ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం చేపట్టే పనుల్లో పారదర్శకత ముఖ్యం. ఇప్పటికే మన దేశంలో ఎగువసభ, దిగువ సభలు నిర్వహించే సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తూ పారదర్శకతకు ప్రాధాన్యమిస్తున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయటం ద్వారా పారదర్శకత మాత్రమే కాకుండా ప్రజా ప్రతినిధుల పనితీరు ప్రజలు తెలుసుకునే వీలుకలుగుతుంది.
ఈ నేపథ్యంలోనే దేశప్రజలకు సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి ఓ తీపి కబురు అందించారు. సుప్రీంకోర్టులో జరిగే వ్యాజ్యాల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయాన్ని చురుగ్గా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా దేశంలోని అత్యధికులు కోరుకుంటున్న విషయం ఇది.
ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్, స్వప్నిల్ త్రిపాఠి మరి కొంత మంది 2017, 2018లో వేసిన కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాల్లో (స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియా) సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయటం సబబే అంటూ 2018 సెప్టెంబర్ 26న సుంప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. తీర్పులో కొన్ని మార్గదర్శకాలు కూడా సూచించింది. త్వరలో ఆ తీర్పు సాకారం కాబోవటం ముదావహం.
సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయాలనే విషయం భారత రాజ్యాంగంలో పొందు పరచలేదు. విచారణ, తీర్పు ప్రకటించటం మాత్రమే బహిరంగ కోర్టు (ఓపెన్ కోర్టు)లో జరగాలని రాజ్యాంగం, చట్టాలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యకే పరిమితమైన సుప్రీంకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేయ టం వలన విచారణలో పారదర్శకత నెలకొంటుంది. ముఖ్యంగా కేసులో వాదించే న్యాయవాదులకు, న్యాయస్థానానికి జవాబుదారీతనం పెరుగుతుంది. సుప్రీంకు స్వయంగా వెళ్లి తమ కేసు విచారణను ప్రత్యక్షంగా తిలకించలేని కక్షిదారులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడ వచ్చు. ఈ ప్రత్యక్షప్రసారం కేవలం రాజ్యాంగ సంబంధ కేసులకు, జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేసులకు మాత్ర మే వర్తించే అవకాశం ఉంది. కక్షిదారులు అనుమతిస్తే ఇతర కేసులను కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే వీలుంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రైవేటు జీవితానికి సంబంధించిన కేసు విచారణ ‘ఇన్ కెమెరా’లో చేయవలసి ఉంటుంది. కాబట్టి గోప్యత హక్కుగా అటువంటి వాటికి మినహాయింపు తప్పదు.
ఇప్పటికే జర్నలిస్టులకు కోర్టులో ప్రత్యక్షంగా హాజరై విచారణకు సంబంధించిన వివరాలు ప్రచురించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అయితే సున్నితమైన విషయాలు, ముఖ్యంగా లైంగికదాడికి గురైన మహిళలు, బాల బాలికల పేర్లను ప్రచురించకుండా నిరోధించే విచక్షణ న్యాయస్థానాలకు ఉంది. బ్రెజిల్, కెనడా, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, మరి కొన్ని దేశాలు ఇప్పటికే ఆయా దేశాల సుప్రీంకోర్టుల్లో జరిగే విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో సబార్డినేటు న్యాయ స్థానాల విచారణ కూడా ప్రత్యక్ష ప్రసారం చేసే అనుమతి ఇచ్చాయి. అమెరికా మాత్రం ప్రత్యక్ష ప్రసారానికి ఒప్పుకోలేదు.
సంతోషించదగ్గ మరో విషయం- సుప్రీం కోర్టు ప్రస్తుత కరోనా కాలంలో జరిపే వీడియో కాన్ఫరెన్స్ విచారణలు, తీర్పులు ప్రజలకు ఎప్పటి కప్పుడు తెలియజేయటానికి ఒప్పుకొన్నది. దానికి అనుకూలంగా ప్రత్యేక మొబైల్ యాప్ను కేవలం వారం రోజుల్లో అందుబాటులోకి తేవటం గమనార్హం. ప్రత్యక్ష ప్రసారం కేవలం సర్వోన్నత న్యాయస్థానానికే పరిమితం చేయకుండా అన్ని న్యాయస్థానాలకు వర్తింప చేయాలి. సుప్రీంకోర్టు, రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాలు ఎక్కువగా రాజ్యాంగ సంబంధ కేసులను, జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేసులను విచారిస్తాయి. కాబట్టి ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వాటిపై అవగాహన పెంచుకొనే అవకాశం కలుగుతుంది. ప్రజలు చట్టాల్లోని లోటు పాట్లు కూడా తెలుసుకునే వీలుంది. అంతే కాకుండా రాజ్యాంగం కల్పించిన సమాచారం తెలుసుకునే హక్కు నిజమవుతుంది.
తడక మళ్ళ మురళీధర్
(వ్యాసకర్త: జిల్లాస్థాయి విశ్రాంత న్యాయమూర్తి)