గోపాలక! హే కృపా జలనిధే! హే సింధు కన్యాపతే!
హే కంసాంతక! హే గజేంద్ర కరుణా! పారీణ! హే మాధవ!
హే రామానుజ! హే జగత్ త్రయగురో! హే పుండరీకాక్ష! మాం
హే గోపీజన నాథ! పాలయ పరం జానామి నత్వాం వినా..
కులశేఖరాళ్వారు (ముకుందమాల: 21)
ఈ శ్లోకంలో అన్నీ స్వామి సంబోధనలే. ‘శ్రీనాథ! నారాయణ!.. మురారే!’ (ముకుందమాల: 36) అంటూ మరో శ్లోకమూ రాశారు ఆ మహాకవి. భగవన్నామాలలో అపారమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది.‘రామ’నామాన్ని నిరంతరం జపించి అద్భుతాలను సాధించిన హనుమంతుడే ఇందుకు ఓ గొప్ప ఉదాహరణ. ‘రామ’నామ స్మరణతోనే నూరు యోజనాల సముద్రాన్ని అంజన్న అవలీలగా లంఘించాడు. రామబాణం కన్నా రామనామమే శక్తివంతమైందని హనుమ లోకానికి చాటాడు. ‘రామ రామ’ అనలేకున్నా ‘మరా మరా మరా మరా’ అన్న ఒక బందిపోటు దొంగ వాల్మీకియై తరించాడు. ‘పేరులో ఏముంది పెన్నిధి’ అనడానికి వీల్లేదు. ఉన్నదంతా పేరులోనే ఉన్నది. పై శ్లోకంలో గంభీర భావ గర్భితమైన కవిత్వం లేకపోవచ్చు. కానీ, పవిత్రమైన భగవన్నామ స్మరణాత్మక శక్తి దాగి ఉంది.
నామస్మరణల ద్వారా ఆయా కవులు ఉద్దేశించిన పరమ ప్రయోజనం ఏమంటే, మన మనస్సులను భగవదున్ముఖం చేయడమే. అష్టోత్తర శతనామాలు, సహస్ర నామాల్లో పేర్లే ఉంటాయి. వాటిని చూడవలసిన దృష్టికోణం వేరు. ‘అలసులు, మందబుద్ధి యుతులు, అల్పతరాయువులు, ఉగ్ర రోగ సంకలితులు’ అయిన కలియుగ మానవులకు అత్యంత సులభమైందిగా చెప్తున్న తరుణోపాయమే ‘భగవన్నామ స్మరణం’. భక్తి విశ్వాసాలను అనుసంధించి పలికే నామమొక్కటి చాలు జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేయడానికి! భాగవతంలో అజామీశుని కథ తెలిసిందే. అనేక పాపాలకు పాల్పడి కూడా కుమారునికి ‘నారాయణుడ’ని పేరు పెట్టి, అంత్యకా లంలో ఆ పేరునే పిలువడంతో విష్ణుభటులు వచ్చి అతనిని వైకుంఠానికి తీసుకెళ్లారు. ఇంతకంటే మేలైన ఉదాహరణ మనకింకేం కావాలి!
నామస్మరణతో ముక్తి చాలా తేలిక అంటే కొందరికి నమ్మాలనిపించదు. ఏ ఇష్టదైవాన్ని అయినా ఎంచుకోండి. ప్రతీ భగవన్నామంలోను అనంతమైన శక్తి నిక్షిప్తమై ఉంటుంది. మనం చేయవలసింది అణుమాత్రమైనా లేదు. కాకపోతే, దానిపట్ల నమ్మకం చాలటం లేదు. అదీ సమస్య. కనుకే, భగవన్నామంతో పొందవలసిన ప్రయోజనాన్ని పొందడంలో అతిచిత్రంగా అత్యంత సులభంగా చాలామంది విఫలమవుతున్నారు. కానీ, ఎందరో భక్తకవులు భగవన్నామ మహిమను ఇదివరకే గ్రహించారు. అంతేకాదు, ఆ నామం శ్రవణ సుభగంగా ఉంటే మరిన్నిసార్లు చదువుకొని, ఎలాగైనా ఉచ్చరిస్తారని శబ్దాలంకారాలూ, విశేష ఛందస్సులను అనుసరించి రచించారు. ‘భాగవతం’లో కనిపించే బోలెడన్ని పద్యాలే ఇందుకు ప్రబల నిదర్శనాలు.
అనుపమ గుణహారా! హన్యమానారి వీరా!
జనవినుత విహారా! జానకీ చిత్తచోరా!
దనుజఘన సమీరా! దానవశ్రీవిదారా!
ఘనకలుష కఠోరా! కంధి గర్వాపహారా!
శ్రీమద్భాగవతం (ప్రథమ స్కంధం: చివరి పద్యం)
అంత్యప్రాసలతో అలరారే ఇలాంటి పద్యాలెన్నో. ‘ముర విదారణ! ముఖ్యకారణ! మూలతత్త విచారణా!..’ అనే పద్యమూ ఉంది. ఇది ‘షష్ఠ స్కంధాంత’ పద్యాల లోనిది. అంత్యప్రాసలే గాక వీనులవిందైన బాణీలు గలవి కూడా. మనమంతా పూర్ణవిశ్వాసంతో ఇలా నామస్మరణ శక్తితో దైవసాన్నిధ్యాన్ని పొందగలిగితే మహాకవుల ఆశయం నెరవేరినట్టే.
డాక్టర్ వెలుదండ సత్యనారాయణ
94411 62863