పీవీ (పి.వి.నరసింహారావు) వినయ భూషణుడు, విప్లవకారుడు. హైదరాబాద్ నుంచి వచ్చిన ‘విప్లవకారుడు పీవీ.’ అని అన్నది మరో మాజీ ప్రధాని, సీనియర్ నేత, ప్రముఖ గాంధేయవాది, ముక్కుసూటి మనిషి మొరార్జీ దేశాయి. పీవీ 1946 నుంచే తనకు తెలుసని మొరార్జీ అన్నారు. పీవీ అంకిత భావాన్ని, నిజాయితీని, పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతి పట్ల పీవీ కి ఉన్న శ్రద్ధాశక్తులను మొరార్జీ ఎంతో మెచ్చుకున్నారు. పీవీ ని రాష్ర్టపతి చేయాలన్న ఆలోచన ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగిందని, కాని, పీవీ పార్టీకి, ప్రభుత్వానికి చాల అవసరమని ఇందిర భావించారని ప్రణబ్ ముఖర్జీ రాశారు.
జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలకు తగినంత ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తాయన్న నమ్మకం లేదు. ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలను, అభిరుచులను గుర్తించవలసింది, వాటికి ప్రభుత్వ వ్యవహారాలలో తగినంత ప్రాధాన్యత కల్పించవలసింది నిజానికి ప్రాంతీయ పార్టీలే. అటల్ బిహారీ వాజపాయి మాటకు విలువ ఇచ్చి కశ్మీరియత్ను గౌరవించినట్లయితే కశ్మీర్ ప్రజలకు సంతృప్తి కలిగి వుండేది.
మన పీవీ వినయ భూషణుడు. సంస్కృతీ సంపన్నుడు. 1995లో నూరవ జయంతి ఉత్సవం జరుపుకున్న మొరార్జీ దేశాయి ఇంటికి స్వయంగా వెళ్లి (భారత ప్రధానమంత్రిగా) అభినందించిన పీవీ నిజానికి మొరార్జీకి రాజకీయ ప్రత్యర్ధి! భారత జాతీయ కాంగ్రెస్లో అతివాద భావాలకు, సామ్యవాదానికి ప్రాతినిధ్యం వహించిన (స్వామి రామానందతీర్థ అనుయాయిగా) పీవీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించకుండా కొన్ని రోజులు వినోబాభావే (భూదాన ప్రయోక్త) వెంట పాదయాత్ర జరుపడం విశేషం. పీవీ అతివాదం శాంతియుతమైనది. ఓరోజు ఉదయం హనుమకొండలోని స్వగృహంలో తనకు సన్నిహితుడైన హయగ్రీవాచారి తీవ్రవాదుల బుల్లెట్లకు బలి అయినప్పుడు ఢిల్లీలో ఉన్న పీవీ చాల బాధపడ్డారని, ఆయన ఆగ్రహం అవధులు దాటిందని ఆయన ఆత్మీయులు అన్నారు. పీవీ 60ఏండ్ల మహత్తర సేవలపై, ఆయన విరాట్ స్వరూపంపై ఎంత రాసినా తక్కువే అన్పిస్తుంది.
