పరిమితిని అన్ని ప్రభుత్వాల కోరిక మేరకు సుప్రీంకోర్టు తొలగిస్తుందా? ఆ కేసును పునఃసమీక్ష చేస్తుందా? సమాఖ్య భావనకు విరుద్ధంగా 102వ రాజ్యాంగ సవరణ ఉందని ప్రకటిస్తుందా వేచిచూడాలి.
(వ్యాసకర్త: గతంలో జిల్లా జడ్జిగా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు)
మంగారి రాజేందర్