ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి లక్షల మందిని పొట్టన పెట్టుకున్నది. ఎన్నో కుటుంబాలను, ఎందరో చిన్నారులను అనాథలను చేసింది. ఉద్యోగులను రోడ్డుకీడ్చింది. ఎన్నో దేశాలను ఆర్థికంగా కుంగదీసింది. అదే సమయంలో కొందరు కోటీశ్వరులు మాత్రం మరింత సంపాదించి ప్రపంచ కుబేరులయ్యారు. కరోనా సంక్షోభంలో 9 మంది కొత్తగా బిలియనీర్లుగా ఎదిగారు. కరోనా టీకాపై పేటెంట్ హక్కును పొందిన ఔషధ కంపెనీల అధిపతులే ఈ కొత్త బిలియనీర్లని నివేదికలు చెప్తున్నవి.
ఈ అంతర్జాతీయ విపత్తు సమయంలో ప్రపంచంలోనే తనదంటూ ఓ ముద్రవేసుకునే సదవకాశాన్ని మోదీ చేజార్చుకున్నారు! ఇప్పటికైనా మించిపోలేదు, సాహసించండి మోదీజీ! కంపల్సరీ లైసెన్సింగ్ ద్వారా, టీకా ఉత్పత్తిని విస్తరింపజేయండి!
ఒక దేశం జాతీయ విపత్తుకు లోనైనప్పుడు, పేటెంట్ హక్కులను సడలించి, టీకా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కరోనా వైరస్ అంతర్జాతీయ విపత్తే కదా? అయినా సరే సదరు కంపెనీలుగానీ వాటికి అంగరక్షకులుగా వ్యవహరిస్తున్న అగ్రదేశాల అధినేతలుగానీ డబ్ల్యూటీవో నిబంధనలను ఎందుకు లెక్కచేయటం లేదు?
కరోనా రెండో దశ ప్రపంచాన్ని హడలెత్తించింది. రానున్న మూడో దశ మరింత ప్రమాదకరమైనదంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్నిం చి తప్పించుకోవటానికి ‘టీకా’యే ఏకైక పరిష్కార మార్గమన్నది జగమెరిగిన సత్యం! కానీ, ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా వంటి పేద దేశాల్లో కేవలం 2 శాతం మంది ప్రజలకు మాత్రమే టీకాలు వేశారు. మన దేశంలో అత్యధిక జనాభా కలిగిన యూపీలో 3.5 శాతం మంది ప్రజలకు మాత్రమే టీకా రెండు డోసులు వేయగలిగాం. బీహార్ వంటి పెద్ద రాష్ర్టాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇలాగైతే ప్రపంచంలోని ప్రతి మనిషికి టీకాను వేయటం అన్నది మరో పదేండ్లకైనా సాధ్యమవుతుందా?
కరోనా వైరస్ ఇంగ్లండ్లో ‘డెల్టా ప్లస్’ దక్షిణాఫ్రికాలో ‘బీటా’, బ్రెజిల్లో ‘గామా’, భారత్లో ‘డెల్టా’ తదితర వేరియంట్లుగా రూపాంతరం చెందుతూ మరింత ప్రమాదకరంగా మారుతున్నది. టీకా కార్యక్రమం ఇలాగే నత్తనడకన సాగితే, చివరికి టీకాకు కూడా లొంగనంత శక్తివంతంగా కరోనా వైరస్ మారే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు విజ్ఞులు! మరి ఈ పాపం ఎవరిది? పేటెంట్ హక్కును అడ్డుపెట్టుకొని, టీకా పరిజ్ఞానాన్ని ప్రపంచానికి అందకుండా చేస్తున్న టీకా కంపెనీలు, వాళ్ల లాభాల భద్రత కోసం పేటెంట్ హక్కు సడలింపునకు అడ్డుపడుతున్న అగ్ర దేశాధినేతలదే అన్నది అందరికీ తెలిసిన సత్యమే.
పేటెంట్ హక్కునిచ్చే డబ్ల్యూటీవో నిబంధనల ప్రకారం, ఒక దేశం జాతీయ విపత్తుకు లోనైనప్పుడు, పేటెంట్ హక్కులను సడలించి, టీకా ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కరోనా వైరస్ అంతర్జాతీయ విపత్తే కదా? అయినా సరే సదరు కంపెనీలుగానీ వాటికి అంగరక్షకులుగా వ్యవహరిస్తున్న అగ్రదేశాల అధినేతలుగానీ డబ్ల్యూటీవో నిబంధనలను ఎందుకు లెక్కచేయటం లేదు? ఇదే ఒక పెను సమస్య కాగా, ఆ టీకా కంపెనీలు కూడా తమకు ప్రోత్సాహక పెట్టుబడిని అందించిన సదరు దేశాలకే తాము ఉత్పత్తి చేసిన టీకాల్లో అధిక మొత్తాన్ని కనీస లాభాలకు అందించాయి. ఫలితంగా ప్రపంచ జనాభాలో 13 శాతం మాత్రమే ఉన్న జీ-7 దేశాలు ప్రపంచంలో ఉత్పత్తయిన మొత్తం కరోనా టీకాల్లో 33 శాతం టీకాలను తమ వద్ద నిల్వ ఉంచుకున్నారు. ఉదాహరణకు 6.8 కోట్ల జనాభా కలిగిన బ్రిటన్కు 13.6 కోట్ల టీకాలు చాలు. కానీ 50 కోట్ల టీకాలను నిల్వ చేసుకున్నది. ఇలా అగ్రదేశాల బాధ్యతారహిత ప్రవర్తన కూడా టీకాల కొరతకు కారణమే కదా!
