కిటెక్స్ వస్త్ర సంస్థ మనం ఇచ్చిన ప్రోత్సాహకాలను చూసి సొంత రాష్ట్రమైన కేరళ కాదని వరంగల్లోని టెక్స్టైల్స్ పార్క్లో అడుగిడింది. రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టడం గొప్ప విషయం. ఇది మన పారిశ్రామిక విధానంపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
పెట్టుబడులను ఆకర్షించే పట్టుదల ఉన్న నేతగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు గడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడక ముందు లక్ష కోట్ల లోపే ఉండేది. 2020-2021 నాటికి దాదాపు రూ.10లక్షల కోట్ల స్థూల ఉత్పత్తికి చేరింది. హైదరాబాద్లోనే కాకుండా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ, ఇతర పరిశ్రమలు విస్తరించాయి.
5వ జనరేషన్తో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడమే 5.0 లక్ష్యం. గేమింగ్, వీఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాల్లో కూడా నేడు రాష్ట్రం ముందుకు సాగుతున్నది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, వంటి కొత్త పరిశోధనలను రాష్ట్రంలో ప్రారంభించడానికి అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఫార్మా రంగంలో కూడా మెడికల్ పరికరాల తయారీ సంస్థ మెడ్టెక్ వంటి కంపెనీలు దేశంలోనే మొదటిసారి ఇక్కడ పెట్టుబడి పెట్టబోతున్నాయి. సౌరశక్తి, పవనశక్తి, బయో డీజిల్ రంగాల్లో రాష్ట్రం విజయవంతంగా ముందుకు సాగిపోతున్నది. 2014లో కేవలం 3 మెగావాట్స్ ఉన్న సౌరశక్తి నేడు 3500 మెగావాట్ల పైన ఉత్పత్తి అవుతున్నది. సోలార్ పాలసీ, ఎలక్ట్రికల్ వెహికల్ విధానాలు పారిశ్రామిక రంగానికి ఊతమిస్తున్నాయి. భువనగిరి, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో డ్రై పోర్టుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించింది.
డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తున్నది. హైదరాబాద్కు చుట్టూ మరో 50కిలోమీటర్ల మేర పరిశ్రమలు విస్తరించేవిధంగా చర్యలు తీసుకుంటున్నది. ఎలక్ట్రానిక్ పార్క్ (మహేశ్వరం), ఫార్మా పార్క్ (సుల్తానాపూర్), ఏరో పార్క్ (ఆదిభట్ల) వంటి ప్రాంతాలకు రానున్న 2030 వరకు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది.
ఇప్పటికే షాబాద్ మండలంలో దేశంలోనే మొదటిసారి ఫ్లోర్ డిజైన్ సంస్థ వెల్స్పన్ కంపెనీ ఉత్పత్తి మొదలుపెట్టింది. కెనడాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఇవాన్ హో కేంబ్రిడ్జి అనే రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ టవర్స్ ప్రారంభించడం ద్వారా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రోత్సాహించే విధంగా సింగరేణిలో ఉత్పత్తి పెంచడం, సిర్పూర్ పేపర్ మిల్లును పునః ప్రారంభించడం జరిగింది. రాష్ట్రం లక్ష కోట్లకు పైగా పెట్టుబడులను ఆహ్వానించిందని, సుమారు 15లక్షల మంది యువతకు సేవా, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి కల్పించిందని ఇటీవలే విడుదల చేసిన ఇన్వెస్ట్ తెలంగాణ రిపోర్ట్ పేర్కొన్నది.
పారిశ్రామిక రంగంలో 30 శాతం వరకు ఉత్పత్తి రంగం ఉండే విధంగా ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. రాష్ట్రంలో వనరులు అధికంగా ఉండడం వలన వాటిని సుస్థిరాభివృద్ధికి ఉపయోగించుకోవాలి. రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా 10లక్షల నుంచి ఇంకా పెరిగే విధంగా వ్యూహాత్మకమైన ప్రణాళికలతో మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగుతున్నది.
కన్నోజు శ్రీహర్ష