ఉమ్మడి రాష్ట్రంలో చెరువులు విధ్వంసమైనట్టే వాగులు వంకలు కూడా ఎండిపోయాయి. ఉద్యమకాలంలో గోరటి వెంక న్న రాసిన ‘వాగు ఎండిపాయెరా, పెదవాగు తడి ఎండిపాయెరా’ పాట మన హృదయాలను పిండేసింది. పెద్దవాగు తెలంగాణలో ఒక సర్వనామం. వెంకన్న ప్రస్తావించిన ఎండిన పెద్ద వాగులు తెలంగాణ అంతటా ఉన్నాయి. కాబట్టే ఆ పాటతో తెలంగాణ సమాజం మమేకమైంది. నాడు చెరువుల పునరుద్ధరణ ఒక ఉద్యమ ఆకాంక్షగా ముందుకు వచ్చింది.
తెలంగాణ ఏర్పడగానే సాగునీటి రంగంలో కేసీఆర్ చేపట్టిన తొలి పథకం ‘మిషన్ కాకతీయ’ పేరుతో చెరువుల పునరుద్ధరణ. తర్వాత కేసీఆర్ చేపట్టిన మరో కార్యక్రమం వాగుల పునరుజ్జీవన పథకం. ఈ పథకంలో భాగంగానే మా బోథ్ పెద్దవాగు పునరుజ్జీవనానికి నోచుకుంటున్నది. సహ్యాద్రి పర్వతశ్రేణుల్లో భాగమైన నిగ్ని కంటెగామ గుట్టల్లో పుట్టిన పెద్దవాగు 1970 దశకం దాకా జీవనదిగా ఉంది. ఎండకాలంలో కూడా వాగు పారేది. మా బాల్యం అంతా ఈ వాగులో, వాగు ఒడ్డున ఉన్న ఊరుమ్మడి మామిడిచెట్ల మధ్యన గడిచింది.
ఫిబ్రవరిలో ఒంటిపూట బడులు మొదలయ్యాక జూన్లో వానలు వచ్చేదాకా ఈ పెద్దవాగులో ఈతలు, పండ్లు కోరలు పోయేటట్టు మామిడికాయలు ఉప్పు కారం నంచుకొని తినడం మరిచిపోలేని జ్ఞాపకం. కాలి కింది కట్టే, గిల్లీదండ వంటి ఆటలతో అలసిపోయి చీకటి పడే వేళకు ఇంటికి వచ్చేది. పెద్ద వాగుతో ఈ పురా జ్ఞాపకం మరపునకు వచ్చేది కాదు. కాలం మారింది. ఊరు చుట్టూరా ఉన్న అడవి పోయింది. ఊరుమ్మడి మామిడి తోపు మెల్లమెల్లగా తరిగిపోయింది. ఒకప్పుడు చల్లదనానికి మారు పేరుగా ఉన్న బోథ్ వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
1990 దశకం వచ్చేసరికి పెద్ద వాగు నవంబర్లోనే పారకం బందయింది. ఊరిలో నీటి కరువు అనుభవంలోకి రాసాగింది. ఇళ్లలో చేదబావులు కూడా ఎండిపోయినాయి. ఎండకాలంలో ఎప్పుడూ లేని తాగునీటి ఎద్దడి వచ్చింది. అప్పుడు అటకెక్కిన పెద్దవాగు కరత్వాడ చెరువు ఫైల్ను వెలికితీసిండు నాకన్నా సీనియర్ అయిన మా ఊరి సాగునీటిశాఖ ఇంజినీర్ శ్రీకాంత్రావు దేశ్పాండే. నిర్మల్ ఎస్ఈ అక్తరుద్దీన్ను తోలుకొచ్చి సైట్ చూపించిండు. మీడియం ప్రాజెక్టుకు సరిపడా నీటి లభ్యత ఉన్నా కూడా కేంద్రం నుంచి అనుమతులు రావడం ఆలస్యమవుతాయన్న కారణం చేత దాన్ని 4,700 ఎకరాల ఆయకట్టుతో మైనర్ ప్రాజెక్టుగా మార్చి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడానికి శ్రమపడ్డడు.ఆయన కృషి కారణంగా ప్రాజెక్టు 2000లో శాంక్షన్ అయి పనులు మొదలైనాయి. 