అర్థవంతమైన చర్చలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించవలసిన పార్లమెంటు నిరంతరం గొడవల నిలయంగా మారిపోవడం గర్హనీయం. కొన్ని దశాబ్దాలుగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగడం లేదు. జాతీయ పార్టీలలో ఏది అధికారంలో ఉన్నా, మరేది ప్రతిపక్షంలో చేరినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. పార్లమెంటు కార్యకలాపాలు జరగకుండా కాంగ్రెస్పార్టీ పదే పదే అడ్డుపడుతున్నదని, దీనివల్ల ‘ముఖ్యమైన అంశాలు’ చర్చించటానికి వీల్లేకుండా పోతున్నదని ప్రధాని మోదీ ఇటీవల తమ పార్టీ ఎంపీల సమావేశంలో ఆరోపించారు. మోదీ పేర్కొన్నట్లుగానే.. ఈ నెల 19న మొదలైన వర్షకాల సమావేశాల్లో ఇప్పటివరకూ ఒక్కఅంశంపైన కూడా చర్చ జరగలేదు. దేశంలోని పలువురు విపక్షనేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు తదితరులపై జరిగిన ‘పెగాసస్’ నిఘా వ్యవహారం మీద చర్చ జరుపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రభుత్వం ఇందుకు అంగీకరించకుండా, నిర్దేశిత కార్యక్రమాన్నే కొనసాగించదలుచుకున్నది.
ఈ రోజు పార్లమెంటును కాంగ్రెస్ రోజుల తరబడి అడ్డుకుంటున్నట్లుగానే, యూపీఏ పదేండ్ల హయాంలో బీజేపీ ఆటంకాలు సృష్టించింది. పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడంలో తప్పులేదని నాడు బీజేపీ బాహాటంగా సమర్థించుకున్నది. ‘చర్చలు నిర్వహించటం పార్లమెంటు బాధ్యత. కానీ, ముఖ్యమైన అంశాలను పార్లమెంటు పట్టించుకోనప్పుడు సభను అడ్డుకోవటం ప్రజాస్వామ్యానికి అవసరం’ అని రాజ్యసభలో ప్రతిపక్షనేతగా ఉన్న అరుణ్జైట్లీ ఆనాడు నుడివారు. ‘పార్లమెంటు కార్యకలాపాలు జరుగకుండా అడ్డుపడటం కూడా ప్రజాస్వామ్య రూపమే’నంటూ లోక్సభలో నాటి విపక్షనేత సుష్మాస్వరాజ్ సెలవిచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవే మాటలు మాట్లాడుతూ అదే పాత్రను పోషిస్తున్నది. అధికారంలో ఉన్నామా? లేమా? అన్నదానిని బట్టి కాంగ్రెస్, బీజేపీ వైఖరి మారుతున్నదని స్పష్టమవుతున్నది.
ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటి పార్లమెంటు వారాలపాటు స్తంభించిపోవటం దేశానికి ఏ విధంగా మంచిదవుతుంది? అసలే దేశాన్ని కరోనా కకావికలం చేస్తున్నది. ఆర్థిక అనిశ్చితి మూలంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, నిర్మాణాత్మక పాత్రను ప్రతిపక్షాలు పోషించాలి. సందర్భాన్ని బట్టి ప్రభుత్వానికి సహకరించడం కూడా ఇతర రాజకీయ పక్షాల ధర్మం. అధికార పక్షం కూడా విపక్షాలు చేస్తున్న డిమాండ్పై సానుకూలంగా స్పందిస్తూ, పార్లమెంటు సజావుగా నడిచేందుకు వాటి సహకారం తీసుకోవాలి. అంతిమంగా పార్లమెంటరీ వ్యవస్థను విజయవంతం చేయవలసిన బాధ్యత అందరిపైనా ఉంటుందని ఇరు పక్షాలకు చెందిన నాయకులు గుర్తించాలి.