కరోనా కారణంగా 2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కీడలు 2021లో జరిగాయి. ఈ క్రీడలను ఘనంగా నిర్వహించిన జపాన్కు అభినందనలు. జనాభాపరంగా చిన్నవైనా కొన్ని దేశాలు ఈ క్రీడల్లో వహ్వా అనిపించాయి. కానీ జనాభాపరంగా పెద్ద దేశమైనా మన భారత్ ఎప్పటిలాగే నిరాశపరిచింది. దీని వెనుక దాగి ఉన్న కారణాలను చర్చిద్దాం..!
ఈ ఒలింపిక్స్ క్రీడల్లో 113 మెడల్స్తో అమెరికా ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో చైనా (88), జపాన్ (58), బ్రిటన్ (65), రష్యా (71), ఆస్ట్రేలియా (46), నెదర్లాండ్స్ (36) తదితర దేశాలు నిలిచాయి. మన దేశం స్వర్ణం-1, రజతాలు-2, కాంస్యాలు-4 మొత్తం 7 పథకాలను సాధించింది. ఒలింపిక్స్కు సంబంధించి ఇదే మన అత్యధిక రికార్డు కావడం విశేషం. అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, చైనా, బ్రిటన్ వంటి దేశాలు ఎక్కువ మెడల్స్ సాధించడం గొప్ప విశేషమేం కాదు. కానీ, జనాభాపరంగా చిన్న దేశాలైన శాన్మారియో, బెర్డు, గ్రెనడా, బెహ్మాస్, న్యూజిలాండ్, జమైకా, స్లోవేనియా, ఫిజి, నెదర్లాండ్స్ దేశాలు క్రీడా స్ఫూర్తిని చాటాయి. ఈ విజయాలకు కారణం ఆ ప్రజల జీవన సంస్కృతిలో క్రీడలు భాగంగా ఉండటమే.
ఇక ఏ కోణంలో చూసినా మనదేశ ప్రదర్శన పేలవంగా వేదనాభరితంగా ఉంది. గత ఒలింపిక్స్తో పోల్చితే ఈ ఒలింపిక్స్లో వృద్ధి ఉన్నప్పటికీ 140 కోట్ల జనాభాతో అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థతో పోల్చిచూస్తే సాధించింది తక్కువ. ‘మేరా భారత్ మహాన్’ అంటూ మనల్ని మనం ఎంతో పొగుడుకున్నా వాస్తవ పరిస్థితి నిరాశాపూరితమే.
మన దేశంలో క్రీడావ్యవస్థ సరిగా లేదు. ప్రభుత్వాలు క్రీడలను ప్రోత్సహించే పరిస్థితి అంతకన్నా లేదు. భారతీయుల ఆకాంక్షలన్నీ డాలర్ల స్వప్నాల వెంటే పరిగెడుతున్నాయి. మన చదువులు.. పరీక్షలు, మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతున్నాయి. పిల్లల జీవితాలు మార్కులు, ర్యాంకులకే కట్టివేయబడుతున్నాయి. మన పాఠశాలలు, కళాశాలల్లో కొ-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ కార్యక్రమాలకు స్థానం తక్కువ. రోజులో కనీసం ఒక గంటయినా ప్రతి పిల్లవాడు ఆడుకోవాలి. విద్యాలయాల్లో ఆటస్థలాలు, శిక్షకులు అందుబాటులో ఉండాలి.
క్రీడల్లో మన వైఫల్యానికి మరో కారణం పౌష్టికాహార లోపం. మన ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వుల పాలు ఎక్కువ. ప్రొటీన్లు విటమిన్లు మినరల్స్ పాత్ర తక్కువ. పోషకాహార లోపంతో మన పిల్లలు శుష్కించి గిడసబారిపోతున్నారు. మరోవైపు ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవటం వల్ల శరీరంలో కొవ్వు పెరిగిపోయి ఊబకాయంతో మన పిల్లలు, పెద్దలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఒలింపిక్స్లో గెలుపోటములు చూడటమనేది ఓ సందర్భం మాత్రమే. మనల్ని మనం విశ్లేషించుకునే సందర్భం. క్రీడలు శారీరక దారుఢ్యాన్ని, మానసిక వికాసాన్ని, సహకార భావాన్ని, పోరాట దృక్పథాన్ని పెంచుతాయి. ఒకప్పుడు గ్రామాల్లో ఆటలాడే సం స్కృతి ఉండేది. ప్రపంచీకరణ వ్యాపార సంస్కృతి ఎన్నో మంచి అలవాట్లను మింగేసినట్లే గ్రామీణ క్రీడ ల్ని మింగేసింది. ఇప్పుడు గ్రామాల్లో ఆడే సంస్కృతిపోయి తాగే చెడు సంస్కృతి వచ్చింది. ఈ పరిస్థితి మారాలి. ‘గుడికి వెళ్లటం కంటే కూడా ఆటస్థలానికి వెళ్లడం ద్వారానే స్వర్గానికి దగ్గరవుతాము’ అనే వివే కానందుడి మాటల్లోని అంతస్సారాన్ని అర్థం చేసుకొని ముందుకుసాగుదాం.
ఎం.నిర్మల్ కుమార్