‘పాన్ డబ్బా, మేవా కారోబార్, ఆటోడ్రైవర్.. అరే కబ్ తక్ ఆప్ నే బచ్చోంకో ఇసీ కామోంపే దేఖీంగే..? చలో కేసీఆర్కే స్కూల్ మే జాయిన్ కరో.. బచ్చా కుచ్ కామ్యాబ్ హోకే నిక్లేగా..’ ఇది ఓ తండ్రికి తెలంగాణ మైనారిటీ గురుకులాల మీదున్న నమ్మకం. అమ్మాయిలను బయటికి పంపడానికి ఇష్టపడని ముస్లిం సమాజంలో ఇప్పుడు గురుకులాలకు తమ బిడ్డలను పంపుతున్నారు. అక్కడ ఇంటిని మించిన భద్రత ఉన్నది. కార్పొరేట్ కాన్వెంట్లను మించిన చదువు ఉన్నదనేది ఓ తల్లి భరోసా!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింల చదువుకు అధిక ప్రాధాన్యం ఇస్తూ కేజీ టు పీజీ మిషన్లో భాగంగా 2015లో మొదటగా 71 మైనారిటీ గురుకులాలను ప్రారంభించారు. ఇప్పుడు వీటి సంఖ్య 204కు చేరుకున్నది. గత ప్రభుత్వాలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశాయి. కానీ కేసీఆర్ వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించారు. తెలంగాణ ముస్లింలలో స్కూల్ డ్రాపౌట్స్ సంఖ్య, బడి మానేస్తున్న ఎస్సీ, ఎస్టీల కంటే రెట్టింపుగా ఉన్నది. ఈ పరిస్థితుల్లోనే గురుకులాల ఏర్పాటు జరిగింది. ఒక్క సారి ఈ గురుకులాల్లో ఆడ్మిషన్ పొందితే చాలు తల్లిదండ్రులు నిశ్చింతగా ఉండొచ్చు. పళ్లుతోమే బ్రష్ దగ్గరి నుంచి పడుకునే బెడ్ వరకు, నోటు పుస్తకాలు మొదలు పౌష్టికాహారం వరకు అన్నీ ఉచితమే. క్వాలిఫైడ్ టీచర్లు, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్ చేసే స్టాఫ్ నర్సులు, ఆటల్లో ప్రోత్సహించే పీఈటీలు, అత్యాధునిక డిజిటల్ ల్యాబ్లు, ఎన్నో పుస్తకాలకు నెలవైన లైబ్రరీలు, విశాలమైన క్యాంపస్లు, అంతే విశాలమైన డార్మెటరీలు ఈ గురుకులాల్లో ఉన్నాయి. ఒక్కో విద్యార్థిపై ఏడాదికి లక్షకు పైగానే కర్చు పెడుతున్నది తెలంగాణ ప్రభుత్వం. ఏటా దాదాపు లక్షకు పైగా విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి ఈ మైనారిటీ గురుకులాలు.
ఈ గురుకులాల్లో విద్యతో పాటు కో కరికులమ్ యాక్టివిటీస్పై ప్రత్యేక దృష్టిపెట్టారు. స్టేట్ లెవల్ సొసైటీ గేమ్స్తో పాటు ఇంటర్ సొసైటీ కాంపిటేషన్స్ను పెట్టి విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రతి స్కూల్కు ఓ ఆర్ట్ టీచర్ను కేటాయించి విద్యార్థులకు చిత్రలేఖనం లాంటి కళలను నేర్పుతున్నారు. ఆటల్లో ప్రతిభ కనబరిచినవారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. షూటింగ్, రెగెట్టా లాంటి వాటిలో టెమ్రీస్ విద్యార్థులు జాతీయస్థాయిలో ప్రతిభ చూపారు. ఆరుగురు టెమ్రీస్ విద్యార్థులు నాసాకు కూడా వెళ్లివచ్చారు. నలుగురు విద్యార్థులు టాంజానియాలోని కిలీమాంజారో పర్వతాన్ని అధిరోహించారు.
ఈ కాలంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. దీన్ని దృష్టిలో ఉంచుకొని ‘కరాడీ పాత్’ అనే కొత్త కాన్సెప్ట్ను ప్రవేశపెట్టారు. ఐదవ తరగతి నుంచే గేయాలు స్టోరీల సాయంతో ఇంగ్లీష్ను నేర్చుకునే పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇంగ్లీష్ అంటే భయపడే పిల్లలు గడగడా మాట్లాడుతున్నారు. డీఎంఎల్టీ, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ (సీటీ) లాంటి ఒకేషనల్ కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. ఈ గురుకులాల కారణంగా ముస్లింల అక్షరాస్యతా శాతం పెరిగి, ఆడపిల్లల డ్రాపౌట్స్ చాలావరకు తగ్గిపోయాయి.
ఇజ్రాయెల్, అమెరికా దేశాల ప్రతినిధులు తెలంగాణ మైనారిటీ గురుకులాలను సందర్శించి ఆశ్చర్యానికి లోనయ్యారు. మైనారిటీల అభివృద్ధికి కీలకమైన విద్యను ఉచితంగా అందించడానికి ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను కొనియాడారు. కేరళ నుంచి వచ్చిన బృందమైతే ఈ విద్యా విధానానికి ఫిదా అయిపోయారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి గురుకులాలను ప్రారంభించాలనుకుంటున్నారు. అనేక దేశాల్లో, ముస్లింలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ తరహా మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
అజహారుద్దీన్
98497 07083