రాష్ట్ర అవతరణ తర్వాత అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ఒక్కొక్క రంగానికి రాష్ట్ర ప్రభుత్వం జవజీవాలను ఆదరిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయరంగాన్నీ పండుగలా చేసింది. వృత్తికులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక వినూత్న పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో వెలుగులు నింపారు. తాజాగా చేనేత, వస్త్ర పరిశ్రమకు చిరునామాగా పేరుగాంచిన సిరిసిల్ల పర్యటనలో నేతకారుల సంక్షేమానికి వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నట్టు ప్రక టించారు. దీంట్లోభాగంగా వస్త్ర తయారీలో అత్యవసరమైన నూలు, రంగులు, రసాయనాలు తదితరాలను యాభై శాతం రాయితీతో అందించనున్నారు. చేనేత అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మూలనిధి (కార్పస్ ఫండ్)ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రైతుల మాదిరిగానే చేనేత కార్మికులకు కూడా బీమా పథకం ప్రవేశపెడతామనడం విశేషం. దీనివల్ల నేతకారులు అకాల మృత్యువు పాలైతే రైతుబీమా మాదిరిగానే వారి కుటుంబానికి ఆర్థికసాయం అందుతుంది.
వ్యవసాయం తర్వాత అత్యధిక జీవనోపాధిని ఇస్తున్నది చేనేత రంగం. దేశవ్యాప్తంగా 23లక్షలకు పైగా మరమగ్గాలున్నాయి. 43లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ప్రపంచంలో చేనేత వస్త్ర ఎగుమతుల్లో 95శాతం మన దేశం నుంచే ఉంటున్నాయి. తెలంగాణలోనూ చేనేతరంగం పెద్ద జీవనోపాధి వనరుగా ఉన్నది. మూడు లక్షలకు పైగా చేనేత మగ్గాలు కాగా మరమగ్గాలు 60వేలకు పైనే ఉంటా యి. మరమగ్గాల్లో అత్యధికం సిరిసిల్లలో ఉన్నాయి. రాష్ట్రంలో పదిలక్షలకు పైగా కుటుంబాలు ఈ రంగం ద్వారా జీవనోపాధి పొందుతున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఆధునిక యంత్రాలు, విదేశీ బహుళజాతి కంపెనీల బట్ట లు నేత మగ్గాలను కుదేలు చేశాయి. జీవనోపాధి కోల్పోయి అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత బతుకమ్మ చీరల వంటి పథకాల ద్వారా పరిస్థితి మెరుగుపడింది.
మానవ నాగరికత వికాసానికి వన్నెతెచ్చిన చేనేతరంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకుపోతున్నది. నేతన్నలకు పని కల్పించటం కోసం చేనేత వస్ర్తాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నది. వారంలో ఒకరోజు చేనేత బట్టలు ధరించాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వ సంస్థల్లో చేనేత ఉత్పత్తులను ఉపయోగించేలా చూస్తున్నది. ఇప్పటికే త్రిఫ్ట్ పథకం ప్రవేశపెట్టి మరమగ్గాల అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరుస్తున్నది. సిరిసిల్ల సమీపంలో చేనేత వృత్తుల అనుబంధ పరిశ్రమల కోసం అప్పారెల్ పార్క్ను 40 ఎకరాల్లో ఏర్పాటు చేసింది. 297కోట్లతో గ్రూప్షెడ్ వర్క్ పథకాన్ని ప్రారంభించింది. చేనేత మగ్గాల అభివృద్ధికి చర్యలు చేపడుతూనే మొత్తంగా నేతవృత్తిని ఆధునికీకరించటం అనే ద్విముఖ వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకుపోవటం హర్షణీయం.