భూగోళం మానవాళికి, సమస్త జీవరాశికి ఆలవాలం. భూమిపై జీవ వైవిధ్యం సహజ ప్రక్రియ. ఒకే పర్యావరణంలో జీవిస్తున్న భిన్నమైన వృక్ష, జంతు జాతులన్నింటిని కలిపి జీవవైవిధ్యం అంటాం. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల సహజ వనరులపై ఒత్తిడి ఏర్పడటంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతింటున్నది. అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు.
అడవులు నరకడం, రసాయన ఎరువుల అతి వినియోగం, భారీ ప్రాజెక్టులు, నిర్మాణాలు, ఖనిజాల కోసం తవ్వకాలు జీవ వైవిధ్యానికి పెను సవాలుగా మారాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను గుర్తించిన పలు దేశాలు 2001 నుంచి ఏటా మే 22న ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈసారి ‘మేం ప్రకృతి పరిష్కారంలో భాగం’ అనే ఇతివృత్తంతో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం.
తెలంగాణలో 71 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12 రక్షిత అభయారణ్యాలున్నాయి. కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాలు పులుల కోసం ప్రత్యేకం కాగా, మిగతా జాతీయ వనాలలో అన్నిరకాల జీవజాతులు నివసిస్తున్నాయి.
ఆరేండ్లుగా తెలంగాణలో చేపట్టిన హరితహారం, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వల్ల జీవ వైవిధ్యం వెల్లివిరుస్తున్నది. అర్బన్ పార్క్ల నుంచి అభయారణ్యాల వరకు, చిన్న కుంటల నుంచి పెద్ద చెరువుల వరకు అనేక పక్షులు, జంతు జాతులు వృద్ధి చెందుతున్నాయి. అంతరించిపోయే దశలో ఉన్న చిరుత, పెద్దపులి, అడవి కుక్క, మూషిక జింక, ఊర పిచ్చుక తదితర వైవిధ్య పక్షి, జంతు జాతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణలో 71 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12 రక్షిత అభయారణ్యాలున్నాయి. కవ్వాల్, అమ్రాబాద్ అభయారణ్యాలు పులుల కోసం ప్రత్యేకం కాగా, మిగతా జాతీయ వనాలలో అన్నిరకాల జీవజాతులు నివసిస్తున్నాయి.
తెలంగాణ జీవ వైవిధ్య లెక్కల ప్రకారం 300 రకాలకు పైగా పక్షులు, 60 రకాల క్షీరద జంతువులు, 60 రకాల సరీసృపాలు మరో వంద రకాల కీటకాలున్నాయి. ఇవి గాక ఏటా సీజన్ వారీగా పలురకాల పక్షులు ఇక్కడికి వలస వస్తాయి. గత ఐదేండ్లుగా రాష్ట్రంలో పెరిగిన పచ్చదనం మూలంగా వీటి సం ఖ్య బాగా పెరిగింది. 2018 నాటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 26 పులులు ఉన్నాయి. రాష్ట్ర అటవీశాఖ అధికారుల తాజా అంచనాల మేరకు ఈ సంఖ్య 35కు చేరుకున్నది. ‘స్టేటస్ ఆఫ్ లెపర్డ్ ఇన్ ఇండియా’ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 334 చిరుత పులులు ఉన్నాయి. 2014 గణాంకాలతో పోలిస్తే చిరుతల సంఖ్య దాదాపు యాభై శాతం వృద్ధి చెం దింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పాలపిట్టలు, ఊర పిచ్చుకల సంఖ్య బాగా పెరిగింది.
భూపాలపల్లి అటవీ ప్రాంతంలో కొన్నేండ్లుగా తగ్గిన అడవి పిల్లులు, జింకల వృద్ధి నమోదైంది. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో వలస పక్షులు బాగా పెరిగాయి. రాష్ట్రంలో జీవ వైవిధ్యానికి హెరిటేజ్ సైట్గా మెదక్ జిల్లాలోని అమీన్పూర్ చెరువును గుర్తించారు. అక్కడికి దేశ విదేశాల నుంచి పక్షులు వలస వస్తున్నాయి. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నదుల్లో మత్స్య సంపద రెండింతలు పెరిగింది.
‘జంగిల్ బచావో- జంగిల్ బడావో’ నినాదంతో తెలంగాణలో 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి పెంచడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. అడవుల్లో నాటిన 30 కోట్ల మొక్కలను కలుపుకొని ఆరు విడతల హరితహారంలో మొత్తం 214 కోట్ల మొక్కలు నాటించింది. దీంతో పచ్చదనం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర జీవవై విధ్య సూచిక 1.97- 2.87కు పెరిగింది.
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం సమగ్ర వ్యూహాత్మక ప్రణాళికలను అమలుచేయాలి. జీవ వైవిధ్య సంరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యతే కాదు, ప్రజలూ వివిధ జీవజాతుల ఆవాసాల సంరక్షణపై దృష్టిసారించాలి. పర్యావరణహిత ఉత్పాదకాలనే వినియోగించాలి.
డాక్టర్
చల్లా ప్రభాకర్రెడ్డి