2003 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యింది. అదే సమయంలో తాగునీటి కోసం ఊరిపక్కనే పెద్దవాగు మీద ఒక చెక్డ్యాం కూడా నిర్మాణమైంది. కరత్వాడ చెరువు, చెక్డ్యాం కారణంగా ఎండిపోయిన పెద్దవాగు కొద్దిగా జీవం పోసుకున్నది. అయితే అది బోథ్ వరకే. ఇప్పుడు వాగుల పునరుజ్జీవనం పథకంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా శాంక్షన్ చేసిన మరో నాలుగు చెక్డ్యాంల వల్ల పెద్దవాగు పొచ్చెర జలపాతం వరకు పునరుజ్జీవనం పొందుతుంది. బోథ్ పర్యావరణం పునరుద్ధరణ జరుగుతుంది. భూగర్భ జలాలు పైకి లేస్తాయి. పశు పక్షులకు, వన్యప్రాణులకు నీటి తావులు ఏర్పడతాయి. వన సంపద పెరుగుతుంది.
మేం చిన్నప్పుడు చూసిన పెద్దవాగు మళ్ళీ దర్శనం ఇవ్వబోతున్నది. కరత్వాడ చెరువు నుంచి వచ్చే సీపేజ్ వాటర్, 4700 ఎకరాల ఆయకట్టు నుంచి వచ్చే పడవాటి నీరు (రిజనరేటెడ్ వాటర్) ఇప్పుడు ఈ చెక్డ్యాంలలో నిల్వ ఉంటాయి. బోథ్ పెద్దవాగు ఇక ఎప్పుడూ ఎండిపోయే పరిస్థితి రాదు. పెద్దవాగు మీద శాంక్షన్ అయిన నాలుగు చెక్డ్యాంలలో పొచ్చెర గ్రామం దగ్గర చెక్డ్యాం నిర్మాణం నెల కింద పూర్తయింది. ఇటీవల కురిసిన వానలకు చెక్డ్యాం నిండి అలుగు పారింది. నా హృదయం కూడా! దీనిపైన రెండు చెక్డ్యాంలు (బోథ్, కుచులాపూర్), కింద పొచ్చెర జలపాతం కొంచెం ఎగువన ఒక చెక్డ్యాం ఈ జూన్కల్లా పూర్తవుతాయి.
రాష్ట్రంలో చెక్డ్యాంల నిర్మాణాన్ని మేజర్, మీడియం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలో ఉండే వాగులపై మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో వాగులను వాటిలోకి వచ్చే నీటి ప్రవాహాలను బట్టి 8 కేటగిరీలుగా వర్గీకరించారు. 4 నుంచి 8 కేటగిరిలోకి వచ్చే వాగులపై మాత్రమే చెక్డ్యాంలను అనుమతించాలన్నది మరో నిబంధన. బోథ్ పెద్ద వాగుపై నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టు, బజార్ హత్నూర్ మండలంలో దహెగాం గ్రామం దగ్గర కడెం నదిపై నిర్మించిన ప్రాజెక్టు రెండూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావడంతో ఈ రెండు వాగులపై చెక్డ్యాంలను అధికారులు ప్రతిపాదించలేదు. ఈ రెండు మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అయినా కూడా వీటి ఆయకట్టు దాదాపు మీడియం ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టుకు దగ్గరలో ఉంటుంది. నీటి లభ్యత కూడా ఉంది.
ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకుపోవడానికి దాదాపు 15 రోజులు ఫైల్ పట్టుకొని వేచిచూశాను. ఒకరోజు చెక్డ్యాంల మీద ముఖ్యమంత్రి దగ్గర సమీక్ష జరిగింది. ఇదే మోకా అనుకొని ముఖ్యమంత్రికి వివరించాను. సార్ గూగుల్ ఓపెన్ చేసి వాగుపై గతంలో నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టును, అక్కడి నుంచి కుంటాల వాటర్ఫాల్ దాకా పెద్ద వాగును గూగుల్ ఎర్త్లో చూశారు. బోథ్ పెద్ద వాగు పొచ్చెర వాటర్ఫాల్స్ తర్వాతకు మారి గ్రామం వద్ద కడెం నదిలో కలుస్తుంది. కడెం నదిపై కుంటాలకు ఎగువన ప్రతిపాదించిన కుఫ్టి డ్యాం సైట్ వద్ద లెవెల్స్ అవి కూడా చూశారు. అవకాశం దొరికితే చాలు గూ గుల్ ఎర్త్ ఓపెన్ చేసి ఆ ప్రాంతం జాగ్రఫీ మొత్తం అధ్యయనం చేస్తారు కేసీఆర్. తెలంగాణ జాగ్రఫీనే కాదు, మొత్తం కృష్ణా గోదావరి బేసిన్లను సమగ్ర అధ్యయనం చేశారు. ఏ నది ఎక్కడ ఉన్న ది, ఆ నదుల మీద ఏయే ప్రాజెక్టులు కట్టారన్న విషయాలు బాగా అధ్యయనం చేశారు. అట్లా సంతృప్తి చెందిన కేసీఆర్ ఈ రెండు వాగులపై కూడా చెక్డ్యాంలను నిర్మించాలని ఆదేశించారు.
మరుసటి రోజు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్రాజ్ (ఈయన గతంలో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. కరత్వాడ, బజార్హత్నూర్ ప్రాజెక్టుల భూ సేకరణ ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడే జరిగింది) బోథ్ పెద్ద వాగుపై, బజార్హత్నూర్, కడెం వాగుపై నిర్మించిన కరత్వాడ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 4, బజార్హత్నూర్ కడెం వాగుపై నిర్మించిన ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో 5 చెక్డ్యాంలు మొదటిదశలో శాంక్షన్ అయినాయి. వీటికి నాబార్డ్ నిధులు కూడా సమకూరాయి.
బోథ్ పెద్దవాగు మాత్రమే కాదు,గోరటి వెంకన్న తన పాటలో ప్రస్తావించిన దుందుభి, మానేరు, మంజీరా, మున్నేరు, ఆకేరు, స్వర్ణ, హల్దీ, కూడెల్లి, కాగ్నా తదితర వాగులన్నీ పునరుజ్జీవనం పొందబోతున్నాయి. ఒకవైపు తెలంగాణకు హరితహారం, మరొకవైపు వాగుల పునరుజ్జీవనం వలన తెలంగాణ పర్యావరణంలో, జీవావరణంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటాయి. భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరుగుతాయి.
గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు, మేకలు, గొర్లకు, వన్యప్రాణులకు తాగునీటి సమస్య తీరుతుంది. అడవులు పునరుజ్జీవనం పొందడానికి చెక్డ్యాంలు దోహదం చేస్తాయి. బహుముఖ ప్రయోజనాలున్న చెక్డ్యాంల నిర్మాణాలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి
తెలంగాణ జాగ్రఫీనే కాదు, మొత్తం కృష్ణా గోదావరి బేసిన్లను సమగ్ర అధ్యయనం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏ నది ఎక్కడ ఉన్నది, ఆ నదుల మీద ఏయే ప్రాజెక్టులు కట్టారన్న విషయాలు బాగా అధ్యయనం చేశారు. అట్లా సంతృప్తి చెందిన కేసీఆర్ ఈ రెండు వాగులపై కూడా చెక్డ్యాంలను నిర్మించాలని ఆదేశించారు.
శ్రీధర్రావు దేశ్పాండే