కొవిడ్ కారణంగా ఏడాదిన్నర కాలంగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఉద్యోగులు సైతం ‘వర్క్ ఫ్రం హోమ్’ పేరుతో ఇంటి వద్ద ఉంటూనే ఆఫీసు పనిచేస్తున్నారు. పాఠశాలలన్నీ మూతపడటంతో చిన్నపిల్లలు, విద్యార్థులు ఇంట్లో ఉండక తప్పని పరిస్థితి. దీంతో విద్యార్థుల్లో తీవ్రమైన అసహనం, చిరాకు కనిపిస్తున్నది. చాలా సందర్భాల్లో జ్వరంతో బాధపడుతున్నారు. రోజురోజుకు దేశంలో క్యాబిన్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.
కరోనా కారణంగా ప్రజల జీవనశైలి పూర్తిగా మారిపోయింది. నలుగురితో కలవాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. పిక్నిక్, దేవాలయాలు, విహారయాత్రలు, ప్రదేశాల సందర్శన, ఊరు ప్రయాణాలు చాలావరకు తగ్గిపోయాయి. ఇంట్లోనే ఉంటూ రోజూ ఒకేరకమైన పనులతో కాలం గడుపుతున్నారు. కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుందేమో, ఆప్తులు, కుటుంబసభ్యుల నుంచి దూరమవుతామేమోనన్న భయం మానసికంగా కుంగదీస్తున్నది.
క్యాబిన్ ఫీవర్ ఒక అవర్గీకృత మానసిక సమస్య. దీని లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. రోజంతా చిరాకు, కోపం, అసహనం, ఆందోళన, నిరాశ, నిస్పృహలు ఆవరిస్తాయి. శరీరంలోని శక్తి సన్నగిల్లినట్లు, అంతా నీరసంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉదయం నిద్ర లేవగానే నీరసంగా, ఒంట్లో శక్తి లేనట్లుగా, అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. రోజువారీ దినచర్యను సక్రమంగా కొనసాగించకపోవడం, అతి నిద్ర, నిద్ర లేమి, అతిగా మద్యం సేవించడం, ఆహారపుటలవాట్లలో మార్పు వస్తుంది. ఇవన్నీ క్యాబిన్ ఫీవర్ లక్షణాలే. దీనికి మన దినచర్యలో ఆకస్మికంగా వచ్చిన మార్పులే కారణం. కరోనా కారణంగా ఇంటికే పరిమితమవడం, ఇంటినుంచే ఉద్యోగం చేయడం, బయటకు వెళ్లే పరిస్థితులు లేకపోవడంతో ఒక నిర్బంధ జీవితం అనివార్యమైంది. దీంతోనే రోజురోజుకు దేశంలో క్యాబిన్ ఫీవర్ బాధితుల సంఖ్య పెరుగుతున్నది. ఒంటరి జీవితానికి అలవాటుపడిన వారితో పోలిస్తే, సామాజిక సంబంధాలు ఎక్కువగా ఉన్నవారు, సమాజంలో ఎక్కువ చలాకీగా తిరిగేవారు క్యాబిన్ ఫీవర్ బారినపడే అవకాశం ఎక్కువ. ఇదివరకే ఆందోళన, కుంగుబాటు వంటి మానసిక సమస్యలున్నవారు కరోనా రోజుల్లో ఎక్కువగా క్యాబిన్ ఫీవర్ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాబిన్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తున్నవారు ప్రకృతిలో సమయం గడపాలి.
ఇది ఒత్తిడి ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో పెరిగే మొక్కలను చూసుకోవడం, కిటికీ లేదా బాల్కనీ నుంచి సూర్యోదయం లేదా సూర్యాస్తమయం చూడటం, పెంపుడు జంతువులతో సమయాన్ని గడపడం చేస్తూ ఉండాలి. రోజుకు విధిగా 8 గంటలు నిద్రపోవాలి. గాఢ నిద్ర కోసం కాసేపు ఉదయం ఎండలో ఉండాలి. ఉదయం ఎండలో కొంతసేపు గడిపితే.. డి విటమిన్తో పాటుగా రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా రాత్రి పూట నిద్ర బాగా పడుతుంది. కాఫీ, టీలు తాగడం తగ్గించాలి. రాత్రి ఆహారంలో త్వరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం మంచిది. నిద్రపోయే కంటే 30 నిమిషాల ముందు పాలు లేదా చల్ల తాగితే నిద్ర బాగా పడుతుంది. నిద్రకు ఒకగంట ముందు నుంచి ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్ వంటి డిజిటల్ పరికరాలను పక్కన పెట్టాలి.
సోషల్ మీడియా వల్ల కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను చూస్తూ భయాందోళనలకు గురవుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, పుస్తకాలు చదవటానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. దీనికి కేటాయించే సమయాన్ని మానసిక ఉత్తేజాన్ని కలిగించే పనులకు కేటాయించాలి. మనలో ఉన్న నైపుణ్యాల మీద దృష్టి సారించాలి.
సోషల్ మీడియా వల్ల కూడా మానసిక ఆందోళన పెరుగుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న తప్పుడు వార్తలను చూస్తూ భయాందోళనలకు గురవుతున్నవాళ్ల సంఖ్య పెరుగుతున్నది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, పుస్తకాలు చదవటానికి ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. దీనికి కేటాయించే సమయాన్ని మానసిక ఉత్తేజాన్ని కలిగించే పనులకు కేటాయించాలి. మనలో ఉన్న నైపుణ్యాల మీద దృష్టి సారించాలి. మనకు ఇష్టమైన, ఆనందాన్నిచ్చే ఏ కళాత్మక పనైనా చేయాలి. ఒంటరిగా ఉంటున్నామనే ఆలోచనల నుంచి బయటికి వచ్చి, కొత్త అలవాట్లను రోజువారీ పనుల్లో భాగం చేసుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. తోట పని, పెయింటింగ్, వంట చేయడం.. వంటి అనేకరకాల సృజనాత్మక ప్రయత్నాలను చేయవచ్చు. భావోద్వేగాలను నియంత్రించే పనులతో రూపొందించే రోజువారీ ప్రణాళిక ఏర్పాటుచేసుకోవాలి.
ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇంట్లోనే ఉండటంతో ఆహారం ఎక్కువగా తినే అవకాశం ఉంది. దీనితో బరువు పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. తినే ఆహారంలో అన్నిరకాల పోషకాలుండే పౌష్ఠికాహారం తీసుకోవాలి. పిండి వంటలు, స్వీట్లు, జంక్ఫుడ్కు దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ఎప్పటికప్పుడు విశ్లేషణ చేసుకోవాలి. క్యాబిన్ ఫీవర్ లక్షణాలు కనిపిస్తే మానసికంగా చురుగ్గా ఉండే ప్రయత్నం చేయాలి. భయాందోళనలకు గురయ్యేవారు, సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. శారీరక ఒంటరితనం వారి మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఒంటరి తనంగా భావించే వ్యక్తులు స్నేహితుడు, కుటుంబసభ్యుడు లేదా మానసిక ఆరోగ్య నిపుణుల మద్దతు తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నవారు సైకాలజిస్టుల దగ్గర కౌన్సెలింగ్ తీసుకోవాలి.
(వ్యాసకర్త: రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్)
–డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి