మంత్రివర్గంలో ఎవరిని నియమించుకోవాలి, ఎవరిని తొలగించాలనే సంపూర్ణ స్వేచ్ఛ రాజ్యాంగం ముఖ్యమంత్రికి కల్పించింది. నిన్నటి వరకు ప్రభుత్వంలో మంత్రిగా గౌరవం పొందిన ఈటల రాజేందర్ను ఎందుచేత మంత్రివర్గం నుంచి తొలగించారో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కఠిన నిర్ణయానికి గల కారణాలేమిటో రుజువులు చెపుతున్నా యి. తన పదవీచ్యుతిని తట్టుకోలేక ఇదొక కుట్ర, ఆత్మగౌరవ భంగం, బీసీ ని కాబట్టే తొలగించారనే విమర్శలు చేస్తున్నారు ఈటల. ఈ ఉదంతం నేపథ్యంగా నేడు తెలంగాణ సమాజంలో ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, సామాజిక న్యాయం పదాలు బహుళంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ పదాలకు కొత్త నిర్వచనాలు పుట్టుకొస్తున్నాయి. వక్రభాష్యాలు యథేచ్చగా పత్రికల్లో, టీవీల్లోని వార్తల్లో ప్రచురణ, ప్రసారం జరుగుతున్నాయి.
‘రాజు బలవంతుడిగా వున్నప్పుడు వైరి పక్షాలు సహితం ఏకమై ఒక్క తాటి మీదకు వచ్చి రాజును గెలవాలని చూస్తాయి’. దాదాపు 2000 ఏండ్ల క్రితమే చాణుక్యుడు చెప్పిన మాటలివి. నేడు అదే రీతి లో కేసీఆర్ విషయంలో విపక్షాలు చేస్తున్న రాజకీయ క్రినీడలు స్పటిక సదృశ్యం. అవినీతి అక్రమాలు బయటపడి పదవినుంచి తప్పిస్తే.. ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని అంటున్నారు! ఇది అవకాశవాదం కాదా? స్వయంకృతాపరాధంతో ఇలాంటి పరిస్థితులు తెచ్చుకొని అధినేతపై అవాకులు చవాకులు పేలడాన్ని ఏమంటారు?
తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో ఈ నినాదాలే కీలక భూమిక పోషించాయి. నాడు ఈ పదాలను ప్రచారంలోకి తెచ్చింది, సింహభాగాన నిలబెట్టింది, ప్రజలను ఉద్యమం వైపు నడిపించింది కేసీఆర్గారు అన్న విషయం మరువరాదు. ఆ స్ఫూర్తే స్వరాష్ట్రాన్ని సాధించిపెట్టింది. నాటి ఉద్యమ నాయకుడే నేడు ప్రభుత్వ సారథి. ఆ నేత పాలనలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం ఆత్మగౌరవంతో జీవించాలని బోధిస్తున్నవే. హోదాలు అనుభవించిన నాడు జ్ఞాపకం రాని ఆత్మగౌరవం, పార్టీని వీడుతున్నప్పుడు గుర్తుకు రావటం విడ్డూరంగా ఉన్నది. ప్రస్తుతం ఈటల రాజేందర్ చేస్తున్న విమర్శలు విస్మయాన్ని కలిగిస్తున్నవి.
రాష్ర్ట తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కేసీఆర్గారు ప్రజలకు బోధిస్తున్నది ఆత్మగౌరవమే. తెలంగాణలో అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకాన్ని చూసినా మనకు కనిపించేది ఆత్మగౌరవమే. సామాజిక పించన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, డబుల్ బెడ్రూం, కేసీఆర్ కిట్, కుల భవనాలు, చేప విత్తనం, గొర్రెల పంపిణీ, రెసిడెన్షియల్ పాఠశాలలు, విదేశీవిద్య పారితోషికం, కుల వృత్తుల ఆధునికీకరణ, ఆశ్రిత కులసాంస్కృతిక కళల పరిరక్షణ, సాంస్కృతిక కళారూపాల పునర్ వైభవం.. ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఆత్మగౌరవ ప్రతీకలే.
