గతేడాది ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా, ఈ యేడు కూడా విలయ తాండవం చేస్తున్నది. ఎన్నో కుటుంబాల్లో తీరని వ్యథను మిగుల్చుతూ, ఎన్నెన్నో బంధాలను తెంచివేస్తున్నది. ఈ దారుణ స్థితి మళ్లీ దాపురించడానికి కారణమేదైనా పరిస్థితులు మాత్రం అంచనాలు దాటిపోయాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలను కాపాడుకోవాలి. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా రాష్ర్టానికి ముప్పు వాటిల్లుతుంది.
ప్రాణం పోసేవాడు దేవుడు, ప్రాణం రక్షించేవాడు వైద్యుడు, ఆపదలో నేనున్నానని భరోసా కల్పించేవాడు క్షత్రియుడు. ఇన్ని లక్షణాలను కలిగి ఉన్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. సాధారణంగా ఏ రోగికైనా వైద్యం, మందులు, సరైన భోజనం మాత్రమే కాదు, పక్కనే ఉంటూ ధైర్యాన్నిచ్చే వ్యక్తి కావాలి. అటువంటి ఒక మహానుభావుడు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఒక మహా నాయకుడైతే ఆ రోగికి కలిగిన మనోధైర్యానికి కరోనానే కాదు ఎంతటి రోగమైన పారిపోవాల్సిందే. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దవాఖానల్లో కరోనాతో బాధపడుతున్న వారి మనోగతం. ఈ వ్యాధిని చూసి అందరూ భయపడుతుంటే కేసీఆర్ ఒక మాస్క్ మాత్రమే ధరించి రోగులకు నేనున్నానని భరోసా కల్పించారు. వారి తో ఆప్యాయంగా మాట్లాడారు. ఎంతటి సమస్య అయినా వెంటనే పరిష్కరించి, ఖర్చుకు ఏ మాత్రం వెనుకకు రాకుండా మంచి వైద్యం అందించి అందరిని కాపాడుకుంటామని వారిలో ఆత్మ ైస్థెర్యాన్ని నింపారు.
కరోనా కష్టకాలంలో తమ సొంతవాళ్లే తమని చూడటానికి రాలేని వేళ సీఎం కేసీఆర్ తమను నోరారా పలకరించి.. ‘అవ్వా బాగున్నవా.. భోజనం బాగుందా? మందులు కరెక్టుగా వేసుకుంటున్నవా, ఏం పరేషాన్ గాకు నీకు నేనున్నా, త్వరలోనే నయమై ఇంటికి పోతావులె’ అని చెప్తుంటే వారి ఆనందానికి అవధుల్లేవు. చికిత్స పొందుతూ మాట్లాడలేకపోయిన వారు సైతం కేసీఆర్ను చూడాలి, ఆయనతో మాట్లాడాలనే ఉత్సాహంతో లేచి కూర్చోవడం వైద్యులను సైతం నివ్వెరపోయేలా చేసింది. ఇంతటి అనుభవం వారి జీవితంలోనే కలగలేదనడంలో అతిశయోక్తి లేదు. కరోనా బాధితుల జీవితాల్లో కొత్త వెలుగుల్ని నింపే ఒక ఔషధంలా, వారిని కాపాడే ఒక శక్తిలా ఆయన కనపడ్డారనే చెప్పవచ్చు. వైద్యులను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని, ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించి సరైన న్యాయం చేయడానికి సంసిద్ధుడనని కేసీఆర్ తెలపడం, అంతేకాకుండా ఏండ్లుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకోని ఔట్సోర్సింగ్ నర్సుల క్రమబద్ధీకరణ సమస్యను కూడా పరిష్కరిస్తానని తెలపడం హర్షణీయం.
కేసీఆర్ ప్రతి పనిని యజ్ఞంలా చేస్తారు. ఏ పనినైనా శ్రద్ధతో సంపూర్ణంగా చాకచక్యంగా పూర్తిచేస్తారు. ఆయన మదిలో మెదిలిన ప్రతి ఆలోచన ప్రజా శ్రేయస్సుకు అంకితం. ప్రజా సంక్షేమమే పరమావధిగా తీర్చిదిద్దబడిన ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మనముందు కదలాడుతున్నాయి. అటు కాళేశ్వరమైతే నేమి ఇటు టిమ్స్ అయితేనేమి సకలం సర్వజనులకు అంకితం. తాను వైద్యశాఖను చేపట్టిన నాటినుంచి కేవలం 15 రోజుల్లోనే ఎన్నో మార్పులకు, నూతన విధానాలకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రిమ్స్ దవాఖానను సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు 20 కోట్లు కేటాయించారు. వరంగల్లోని ఎంజీఎంను మాతాశిశు సంరక్షణ కేంద్రంగా మార్చి, వరంగల్ జైలు స్థలంలో అన్ని హంగులతో సూపర్ స్పెషలిటీ దవాఖాన నిర్మాణం తలపెట్టారు. సంగారెడ్డి జిల్లాలో దవాఖాన నిర్మిస్తున్నారు. ప్రతి దవాఖానలో సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు వంటి పలు నిర్ణయాలు జరిగిపోయాయి. ఇవన్నీ కేసీఆర్ నిబద్ధతకు నిదర్శనాలు.
ఇంతటి నిబద్ధతలో కనీసం సగమైనా కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం శోచనీయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో నేర్పుగా వ్యవహరించాల్సిన కేంద్రం వ్యాక్సిన్ల విషయంలో కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నది. పీపీఈ కిట్లు వేసుకుంటే కానీ దవాఖాన లోపలికి వెళ్లే ధైర్యం, వేసుకున్నా కూడా బెడ్ దగ్గరికి వెళ్లే ధైర్యం చేయలేని నాయకులున్నారు. వారు తమ ప్రాంతానికి న్యాయంగా రావాల్సిన వ్యాక్సిన్ల కోసం కేంద్రాన్ని అడగలేకపోతున్నారు. కానీ ధైర్యానికి, సమర్థతకు మారుపేరు అయినటువంటి కేసీఆర్ను విమర్శిస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు తమకోసం పాటుపడే నాయకుడు ఎవరనేది. దేశ ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాల్సిన వారే కన్నీరు పెట్టుకోవాల్సిన సమయం కాదిది. ప్రజలకు ధైర్యాన్ని అందించే నాయకుడు కేసీఆర్. ఇటువంటి దమ్మున్న నాయకుడినే దేశ ప్రజలు కోరుకుంటారు.
(వ్యాసకర్త: టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి)
తాడూరి శ్రీనివాస్