తెలంగాణలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. జిల్లా కేంద్రాల్లో సుపరిపాలన, శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల సంక్షేమం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల హంగులతో పాలనా భవనాలు ప్రారంభ మవుతున్నాయి. సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్, పోలీస్ కమిషనరేట్, ఎస్పీ కార్యాలయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. వీటితో బహుళ ప్రయోజనాలున్నాయి. గతంలో జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, రెవెన్యూ, డీటీవో, డీఈవో తదితర జిల్లాస్థాయి కార్యాలయాలు మూలకొకటిగా విసిరేసినట్లుగా ఉండేవి. ఏదైనా భూమికి సంబంధించిన చిన్న వివరణ, సవరణ జరుగాలంటే కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఒక ఆఫీసునుంచి మరో దానికి చేరటానికే ఆ రోజు గడిచిపోయేది. దీంతో కాలహరణంతోపాటు ప్రజలు నానా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు సమీకృత కలెక్టరేట్లోనే జిల్లా స్థాయి కార్యాలయాలన్నీ అందుబాటులో ఉండటం విశేషం.
రాష్ట్ర అవతరణ తర్వాత ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతున్నది. జిల్లా కేంద్రాలను కూడా ఐటీ కేంద్రాలుగా రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి చేసింది. ప్రజల ముంగిటనే పాలన అందించేందుకు 33 జిల్లాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి సకల సౌకర్యాలతో పాలనాయంత్రాంగం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ తర్వాత మరో చారిత్రక నగరంగా ఉన్న వరంగల్ను జాతీయ స్థాయిలో మెడికల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను 59 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. అలాగే జిల్లాకో మెడికల్ కళాశాల స్థాపనకోసం నిబద్ధతతో కృషిచేస్తున్నారు. వీటి ద్వారా మారుమూల గ్రామీణ ప్రజలకు కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చి ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం కాబోతున్నది.
ఏడేండ్ల కాలంలో తెలంగాణ భిన్న రంగాల్లో అభివృద్ధి సాధించింది. మౌలిక వనరుల కల్పనకు విశేష ప్రాధాన్యమివ్వటంతో తెలంగాణ స్వరూపమే మారిపోయింది. దశాబ్దాలుగా కరువుపీడిత ప్రాంతంగా ఉన్న ఈ నేల ఇప్పుడు జలసిరులతో అలరారుతున్నది. నిండు వేసవిలోనూ చెరువులు అలుగులు దుంకుతున్నవి. మూడుకోట్ల టన్నుల వరిధాన్యాన్ని ఉత్పత్తి చేయడంతో పంజాబ్ను దాటేసి నెంబర్వన్గా ఎదిగింది. విద్యుత్ వినియోగంలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ధరణి పోర్టల్ రూపకల్పనతో భూ భద్రత ఏర్పడింది. తాగునీటి సమస్యను తీర్చే మిషన్ భగీరథను పదకొండు రాష్ర్టాలు వచ్చి అధ్యయనం చేశాయంటే దేశానికే ఆదర్శంగా మన రాష్ట్రం ఉన్నదన్నది తేటతెల్లం. ఇదంతా స్వయం పాలనలో సాధించిన అద్భుత ప్రగతికి, పనితీరుకు నిదర్శనం.