నీటి పారుదల, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి పలు రంగాలలో విప్లవాత్మక మార్పులను ప్రవేశ పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు దళితుల సామాజికార్థిక అభివృద్ధి కోసం విరాట్రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి సాగుతున్న కసరత్తును గమనిస్తే, కేసీఆర్ దీనిని సవాలుగా స్వీకరించారని అర్థమవుతుంది. వంద మంది ఐఏఎస్లతో సర్వే జరిపించడం, లబ్ధిదారుల గుర్తింపునకు ఊరికో ఐఏఎస్, మండలాలవారీ పర్యవేక్షణకు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి ఉన్నతాధికారులను నియోగించడం అపూర్వం. నిధుల కోసం సంకోచించకుండా, పైలట్ ప్రాజెక్టు కోసం ఎంచుకున్న నియోజకవర్గంలో అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింప చేయడం కూడా అసాధారణ, సాహసోపేత నిర్ణయం.
మధ్యయుగాల వరకు రాజ్యపాలనలో శాంతిభద్రతలను కాపాడటానికే ప్రాధాన్యం ఉండేది. ఆధునిక యుగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడి పరిపాలన స్వభావం మారిపోయింది. వివక్షలు, అసమానతలను రూపుమాపి, బలహీనవర్గాల సాధికారత సాధిస్తూ, సామాజిక పరివర్తన సాధించడం ఆధునిక రాజ్య కర్తవ్యమైంది. అయినా ఈ వాస్తవాన్ని గుర్తించి పాలించే నాయకులు బహు అరుదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసమే ప్రభుత్వం ఉన్నదనే విధంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని అన్ని సామాజికవర్గాల సాధికారతకు వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. భారీ స్థాయిలో గురుకులాల ఏర్పాటు, సన్న బియ్యంతో తిన్నంత భోజనం మొదలైనవన్నీ ప్రభుత్వ మానవీయ స్వభావాన్ని ప్రస్ఫుటిస్తున్నా యి. మన దేశంలో ఏడు దశాబ్దాలుగా ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా దళితుల జీవితాల్లో మార్పు రాకపోవడానికి కారణం పాలకులకు చిత్తశుద్ధి లేకపోవడమే. ఈ సమస్య మూలాలకు వెళ్ళి శాశ్వతంగా పరిష్కరించాలని కేసీఆర్ ఉద్యమకాలం నుంచే చెబుతున్నారు.
‘తెలంగాణ దళిత బంధు’ ప్రయోగానికి హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కూడా సముచితమే. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులుగా గుర్తింపు పొందారు. కేసీఆర్ పిలుపును అందుకొని తెలంగాణ ఉద్యమ పతాకాన్ని అందిపుచ్చుకొని రెపరెపలాడించింది నాటి కమలాపూర్ నియోజకవర్గమే. ఇంతటి ఉన్నతమైన పథకాన్ని లబ్ధిదారులు విజయవంతం చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా దళితులు స్ఫూర్తినొందుతారు. ముఖ్యమంత్రి ప్రబోధించినట్టు- భోజనాన్ని ఎంతగా మనసారా చేస్తామో, ఈ పథకాన్ని అంత మనస్ఫూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం అమలు చేయాలి. ప్రపంచవ్యాప్తంగా వివక్ష, అసమానతల వంటి సామాజిక జాడ్యాలున్నాయి. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనూ నల్లజాతీయుల పట్ల వివక్ష పోలేదు. దళితుల సాధికారతను సాధించినట్టయితే, ప్రపంచానికే నమూనాగా తెలంగాణ మారుతుంది.