భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిఉన్న చక్రవర్తి భోజుడు. కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేసిన చక్రవర్తిగా భోజుడిని చెప్పుకొంటాం. సమకాలీన దక్షిణ భారతంలో భోజుడితో పోల్చగలిగే స్థాయి ఉన్నవారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు. భోజుడిలా చంద్రశేఖర రావు కూడా సాహిత్య సాంస్కృతిక అంశాలకు అమితమైన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఇరువురూ అధ్యయన శీలురే. ఇద్దరూ కవులను, రచయితలను సమాదరించినవారే. కళారంగాన్ని పోషించినవారే. ఈ ఇరువురూ నీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసి, ప్రజల దాహార్తిని తీర్చినవారే కావడం మరో విశేషం.
భోజుడిలా కేసీఆర్కు కూడా సాహిత్యాది అంశాల్లో చక్కని అభినివేశం ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంం లక్షలాది ప్రజలను సమ్మోహితులను చేయడానికి ప్రధాన కారణం అదే. ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం రాసిన ‘గారడి చేస్తుండ్రు… గడిబిడి చేస్తుండ్రు..’ పాట సృజనాత్మక రచనారంగంలో ఆయనకున్న శక్తికి మచ్చుతునక.
కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లే అయినప్పటికీ తెలంగాణ భాషా సాహిత్య సాంస్కృతిక చరిత్రలో కీలకమైన అనేక మలుపులు ఈ కాలంలోనే జరిగాయి. భాషా సాహిత్య సాంస్కృతిక చరిత్రలో ఈ ఏడేండ్ల కాలం సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణ ఈ స్వల్ప కాలంలో వివిధ క్షేత్రాల్లో స్వీయ ముద్రను వేసింది. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లోనూ బలమైన పునాదులు నిర్మించింది.
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ, తెలంగాణ సాహిత్య అకాడమీ పునరుద్ధరణ, తెలంగాణ సంగీత నాటక అకాడమీ పునరుద్ధరణ, వివిధ సంస్థల్లో తెలంగాణ ప్రత్యేక ముద్ర వేసేందుకు చర్యలు మొదలైన వాటి ద్వారా సాహిత్య, సాంస్కృతిక చైతన్యం పరిఢవిల్లేందుకు కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం, వివిధ సంస్థలు నిరంతరం కృషి చేస్తున్నాయి. తెలంగాణ సాహిత్య ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలిపేందుకు ‘కావ్య పరిమళం’, ‘నవలా వికాసం’ అనే పేర్లతో ప్రముఖుల ప్రసంగాల పరంపర కొనసాగింది. కొత్తగా ఏర్పడ్డ 33 జిల్లాల సాహిత్య చరిత్రను రాయించేందుకు శ్రీకారం చుట్టి, పలు జిల్లాల సాహిత్య చరిత్రలను ప్రచురించటం ముదావహం.
ఈ క్రమంలోనే తెలంగాణ సాహిత్య తేజో మూర్తుల జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. ప్రసిద్ధ సాహితీవేత్త కాళోజీ నారాయణరావు జయంతి రోజైన సెప్టెంబరు తొమ్మిదో తేదీన తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకోవటం సముచితం.‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని సగర్వంగా ప్రకటించిన దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను ఏటా జూలై 22వ తేదీన ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఆ సందర్భంగా ఆయన పేరిట పురస్కారాలను అందజేస్తున్నది. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా సందర్భానుసారంగా సాహితీవేత్తలకు విశేష గౌరవాన్ని కల్పిస్తున్నది. సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన కవులకు, రచయితలకు ఏటా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండవ తేదీన రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పురస్కారాలను అందజేయటం హర్షణీయం.
భాష విషయంలోనూ తెలంగాణ అవతరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. తెలుగు భాషను అన్ని విద్యాసంస్థలు అన్ని స్థాయుల్లో తప్పనిసరిగా బోధించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం వయస్సు ఏడేండ్లే అయినా భాషా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటూ, తిరుగులేని వేగంతో మునుముందుకు దూసుకుపోతున్నది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో తెలంగాణను ఉన్నత స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రశేఖర రావు ద్రవిడ భోజుడు అనటంలో అతిశయోక్తిలేదు, కాదు.