‘పుండుకు సమురు లేదు గానీ.. ఎడ్ల కొట్టంల దీపం పెట్టుమన్నడట’ ఈ సామెత ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వ తీరుకు సరిగ్గా సరిపోతుంది. ఓవైపు దేశంలో ఎక్కడ చూసినా టీకా కొరత వేధిస్తున్నది. మరోవైపు 45 ఏండ్లకు పైబడినవారికి ఇంకా వ్యాక్సినేషన్ పూర్తికాలేదు. టీకాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియదు. ఇవేమీ పట్టించుకోకుండా మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లకు పైబడిన వారందరికీ టీకాలు వేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసింది.
కావాల్సినన్ని డోసులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చుకోవాలంటూ కాడి వదిలేసింది. సెకండ్ డోస్కు వ్యాక్సిన్లు ఇవ్వండి మహాప్రభో అని రాష్ర్టాలు ఓవైపు మొత్తుకుంటుంటే.. పుండుమీద కారం చల్లినట్టు కేంద్రం వ్యవహరిస్తున్నది. దేశ ప్రజలకు సరిపడా వ్యాక్సిన్లను సిద్ధం చేయలేని తన చేతగానితనాన్ని రాష్ర్టాల మీద రుద్దాలని ప్రయత్నిస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచీ ‘గెలిస్తే నా లెక్కలోకి.. ఓడితే నీ ఖాతాలోకి’ అన్నట్టుగానే రాష్ర్టాలతో వ్యవహరిస్తున్నది. మొదటివేవ్ సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి కరోనాను సమర్థంగా నియంత్రించింది. అయితే కేంద్రం ఆ విజయాన్ని అంతర్జాతీయంగా తన ఖాతాలో వేసుకొన్నది. సెకండ్వేవ్ వస్తుందన్న నిపుణుల అంచనాలను పెడచెవిన పెట్టింది.
రాష్ర్టాలకు ముందస్తు హెచ్చరికలు, ఏర్పాట్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో కరోనా భీకరంగా విరుచుకుపడింది. కట్టడి సాధ్యం కాదని తెలియడంతో ‘అసమర్థ’ ముద్ర తప్పించుకోవడానికి లాక్డౌన్, వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ర్టాల మీదికి వదిలేసింది. ఒకవేళ కరో నా కట్టడి కాకుంటే రాష్ర్టాలను దోషులుగా చూపెట్టవచ్చన్నది కేంద్రం ఉద్దేశం.
వాస్తవానికి దేశ ప్రజలకు వ్యాక్సిన్ అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. అమెరికా, బ్రిటన్ సహా అన్ని దేశాల్లో జరుగుతున్నది అదే. దేశ జనాభాకు అనుగుణంగా ఎన్ని వ్యాక్సిన్లు కావాలో ముందే లెక్కించుకొని తయారీ కంపెనీలకు ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. గతేడాది అమెరికాలో కరోనా మరణ మృదం గం మోగించింది. దీంతో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ నుంచే వ్యాక్సిన్లపై శ్రద్ధ పెట్టారు. డిసెంబర్లో ఏకంగా 14 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు. ఫైజర్ కంపెనీకి 2 బిలియన్ డాలర్లు, మోడర్నా కంపెనీకి 4.1 బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చేశారు. సుమారు 30 కోట్ల డోసులకు ఆర్డర్ చేశారు. అంటే దేశ ప్రజల్లో సుమారు 85 శాతం మందికి సరిపోతాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగానే ప్రజలందరికీ టీకాలు వేశారు. దీంతో ఇప్పుడు అమెరికాలో ప్రజలు మాస్క్ లేకుండానే తిరుగుతున్నారు. అమెరికాలో సమాఖ్య వ్యవస్థ ఉన్నా.. ఫెడరల్ ప్రభుత్వమే టీకాల బాధ్యత తీసుకున్నది తప్ప రాష్ర్టాల మీద వదిలేయలేదు. అన్ని దేశాల్లోనూ అంతే.
మన దేశంలో నాలుగు నెలల కిందట టీకాల పంపిణీ మొదలైంది. అప్పటికి కొవాగ్జిన్, కొవిషీల్డ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దేశ అవసరాలకు తగినట్టుగా టీకాలను అందించాల్సిందిగా ఆ సంస్థలతో కేంద్రం ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. పోనీ రాష్ర్టాలకు ఒప్పందాలు చేసుకునే స్వేచ్ఛ ఇవ్వలేదు. సోమవారం నాటికి అన్ని రాష్ర్టాలకు కలిపి 21.80 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 19.6 కోట్ల డోసులను వినియోగించినట్టు చెప్పింది. ఇందులో మొదటి డోస్ వేసుకొన్నవారు 15.29 కోట్ల మంది కాగా, రెండో డోస్ వేసుకున్నవారు 4.31 కోట్ల మంది మాత్రమే. అంటే 135 కో ట్ల జనాభాలో వ్యాక్సిన్లతో రక్షణ పొందుతున్నవారు కేవలం 3.19 శాతం మంది మాత్రమే.
ప్రస్తుతం దేశంలో కొవాగ్జిన్ నిల్వలు నిండుకున్నాయి. తెలంగాణ సహా అనేక రాష్ర్టాల్లో రెండో డోస్ ఇవ్వలేని పరిస్థితి. కొవిషీల్డ్ కూడా డిమాండ్కు తగినట్టుగా సరఫరా లేదు. దీంతో ఏప్రిల్లో వారానికి 2.5 కోట్ల డోసులు వేసే దశ నుంచి ఇప్పుడు వారానికి 5-7 లక్షల డోసులు మాత్రమే వేయగలిగే దుస్థితికి చేరుకొన్నాం. ముందే కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వకపోవడంతో ఆ రెండు కంపెనీలు ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకొన్నాయి. దీంతో మనకు అదనంగా ఇవ్వాలంటే ఉత్పత్తి పెంచడం తప్ప మరో మార్గం లేదు. ఇందుకు కనీసం మరో రెండుమూడు నెలల సమయం పడుతుంది. అదేసమయంలో ఫైజర్, మోడర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి విదేశీ సంస్థలు సైతం ఇతర దేశాలతో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నాయి. ఆ బాధ్యతను నిర్వర్తించడంలోనే కంపెనీలు తలమునకలై ఉన్నాయి. మరోవైపు సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను హరిస్తున్నది. టీకాలు, కరోనాను ఎదుర్కొనే విషయంలో ముందస్తు ప్రణాళిక లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వెల్లువ పెరిగింది.
‘అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా రాష్ర్టాల పరిస్థితి తయారైంది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు స్వయంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది. ఈ ముక్కేదో ఏడాది క్రితమే చెప్పి ఉంటే.. అప్పుడే వచ్చిన స్పుత్నిక్ వీ టీకాను రాష్ర్టాలు కొనుగోలు చేసి ఉండేవి కదా. ఫైజర్ కూడా ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది. కేంద్రమే అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వకుండా ఆపింది. ఇప్పుడేమో రాష్ర్టాలపై బాధ్యతను తోసేసి ‘7లోక్ కల్యాణ్ మార్గ్’లో ఫిడేలు వాయించుకొంటున్నది. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే.. వ్యాక్సిన్ల కొరతకు రాష్ర్టాలు నిందలను భరించాల్సి వస్తున్నది. వ్యాక్సిన్ల కంపెనీలైతే నేరుగా దేశ ప్రభుత్వాలతోనే ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలను పరిగణనలోకి తీసుకోవటంలేదు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాజస్థాన్, ఢిల్లీ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు మోడర్నా, ఫైజర్ కంపెనీలను సంప్రదించాయి. దీనికి ‘మేం కేవలం కేంద్రంతోనే చర్చలు జరుపుతాం’ అని ఆయా సంస్థలు మొఖంమీదే కుండబద్దలు కొట్టాయి. కొన్ని రాష్ర్టాలకైతే కనీసం బదులు కూడా ఇవ్వడం లేదు. ఫలితంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా రాష్ర్టాల్లో ఆగిపోయింది. ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం వెలగబెడుతున్న సమాఖ్యస్ఫూర్తి ఇది.
వ్యాక్సిన్లకు అత్యధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు ఉంటే తప్ప ఒప్పందాలు సాధ్యం కాదు. అది కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే సాధ్యమవుతుంది. మన దేశంలో ఉత్పత్తి అయిన కొవాగ్జిన్ను ప్రధాని స్వయంగా పలు దేశాలకు పంపించారు. అయితే దీని వెనుక వ్యాపార, దౌత్యపరమైన అంశాలు కూడా ఉండి ఉండవచ్చు. వాటిని బయటికి వెల్లడించరు. అదే తరహాలో మనం ఫైజర్, మోడర్నా వంటి టీకాల కోసం ప్రయత్నించినప్పుడు ఆయా దేశాలు కొన్ని షరతులు విధించే అవకాశం ఉంటుంది. వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చలేవు.
రాష్ర్టాలు గ్లోబల్ టెండర్లను పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర తీసుకొని ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా మాట్లాడి ఒప్పందాలు కుదర్చాలి. కానీ కేంద్రం అలాంటి దౌత్య చతురతను అలవరుచుకోవడం లేదు. మరో ముఖ్యమైన విషయం.. వ్యాపార చతుర త. ఎక్కువ సంఖ్యలో టీకాలు కొనుగోలు చేస్తామని చెప్తేనే కంపెనీలు ఆసక్తి చూపుతాయి. మనకు కూడా బేరమాడే పరిస్థితి ఉంటుంది.
ఒక రాష్ట్రం మహా అయితే 2-3 కోట్ల డోసులకు ఆర్డర్ ఇవ్వగలుగుతుంది. అదే కేంద్రం అయితే ఒకేసారి 20-30 కోట్ల డోసులు కావాలని అడుగొచ్చు. అప్పుడు బేరసారాలకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో వేస్తున్న పోలియో, హెపటైటిస్-బీ వంటి వ్యాక్సిన్లన్నీ బేరమాడి కొనుగోలు చేసేవే. ఉదాహరణకు హెపటైటిస్-బీకి అంతర్జాతీయంగా రూ.750 ధర ఉంటే.. కేంద్రం రూ.100కు బేరమాడి కొనుగోలు చేసింది. ఇలాంటి సందర్భాలు అనేకం.