సామాజిక రాజనీతి శాస్త్రవేత్తగా, తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్లోని బహుముఖీన ప్రజ్ఞా పాఠవాలను గుర్తించకుండా మాట్లాడటం అవకాశ వాదం. మహాత్మాగాంధీ, అంబేద్కర్, పెరియార్, లోహియా వంటి మహనీయులను అర్థం చేసుకొని వారి పనివిధానాలను లోతుగా అధ్యయనం చేశారు కేసీఆర్. ప్రభుత్వ అధినేతగా వర్తమాన కర్తవ్యాలను ఆదర్శవంతమైన రీతిలో కొనసాగిస్తున్నారు. ఇంటి పేరు ప్రగతిగా తానే రాష్ర్ట సుగతిగా రాష్ర్ట అభివృద్ధిని, సంక్షేమ శ్రేయోరాజ్య లక్ష్యాలను అనతి కాలంలోనే సాధించిన తీరుకు దేశమే నివ్వెరబోతున్నది.
ఒక దార్శనికుడికి ఉండే శాశ్వత దృష్టితో కూడిన పాలనలో చిరకాలం తలెత్తుకుని ఆత్మగౌరవంతో, ఆనందంతో జీవించే బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాదిగా ఈ ఏడేండ్ల కేసీఆర్గారి పాలన నిదర్శనంగా కన్పిస్తున్నది. పాలనా కాలంలో ప్రజాహితం చేయాలని అనుకునే వాడు జనరంజక పాలకుడు అవుతాడు. ప్రజల జీవితం ఆనందంగా ఉండటానికి ప్రణాళికలు రచించేవాడు, వాటిని దశల వారిగా అమలు చేసేవాడు దార్శనికుడు అవుతాడు. నేడు కేసీఆర్ గారు తన పాలన ద్వారా చేస్తున్నది అదే. బంగారు తెలంగాణ దార్శనికుడిగా భవిష్యత్ తరాలకు బం గారు బాటలు వేస్తున్నారు. నాటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారికి సామాజిక న్యాయస్ఫూర్తి, విమర్శలు సహించే తత్వం లేకపోతే ఇవాళ ఇంతమంది బీసీలు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత పదవులలోకి రాగలిగేవారా? కేసీఆర్ గారికే విమర్శలను ఓర్చుకునే స్వభావం లేకపోతే ఇప్పుడు పార్టీలో ఉన్న ఎంతోమంది నాయకులు ప్రభుత్వంలో, పార్టీలో ప్రముఖులుగా ఉండగలిగేవారా!
ఉదాహరణగా చూస్తే..
ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న నేతలు, ఉద్యమకారులు, మేధావులు, తటస్తులైన వారు ఎందరో సముచిత గౌరవం పొందారు. పాలనలో భాగస్వామ్యం లభించింది. ఇదంతా సీఎం గారిలోని సామాజిక న్యాయస్ఫూర్తికి నిదర్శనం కాదా. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మగౌరవ భంగం కలుగుతున్నదని, సామాజిక వివక్షతకు ఎక్కడ గురవుతున్నామని అనటం అర్థరహితం.
ఆస్తుల సంపాదనలో అక్రమాలకు పాల్పడినట్లు తేటతెల్లమైన ఈటలను సాధికారిక ఆధారాలతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం కుట్ర ఎలా అవుతుంది? ఇందులో సామాజిక వివక్షత ఎక్కడ వుంది. సామాజిక కోణంలో ఆయనపై వేటు పడిందన్న వాదనలో ఉన్న వాస్తవమున్నదా? నిజాయితీపరుడైతే కడిగిన ముత్యంలా మలిన పంకిలం నుంచి బయటకు రావాలి. తన నిబద్ధతను చాటుకోవాలి. అంతేగాని సుదీర్ఘకాలం ప్రభుత్వంలో ఉన్నత స్థితిని పొందిన ఆయన విమర్శలు ప్రజలను నమ్మించలేవని తెలుసుకుంటే మంచిది. అదే పనిగా కువిమర్శలకు దిగితే చరిత్ర హీనులవుతారు, చరిత్ర చెత్తకుప్పలపైకి విసిరివేయ బడుతారు.
డాక్టర్ వకుళాభరణం
కృష్ణమోహన్ రావు