కొవిడ్ టీకా గుత్తాధిపతులు 2025 నాటికల్లా 157 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయనున్నారని ఐక్యూవీఐఏ నివేదిక అంచనా. దీన్నిబట్టి చూస్తుంటే పేటెంట్ హక్కులున్న టీకా కంపెనీలు, వాటికి అంగరక్షకుల్లా వ్యవహరిస్తున్న సంపన్న దేశాధిపతులు, ఉద్దేశపూర్వకంగానే కొవిడ్ విపత్తును పొడిగిస్తూ లాభాలను పిండుకోజూస్తున్నాయని స్పష్టమవుతున్నది. ఇంతటి ప్రపంచ విపత్కాలంలో కూడా ప్రజల ప్రాణాల కన్నా.. లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్న వాళ్ల ప్రవర్తన అత్యంత అమానుషంగా ఉంది.
కొవిడ్ టీకా గుత్తాధిపతులు 2025 నాటికల్లా 157 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయనున్నారని ఐక్యూవీఐఏ నివేదిక అంచనా. దీన్నిబట్టి చూస్తుంటే పేటెంట్ హక్కులున్న టీకా కంపెనీలు, వాటికి అంగరక్షకుల్లా వ్యవహరిస్తున్న సంపన్న దేశాధిపతులు, ఉద్దేశపూర్వకంగానే కొవిడ్ విపత్తును పొడిగిస్తూ లాభాలను పిండుకోజూస్తున్నాయని స్పష్టమవుతున్నది.
గంజాయి వనంలాంటి ఈ గ్లోబల్ వ్యాపార ప్రపంచంలో.. తులసి మొక్కల్లాంటి దేశాధినేత లూ ఉన్నారు. వాళ్లు తాత్కాలికంగానైనా పేటెంట్ హక్కులను సడలించి, కరోనా టీకాలను అంతర్జాతీయం చెయ్యాలన్న డిమాండ్ను ప్రపంచం ముందుంచారు. దక్షిణాఫ్రికా వంటి పేదదేశాల అధినేతలతో పాటు భారత ప్రధా ని మోదీ కూడా ఆ ప్రతిపాదనను బలపర్చటం ముదావహం. భారతీయులతో పాటు పేదదేశాల వారికి ఆపద్బాంధవునిలా కనిపించారు మోదీ. ఎందుకంటే పేటెంట్ హక్కు సడలింపు ద్వారా భారత్లో ఉత్పత్తవుతున్న జనరిక్ మందుల పుణ్యా న రూ.100 ఉన్న ఔషధాలను కేవలం రూ.10కే కొనుక్కోగలుగుతున్నారు పేద దేశాల ప్రజలు. అదే విధంగా తమకు టీకాను కూడా మోదీ అందించగలరు అని ఆశపడ్డారు.
ఆ దిశగా మోదీ ముందడుగు వేసి డబ్ల్యూటీవో మనకిచ్చిన ‘కంపల్సరీ లైసెన్సింగ్’ అవకాశాన్ని వినియోగించుకొని టీకా ఉత్పత్తిని జాతీయం చేసి ఉంటే, ఈ ఏడాది చివరికల్లా భారతీయులకే కాదు, పేద దేశాల ప్రజలకూ టీకాను చౌకగా అందించగలిగేవారు. ఎందుకంటే టీకా పరిజ్ఞానాన్ని ఇస్తే చాలు, ప్రపంచానికి సరిపడా టీకాలను ఏడాదిలో ఉత్పత్తి చేయగల శక్తి సామర్థ్యాలున్న ఫార్మా కంపెనీలు మన దేశంలో ఉన్నయి. కానీ దురదృష్టవశాత్తు ‘నీతి ఆయోగ్’ కంపల్సరీ లైసెన్సింగ్ ప్రతిపాదనను తోసిపుచ్చింది. అయినా మౌనం వహించారు మోదీ. తద్వారా, పేటెంట్ హక్కులను సడలించాలన్న ప్రతిపాదనకు తానిచ్చిన మద్దతుకు విలువ లేకుండా చేసుకున్నారు. ఈ అంతర్జాతీయ విపత్తు సమయంలో ప్రపంచంలోనే తనదంటూ ఓ ముద్రవేసుకునే సదవకాశాన్ని మోదీ చేజార్చుకున్నారు! ఇప్పటికైనా మించిపోలేదు, సాహసించండి మోదీజీ! కంపల్సరీ లైసెన్సింగ్ ద్వారా, టీకా ఉత్పత్తిని విస్తరింపజేయండి! భారత్తో సహా ప్రపంచ పేదలందరికీ శీఘ్రంగా టీకానందించి, అంతర్జాతీయ ప్రాణదాతగా మీరు భాసించెదరుగాక!
పాతూరి వేంకటేశ్వరరావు