ఇరాన్, అమెరికా వైషమ్యాల నేపథ్యంలో భారత్ ప్రయోజనాలకు భంగం వాటిల్లడం విచారకరం. భారత్, ఇరాన్ మధ్య ఎంతోకాలంగా సౌహార్ద్ర సంబంధాలున్నాయి. కానీ ఇటీవలి కాలంలో అమెరికా ఒత్తిడి మూలంగా భారత్ అంటీముట్టనట్టు వ్యవహరించడం, ఆ తర్వాత ఇరాన్ కూడా ఇదే రీతిలో మన ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల తరతరాల బంధానికి విఘాతం కలుగుతున్నది. ఇరాన్లో నిర్మించతలపెట్టిన 620 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టు నుంచి మన దేశాన్ని తప్పించింది. పర్షియా జలసంధిలోని ఫర్సాద్-బి సహజవాయు క్షేత్ర కాంట్రాక్టు నుంచి కూడా భారత్ను పక్కనపెట్టింది. పర్షియా జలసంధిలో విస్తారంగా ఉన్న రెండుకోట్ల 30 లక్షల ఘనపుటడుగుల సహజవాయు నిక్షేపాలను మొదట గుర్తించింది భారత్కు చెందిన ఓఎన్జీసీ. ఇందులో 60 శాతం ముడిచమురును వెలికితీయవచ్చని తెలిపి, దానికోసం ఓఎన్జీసీ భారీవ్యయం చేసింది. దాని లో 40 శాతం వాటాతో 1,100 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సంసిద్ధతను వ్యక్తంచేసింది. అందుకు సంబంధించిన చర్చలు ఒక కొలిక్కి వస్తున్న తరుణంలో ఇరాన్పై అమెరికా ఆంక్షలు విధించింది.
దశాబ్దాలుగా భారత్కు అవసరమైన ముడిచమురును ఇరాన్ అందిస్తుంటే, చమురు సహజవాయువు పరిశ్రమలో భారత్ పెట్టుబడులే సింహభాగంగా ఉండేవి. కశ్మీర్ విషయంలో పాకిస్థాన్ తిరకాసు పెట్టినప్పుడల్లా ఇరాన్ మనకు అండగా నిలిచింది. బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత ఐరాసలో భారత్కు అండగా నిలిచింది ఒక్క ఇరాన్ మాత్రమే. అమెరికా ప్రోద్బలంతో ఇస్లామిక్ దేశాలు ఐరాస అంతర్జాతీయ మానవహక్కుల సంఘంలో హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశ పెట్టినప్పుడు దాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పి మిత్రదేశంగా మెప్పు పొందింది. పశ్చిమాసియాకు ముఖ ద్వారమైన ఇరాన్ వ్యాపార, వ్యూహాత్మక సంబంధాల్లో కీలకభూమిక పోషిస్తున్నది.
అమెరికా తనదైన ధోరణితో ఇరాన్ను ఒంటరి చేసి ఆర్థికంగా దెబ్బతీసేందుకు పావులు కదపడంతో భారత్కు సమస్య వచ్చిపడింది. సౌదీ అరేబియా, అమెరికా నుంచి చమురు దిగుమతి చేసుకునేవిధంగా భారత్ను కట్టడి చేసింది. ఈ మధ్య కాలంలో భద్రతామండలిలో అంతర్జాతీయ అణ్వాయుధ ఒప్పందం విషయంలో ఇరాన్కు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. అలాగే అమెరికా కనుసన్నల్లో మెలిగే సౌదీ అరేబియా, యూఏఈ, ఇజ్రాయెల్ సరసన భారత్ చేరటంతో ఇరాన్తో సంబంధాల్లో నీలినీడలు అలుముకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్నప్పుడు యూరప్ దేశాలతో కూడా శత్రు వైఖరితో వ్యవహరించారు. ఇరాన్తో ఒప్పందాన్ని కాలరాశారు. భారత్ వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చి ఇబ్బందుల్లోకి నెట్టారు. ఇప్పుడు బైడెన్ అధ్యక్షుడిగా కొంత సామరస్య వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఈ వెసులుబాటును ఉపయోగించుకొని పాత సంబంధాలను పునరుద్ధరింకోవడం శ్రేయస్కరం.