కరోనా మహమ్మారి విధ్వంసకర వ్యాప్తి, వాతావరణ మార్పులు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న జీవవైవిధ్యం వంటి విపరిణామాలు.. మానవుడికి ఒక రకమైన హెచ్చరిక వంటివి. ప్రకృతితో కోల్పోయిన అనుసంధానాన్ని తిరిగి నెలకొల్పుకోవటంపై ఆత్మపరిశీలన చేసుకోవాలని ఇవి గుర్తు చేస్తున్నాయి.
ప్రకృతిని సంరక్షించడం, పర్యావరణ వనరులను పునరుద్ధరించడం నాగరిక సమాజానికి అత్యావశ్యకం. ఈ నేపథ్యంలోనే, రాష్ట్రంలో పచ్చదనాన్ని 24 శాతం నుండి 33 శాతానికి పెంపొందించే లక్ష్యంతో 2015లో ‘తెలంగాణకు హరితహారం’ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలను భాగస్వాములను చేస్తూ దీనిని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్తున్నది.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రస్తుతమున్న పంచాయతీ, మునిసిపల్ చట్టాలకు చారిత్రక సవరణలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం తొలిసారిగా నిబంధనలను రూపొందించింది. చెట్లను నాటడం, వాటిని పరిరక్షించడం, గ్రీన్ ఫండ్ ఏర్పాటు, పంచాయతీలు, మునిసిపాలిటీలకు తగిన బాధ్యతలు కల్పించటంలో ఈ విధాన మార్పులు వీలు కల్పించాయి. చెట్లను నాటడంతోపాటు పర్యావరణ పరిరక్షణ అనే అత్యంత కీలకమైన అంశం అమలు కోసం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అనే కార్యక్రమాలను సమాంతరంగా అమలు చేస్తున్నది ప్రభుత్వం. గ్రామాల, పట్టణాల ఏకీకృత అభివృద్ధి అనేది ఇందులోని ప్రధానాంశం. ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఇంధన పరిరక్షణ, మౌలిక వసతులు, చెట్లను నాటడం, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవటం జరుగుతున్నది.
రాష్ట్రంలోని 12 వేలకు పైగా గ్రామపంచాయతీల్లో భూముల లభ్యతపై ఆధారపడి ప్రకృతివనాలు అభివృద్ధి చేస్తున్నారు. ఖాళీస్థలాలతోపాటు వ్యవసాయ భూములు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో, ఇండ్ల పరిసరాల్లో మొక్కలను నాటుతున్నారు. గ్రామాల్లో పచ్చదనం పెంపు విధానాన్ని మరింత పటిష్ఠపరుస్తూ రాష్ట్రంలోని అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం (బీపీపీవీ)ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. దాదాపు 10 ఎకరాల భూమిలో, యాదాద్రి నమూనాలో (మార్పు చేసిన మియావాకి విధానంలో) మొక్కలు నా టడం బీపీపీవీ ప్రధాన లక్ష్యం.
పట్టణాల్లో పచ్చదనం పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 109 ప్రదేశాలను గుర్తించింది ప్రభుత్వం. దీంట్లో భాగంగా 30,377 హెక్టార్లను పట్టణ పార్కుల కోసం కేటాయించి, అభివృద్ధి చేయనున్నారు. ఇప్పటికే 53 పట్టణ పార్కులను ప్రారంభించారు. మిగిలిన 56 పార్కుల అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి కార్యక్రమం కింద చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాలు, చర్యలు పచ్చదనాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా.. ఎక్కడికక్కడ పర్యావరణ పరిరక్షణకు పట్టణ మరియు గ్రామీణ సామాజిక వర్గాలకు స్థానికంగా అవకాశాలను కల్పిస్తున్నది. పల్లె, పట్టణ ప్రగతి వినూత్న, సమ్మిళిత విధానాలు గ్రామీణ, పట్టణాభివృద్ధికి సమతుల్యంగా నిలిచాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయం. పర్యావరణ పరిరక్షణలో సమాజంలోని వివిధ వర్గాలను ఈ విధంగా భాగస్వాములను చేయటం అనేది భవిష్యత్తులో గొప్ప మార్పులకు దారితీస్తుంది.
(వ్యాసకర్త: సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి, హైదరాబాద్, తెలంగాణ)
మోహన్ చంద్ర పర్గేయిన్