దేశంలో ఉత్పత్తి అయిన టీకాల్లో కేంద్రానికి సగం, రాష్ర్టాలకు సగం అనే ప్రచారం ఉన్నది. కానీ అది తప్పు. కేంద్రం సగం తీసుకొని, మిగ తా సగంలో రాష్ర్టాలకు, ప్రైవేట్ కు అప్పగిస్తున్నది. అంటే రాష్ర్టా ల వాటా కేవలం 25 శాతం. ఎగుమతులు లెక్కవేసుకుంటే అంతకన్నా తక్కువే అందుతున్నాయి. కేంద్రం సేకరిస్తున్న టీకాల్లో జనాభా ప్రతిపాదికన రాష్ర్టాలకు పంచుతున్నదా? అంటే అదీ లేదు. ఇష్టానుసారం వ్యాక్సిన్లు ఇస్తున్నది. ఉదాహరణకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు ఒక్కో రాష్ర్టానికి ఇప్పటివరకు సగటున 1.70 కోట్ల డోసులను సరఫరా చేసింది. మహారాష్ట్రకు 2.10 కోట్ల డోసులు ఇచ్చింది. కర్ణాటక, పశ్చిమ బెంగాల్కు సైతం 1.30 కోట్ల డోసులు అందజేసింది. అదే సమయంలో తెలంగాణకు పంపిన డోసులు 63 లక్షలే. బీహార్కు సైతం కోటికిపైగా డోసులు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 7 లక్షల డోసులు ఉన్నా, కొవాగ్జిన్ లేకపోవడంతో వ్యాక్సినేషన్ నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కేంద్రం మొదటి నుంచీ ఇదే పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నది. ఒక రాష్ట్రంలో ప్రజలందరికీ టీకాలు వేసినా, చుట్టుపక్కల రాష్ర్టాల్లో కేసులు పెరిగితే ఆరోగ్య సమాజం నిర్మాణం కాదనే విషయం కేంద్రం గుర్తుపెట్టుకోవాలి.
దేశంలో కనీసం 70 శాతం మందికి టీకాలు వేస్తేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని నిపుణులు చెప్తున్నారు. ఈ లెక్కన 135 కోట్ల మంది జనాభాలో కనీసం 95 కోట్ల మందికి టీకాలు వేయాలి. ఇందుకు కనీసం 190 కోట్ల డోసులు కావాలి. నాలుగు నెలల్లో 19.68 కోట్ల డోసుల టీకాలు వేశారు. అంటే నెలకు సగటున 5 కోట్ల టీకాలు వేస్తున్నారు. ఈ లెక్కన మిగతా 170 కోట్ల డోసులు వేయాలంటే కనీసం 34 నెలలు (రెండేండ్ల ఎనిమిది నెలలు) పడుతుంది. అప్పటివరకు ఎన్ని వేవ్లు వస్తాయో తెలియదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని, అంతర్జాతీయంగా వీలైనన్ని ఎక్కువ కంపెనీలతో చర్చలు జరిపి టీకాలు సేకరించాలి. దేశీయంగా ఉత్పత్తి పెంచాలి. తక్కువ ధరకు వ్యా క్సిన్లు సేకరించి.. ఉచితంగా ప్రజలందరికీ అం దించాలి. సరఫరా వ్యవస్థను పూర్తిగా తన చేతిలోకి తీసుకొని, ఎలాంటి వివక్ష చూపకుండా జనాభా, రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి టీకాలను కేటాయించాలి. ఇది కేంద్రం చిత్తశుద్ధిమీద ఆధారపడి ఉన్నది. కానీ కేంద్రానికి ప్రజల ప్రాణాలను కాపాడటం రాజ్యాంగ విధి అన్న స్పృహ ఉన్నట్టు కనిపించటం లేదు. అప్పటిదాకా అనేక ప్రశ్నలు జవాబుకోసం ఎదురుచూస్తూనే ఉంటాయి.
మనదేశంలో వ్యాక్సిన్లు అందరికీ
ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి?
కరోనా ఎప్పుడు సద్దుమణుగుతుంది?
‘అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు’ అన్న చందంగా రాష్ర్టాల పరిస్థితి తయారైంది. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలు స్వయంగా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని సూచించింది. ఈ ముక్కేదో ఏడాది క్రితమే చెప్పి ఉంటే.. అప్పుడే వచ్చిన స్పుత్నిక్ వీ టీకాను రాష్ర్టాలు కొనుగోలు చేసి ఉండేవి కదా.
కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని, అంతర్జాతీయంగా వీలైనన్ని ఎక్కువ కంపెనీలతో చర్చలు జరిపి టీకాలు సేకరించాలి. దేశీయంగా ఉత్పత్తి పెంచాలి. తక్కువ ధరకు వ్యాక్సిన్లు సేకరించి.. ఉచితంగా ప్రజలందరికీ అందించాలి.
డా॥ బండారి నరేందర్ రావు
98668 34717