ఆ రోజుల్లో జాతీయత కోసం అనేకులు ప్రాణాలు అర్పించారు. ఈ రోజుల్లో, ముఖ్యంగా గత ఏడేండ్ల నుంచి జాతీయత ముసుగుతో పదవులు, అధికారం కోసం కొందరు పాకులాడుతున్నారు. తుమ్మినా, దగ్గినా జాతీయతకు ప్రమాదం ఏర్పడిందని సీబీఐ., ఇడీ, ఎన్ఐఏ, ఇన్కమ్టాక్స్ శాఖల అండతో అసలైన జాతీయవాదులను, దేశభక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఈ మధ్య ఎన్నికలను ప్లాసీ (1757నాటి) యుద్ధం వలె మార్చి జాతీయత ప్రమాదలో పడిందన్న బూటకపు నినాదం ఇచ్చి, లేని బూచిని చూపి, ప్రాంతీయతను అగ్ని పరీక్షకు నిలిపారు. తాతకు దగ్గులు నేర్పినట్లు, బయటి నుంచి దిగుమతి అయిన పెద్దలు బెంగాల్లో జాతీయతపై లెక్చర్లు ఇచ్చారు. ప్రధానమంత్రి, దేశ వ్యవహారాల మంత్రి (ఇద్దరు గుజరాతీలు) ఈ లెక్చర్ల కోసం వెచ్చించిన అమూల్యమైన ఎన్నో రోజుల సమయాన్ని ఢిల్లీలో తమ అధికార విధుల నిర్వహణ కోసం వినియోగిస్తే కొన్ని వేల మంది ఈ దేశంలో కరోనా కాటుకు బలి అయ్యేవారు కాదు. బెంగాలీలకు జాతీయత ప్రబోధాలు కొత్తవి కావు. వివేకానందుడు, విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఎన్నో ఏండ్లు విద్వేషరహిత, దురభిమానం లేని జాతీయతను బెంగాలీలకు, ప్రపంచానికి ప్రబోధించారు. అయినా, మొన్నటి ఎన్నికలలో ఎవరు వెక్కిరించినా, కొక్కిరించినా ఘనంగా గెలిచింది ప్రాంతీయతే. నిజానికి గెలువవలసింది ప్రాంతీయతే.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపాయి ప్రాంతీయతకు ప్రాధాన్యత ఇచ్చి కశ్మీర్ సమస్య పరిష్కారానికి “ఇన్సానియత్, జమ్హూరియత్, కశ్మీరియత్” మూడింటికి విలువ ఇవ్వాలన్నారు. ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన ఆయన సహచరులు ఆ మూడింటికి యమునాతీరంలో తిలోదకాలిచ్చారు. స్వతంత్ర భారతంలో ప్రాంతీయత ప్రవక్త కేసీఆర్ రాష్ట్రాల ప్రగతి, దేశ సమగ్రత, ఫెడరల్ వ్యవస్థ పటిష్టత ప్రాంతీయత మీద ఆధారపడి ఉన్నాయని నిరూపించారు. కేంద్రంలో రాజ్యాంగానికి విఘాతం కల్గిస్తూ అధికార కేంద్రీకరణ జరిగినప్పుడు ప్రాంతీయతే శ్రీరామరక్ష అని ఆయన నిరూపించారు. ప్రాంతీయ శక్తిని కేసీఆర్ సృజనాత్మకంగా వినియోగించడం విశేషం. కేసీఆర్ నాయకత్వంలోని నూతన తెలంగాణ రాష్ర్టం ప్రాంతీయత బలంతో అసాధారణ రీతిలో, దేశానికే ఆదర్శప్రాయంగా పురోగమించడం ఇందుకు నిదర్శనం.
జాతీయ పార్టీలు ప్రాంతీయ ఆకాంక్షలకు తగినంత ప్రాధాన్యం, గుర్తింపు ఇస్తాయన్న నమ్మకం లేదు. ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలను, అభిరుచులను గుర్తించవలసింది, వాటికి ప్రభుత్వ వ్యవహారాలలో తగినంత ప్రాధాన్యత కల్పించవలసింది నిజానికి ప్రాంతీయ పార్టీలే. అటల్ బిహారీ వాజపాయి మాటకు విలువ ఇచ్చి కశ్మీరియత్ను గౌరవించినట్లయితే కశ్మీర్ ప్రజలకు సంతృప్తి కలిగి వుండేది. ఈరోజు మనమెంత కాదన్నా అదొక అంతర్జాతీయ సమస్యగా పరిగణన పొందకపోయేది. 60, 70 దేశాల రాయబారులను తీసుకవెళ్లి, అధికార పర్యటనలను ఏర్పాటు చేసి, ఆ రాయబారులకు విందులు, వినోదాలు సమకూర్చి ఆనందింపచేసినప్పటికి, ఇది కేవలం అంతర్గత సమస్య అని వితండవాదం జరిపినప్పటికీ కశ్మీర్ పరిస్థితి ఈరోజు అక్కడి ప్రజలకు కాని, అంతర్జాతీయ పరిశీలకులకు కాని సంతృప్తి కలిగించడం లేదు. ఇది మన జాతీయవాదుల పనితీరుకు నిదర్శనం.
దేవులపల్లి ప్రభాకర రావు