‘పర్యావరణ పరిరక్షణ- సర్వజన సంరక్షణ’.. అనే నినాదంతో పచ్చదనం పెంపుపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పనిచేస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్తతరహా కార్యక్రమాలను తీసుకుంటూ నాలుగేండ్లుగా రాజ్యసభసభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ముక్కోటి వృక్షార్చన తలపెట్టింది ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. రాష్ట్రవ్యాప్తంగా ఒక గంటలో మూడు కోట్ల మొక్కలు నాటి చరిత్ర సృష్టించటం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు, పెరుగుతున్న భూతాపం రానున్న రోజుల్లో ఎదురయ్యే ముప్పును సూచిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంపీ సంతోష్కుమార్ ఈ బృహత్కార్యాన్ని తలపెట్టారు. పచ్చదనాన్ని పెంచే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ తెలంగాణకు ‘హరితహారం’ కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్నుంచి స్ఫూర్తిపొందిన సంతోష్కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ప్రతి వ్యక్తి మూడు మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకొని, మరో ముగ్గురికి మొక్కలు నాటేలా ఛాలెంజ్ విసరడమే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’. ఇందులో భాగంగానే పార్లమెంట్ మొదలు పల్లెటూరి దాకా ఈ కార్యక్రమం విస్తరించింది. ఈ హరిత స్ఫూర్తి విదేశాల్లోనూ కొనసాగుతున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న కోటి వృక్షార్చన విజయవంతమైంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న జన్మదినం సందర్భంగా అదిలాబాద్లో ఒకేచోట మూడున్నర లక్షల మొక్కలు నాటి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ రికార్డు సృష్టించింది. మహబూబ్నగర్ స్వయం సహాయక గ్రూపు మహిళలు తమ స్వహస్తాలతో తయారుచేసిన రెండు కోట్లకు పైగా విత్తన బంతులు (సీడ్ బాల్స్) గిన్నెస్ రికార్డుకెక్కాయి. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఇలా తన రికార్డులను తానే తిరగరాస్తూ ఇప్పుడు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా క్షీణించిపోయిన అడవులను దత్తత తీసుకొని, అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించారు. స్వయంగా ఆయన హైదరాబాద్ శివారు కీసరలో 2,424 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకొని అద్భుతమైన ఎకో పార్కును అభివృద్ధి చేస్తున్నారు. ఆయన బాటలోనే హీరో ప్రభాస్ ఖాజీపల్లిలో 1,650 ఎకరాలను, ఫార్మా దిగ్గజం హెటిరో కంపెనీ సంగారెడ్డి జిల్లా మంబాపూర్లో 2,543 ఎకరాల అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. మరికొందరు ప్రముఖులు కూడా సంతోష్ బాటలోనే నడుస్తున్నారు. చెట్టు ప్రాధాన్యం, మనిషి నిత్య జీవితంలో మొక్కలతో ఉన్న అనుబంధంపై సంతోష్కుమార్ ‘వృక్షవేదం’ పేర ప్రత్యేక పుస్తకాన్ని కూడా తీసుకువచ్చారు.
మొక్కలు నాటడం, వాటిని కాపాడుకోవటం, అడవులను రక్షించుకోవడం, పచ్చదనాన్ని పరిరక్షించుకోవాలనే తపన సంతోష్కుమార్కు ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అలవడింది. పర్యావరణ పరిరక్షణ అభివృద్ధి మాటున గొడ్డలిపెట్టుగా మారింది. దాన్ని అధిగమించేందుకే ఎంపీ సంతోష్కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ మంచి సంకల్పంలో అందరం భాగస్వామ్యులం కావాలి. ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేసి మంత్రి కేటీఆర్కు జన్మదిన కానుకగా అందించాలి. ‘హరితహారం’, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఫలితాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పచ్చదనం గణనీయంగా పెరిగింది. ఇదే స్ఫూర్తి కొనసాగితే రాష్ట్రంలో లక్ష్యిత 33 శాతం పచ్చదనం సాధన కష్టమేం కాదు.
శ్రీకాంత్ బాబు బందు