పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణతో పశ్చిమాసియాలో ఎట్టకేలకు శాంతి నెలకొన్నది. పదకొండు రోజుల విధ్వంసకర రక్తసిక్త యుద్ధానికి తెరపడింది. ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ శాంతి ఒప్పందాన్ని ఇరుపక్షాలూ గౌరవించి శాశ్వత శాంతికి పునాది వేయాలి. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడంతో మళ్లీ ఉద్రిక్తతలకు బీజం పడింది. ఇటీవల రంజాన్ సందర్భంగా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనియులను ఖాళీ చేయించడం మొదలుపెట్టింది. అల్ ఆక్సా మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సందర్భంలో ఇజ్రాయెల్ దళాలు దాడులు సాగించాయి. దీంతో పాలస్తీనియులు ధర్నా ప్రారంభించారు. తూర్పు జెరూసలేంలోని పాలస్తీనియులకు మద్దతుగా గజాలోని హమాస్ దాడులు ప్రారంభించింది. చివరికిది యు ద్ధంగా మారింది. 2014 తర్వాత కుదిరిన ఈ ఒప్పందం ఫలప్రదం కావాలంటే అంతర్జాతీయ సమాజ సహకారం కూడా అవసరం.
గత ఏప్రిల్ మధ్యభాగంలో పవిత్ర రంజాన్ నెల ప్రారంభ కాలం లో మొదలైన అల్లర్లు ఉద్రిక్తతలకు కారణమైంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇజ్రాయెల్లోని అరబ్బులు రోడ్ల మీదికొచ్చి నిరసనలు తెలిపారు. ఇజ్రాయెల్ పోలీసు, మిలిటరీ దళాలతో తలపడ్డారు. మరోవైపు వెస్ట్బ్యాంక్లో నిరసన ప్రదర్శనలు భగ్గుమన్నాయి. గజాపై ఇజ్రాయెల్ దాడులలో వందల మంది పాలస్తీనియన్లు మృతిచెందారు. ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య తాజా ఉద్రిక్తతలు నెలకొనే కంటే ముందే అమెరికా బైడెన్ ప్రభుత్వం 73.5 కోట్ల డాలర్ల ఆయుధాలను ఇజ్రాయెల్కు అమ్మింది. ప్రస్తుత యుద్ధంలో ఆ ఆయుధాలనే పెద్ద ఎత్తున వినియోగించినట్లు తెలుస్తున్నది. అమెరికా లాంటి అగ్రరాజ్యం ఏదో ఒక దేశం కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే పరిస్థితి ఇంత దిగజారేది కాదు. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇరుదేశాలు కాల్పుల విరమణ పాటించాలనే తీర్మానాన్ని కూడా అమెరికా నాలుగుసార్లు అడ్డుకున్నది.
పాలస్తీనాతో భారత్ బాంధవ్యానికి దశాబ్దాల చరిత్ర ఉంది. పాలస్తీనా జాతివిముక్తి పోరాటయోధుడిగా యాసర్ అరాఫత్కు మనదేశం అనేక సందర్భాల్లో నైతిక మద్దతు తెలిపింది. నెహ్రూ కాలం నుంచీ అరాఫత్ సమున్నతమైన భారత అతిథిగా గౌరవం పొందారు. కానీ ఇటీవలికాలంలో ప్రత్యేకించి మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ పరిస్థితి మారిపోయింది. ఇజ్రాయెల్ నేత నెతన్యాహూతో నరేంద్ర మోదీ ఆది నుంచీ సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషిచేయాలని భద్రతామండలిలో భారత్ ప్రకటన చేసినప్పటికీ, ఇజ్రాయెల్పై హమాస్ దాడులను ఉగ్రవాద దాడులుగా ప్రకటించి ఖండించింది. 1967 నాటి సరిహద్దులను గౌరవించి ఇరుదేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు అంతర్జాతీయ సమాజం కృషిచేయటమే శాశ్వత శాంతికి మార్గం.