గ్రామసీమలు అభివృద్ధి చెందాలని ప్రణాళికలు రూపొందించిన సీఎం కేసీఆర్ కలలు నిజమవుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ పని మొదలుపెట్టినా, ఇది జరుగుతదంటారా? అని నిరుత్సాహపరిచే ప్రశ్నలు గతంలో మొలుచుకొచ్చేవి. ఇలాంటి సందర్భాలు ఉద్యమ సమయంలో ఉత్పన్నమైనవే. అలాంటి ప్రశ్నలను పటాపంచలు చేసి రాష్ట్రం సాధించుకున్నాం. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించి కేసీఆర్ ముందుకుసాగారు.
అన్నిరంగాల్లో అత్యవసరంగా పునర్నిర్మాణం జరగాల్సి ఉన్నదని, ఇందుకు పాలనాపరంగా సంస్కరణలు తేవాలని సంకల్పించారు కేసీఆర్. రాష్ట్రంలో ఇప్పటికీ 60 శాతంగా ఉన్న గ్రామసీమలు తిరిగి కళకళలాడే విధంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల జీవితాల్లో మార్పులు జరగాలనేదే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకోసం వైద్యాన్ని గ్రామ వాకిళ్లకాడికి తీసుకుపోతున్నది. రాష్ట్రం వచ్చాక ఏం జరిగిందనే వారికి కండ్లముందు కాళేశ్వరం కనిపిస్తున్నది. దేశానికి తెలంగాణ ధాన్యాగారమైంది. నిండదనుకున్న ఇబ్రహీంపట్నం చెరువు నిండింది. వ్యవసాయాన్ని పండుగచేసి చూపిండు కేసీఆర్.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టి చేసిన కృషి సఫలమైంది. తెలంగాణ పల్లె వైపు దేశమే చూస్తున్నది. ఆహారశుద్ధి యూనిట్లు నెలకొల్పుకునే దశకు వచ్చింది. వీటిద్వారా అన్నివర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి శ్రీకారం చుట్టారు కేసీఆర్. 20 లక్షల ఎకరాల్లో ‘ఆయిల్ పావ్ు’ సాగు చేపట్టి, భారీగా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2025 నాటికి 10 వేల ఆహారశుద్ధి జోన్లు ఏర్పాటు చేసేందుకు కృషి జరుగుతున్నది. ఈ కార్యక్రమం సఫలమైతే 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనున్నది. వ్యవసాయాధారిత మిల్లింగ్, మార్కెటింగ్ అనుబంధ పరిశ్రమలను మరింతగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. కాళేశ్వర జలాలు తెలంగాణ చివరనున్న మా నడిగూడెం దాకా వచ్చాయి. విమర్శకులు ముక్కుపై వేలేసుకునేలా ఇపుడు నల్లగొండ ధాన్యపు కొండైంది. గ్రామానికి ఇరుసుగా ఉన్న వ్యవసాయరంగం ఊహించనివిధం గా అభివృద్ధిని సాధించింది. అభివృద్ధి దళిత బహుజన వాడల నుంచి మొదలైతేనే దళితుల జీవన విధానంలో మార్పు వస్తుందని కేసీఆర్ విశ్వాసం. అందుకే ఉత్పత్తి సృష్టించే చేతుల్లోకి సంపద పోగయ్యే ఆర్థిక చక్రాన్ని నిర్మించేందుకు కృషిచేస్తున్నారు. బీసీ కమిషన్, బీసీ సంక్షేమశాఖ, ఎంబీసీ సంస్థల ద్వారా కులవృత్తులపై లోతుగా అధ్యయనం చేయించారు. దానికి ఆచరణ రూపం ఇచ్చేందుకు ప్రణాళికలను తయారుచేస్తున్నారు.
ప్రాంతాల మధ్య అంతరాలు రూపుమాపేందుకు పల్లెలను బలోపేతం చేన్నారు. అందుకే నీళ్లు, వ్యవసాయం, పల్లెప్రగతి కోసం నిధులు ఎక్కువగా ఖర్చుచేస్తుండటం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనం. భవిష్యత్తులో దేశం ‘తెలంగాణ గ్రామం’ అని పాఠ్యాంశంగా చదువుకొని మన గ్రామాలను అనుకరించే దశకు తెలంగాణ వడివడి గా అడుగులు వేస్తున్నది. చరిత్రకారుడు ఎస్సీ దూబె 1951-52లో ఓయూలో సోషల్ సర్వీస్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు కింద గ్రామ జీవితంపై నగర శివారులోని శామీర్పేటలో అధ్యయనం చేశారు. పల్లెల జీవన ముఖచిత్రం పై వర్సిటీలు సమగ్ర పరిశోధనలు చేయాల్సి ఉన్నది. ఎంఎన్ శ్రీనివాస్ చేసిన పరిశోధన మాదిరిగా పల్లెల్లో సంస్కృతీకరణపై పరిశోధనలు జరగాలి. ఏయే అంతరాలున్నాయో విశ్లేషించి భవిష్యత్ తరాలకు అందించాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక మార్పులను రికార్డు చేసే పనిని వర్సిటీలు మొదలుపెట్టాలి.
జూలూరు గౌరీశంకర్