దేశంలో తొలి మెట్రో రైల్ వ్యవస్థ ఎక్కువ భాగం భూగర్భంలో రూపుదాల్చటానికి కలకత్తాలో 17 కిలోమీటర్లకు 23 ఏండ్లు పట్టింది. ఆ స్థితి నుంచి నేడు భూ పైభాగంలో నాలుగైదేండ్లలో నిర్మించే స్థాయికి మన ఆర్థికవ్యవస్థ, టెక్నాలజీ చేరుకున్నాయి. కలకత్తా మెట్రోను కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టినా తదనంతరం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి జ్యోతిబసు, కాంగ్రెస్కు చెందిన కేంద్ర రైల్వేమంత్రి ఏబీఏ ఘనీఖాన్ చౌదరిలు కలిసి నాటి ప్రధాని ఇందిరాగాంధీ సహకారంతో పూర్తిచేయించారు. ఇదీ నాటి చరిత్ర. నేడు రూ.16 వేల కోట్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రోకు రావలసిన వీజీఎఫ్ 254 కోట్లు విడుదల చేసేందుకు కేంద్ర పాలకులు నానా యాగీ చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికి రూ.1,204 కోట్లు వీజీఎఫ్ గ్రాంట్ను హైదరాబాద్ మెట్రోకు ఇచ్చామని చెప్తున్నది. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అఫైర్స్ 35వ ఎంపవర్మెంట్ కమిటీ నిర్ణయం ప్రకారం.. మిగిలిన 254 కోట్లను నిలుపుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ నా ఆర్టీఐ దరఖాస్తుకు
సమాధానం ఇచ్చింది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి నేటివరకు హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ఎటువంటి సాయం అందించలేకపోయారు. అతిపెద్దదైన ఢిల్లీ మెట్రోకు మెజారిటీ భాగాన్ని కేంద్రమే భరించింది. ఆ తర్వాత వచ్చిన బెంగళూరు, చెన్నై, ముంబయి, లక్నో, అహ్మదాబాద్, కొచ్చి తదితర నగరాల మెట్రోలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి, విదేశీ ఆర్థిక సహాయ పథకాల కింద అండదండలు ఆర్థికంగా సమకూర్చింది. 2009లో వైఎస్ఆర్ ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద కేవలం 10 శాతం వయబిలిటి గ్యాప్ ఫండ్ ఇస్తే చాలని ఆమోదం తెచ్చుకుంది. ఆ తర్వాత మొత్తం ప్రాజెక్టు వ్యయం 14,558 కోట్లలో అంటే 10 శాతం 1,458 కోట్లు వీజీఎఫ్తో కేంద్రం వాటాగా సరిపెట్టుకోక తప్పలేదు. మిగిలిన మొత్తాన్ని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆర్థిక సంస్థల నుంచి రుణ రూపేణా తీసుకొని పూర్తిచేసింది. గత మూడేండ్ల నుంచి తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ వీజీఎఫ్ బ్యాలెన్స్ మొత్తం 254 కోట్లు చెల్లిస్తే, తాము రూ.847 కోట్ల క్యాష్ ఫ్లో నష్టపోకుండా వుంటామని ఎన్నిమార్లు మొర పెట్టుకున్నా కేంద్రం పట్టించుకోలేదు.
దేశంలో అతిపెద్ద మెట్రో అయిన ఢిల్లీ మొదటి రెండు ఫేజ్లకు కలిసి 29,354 కోట్లు దాదాపు కేంద్రమే భరించింది. మూడవ ఫేజ్ అంచనాలలో 41,079 కోట్లలో కేంద్రంతో పాటు విదేశీ సంస్థల ద్వారా సమకూరుస్తుంది. దేశంలో ప్రస్తు తం 13 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తుండగా వా టిలో మొదటిది ఢిల్లీ 347 కిలో మీటర్లతో అగ్రస్థానంలో ఉన్నది. 67 కిలోమీటర్లతో హైదరాబాద్ మెట్రో రెండవ స్థానంలో ఉన్నది. ఇవే కాక వివిధ దశల్లో ఉన్న మరో 14 నగరాల్లోని మెట్రో వ్యవస్థలకు మెజారిటీ నిధులు కేంద్రం లేదా కేంద్రం తిరిగి చెల్లించే విదేశీ నిధుల నుంచి నిర్మించేందుకు మంజూరు చేయబడి ఉన్నాయి. దేశవ్యాప్తంగా 27 పట్టణాలలో 702 కిలోమీటర్లు మెట్రోరైలు నడుస్తుండగా, మరో 1,016 కిలోమీటర్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
హైదరాబాద్ మెట్రో నిర్మాణ అంచనా 14,550 కోట్ల నుంచి పూర్తయ్యేసమయానికి 16,000 కోట్లకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తనవంతుగా వేల కోట్ల విలువైన భూములను మెట్రో రైల్వేకు ఇప్పటికే సమకూర్చింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు 33 కిలోమీటర్లకు దాదాపు 10 వేల కోట్లు అవసరమవుతాయి. హైదరాబాద్ నగరంలో మరికొన్ని ప్రాంతాలకు మెట్రో విస్తరింపజేసేందుకు అవకాశమున్నది. మిగిలిన 254 కోట్లను విడుదల చేయటానికి పాతబస్తీ నుంచి ఫలక్నామా వరకు పూర్తిచేయాలని, లేకుంటే ఆ నిధులు రావని కేంద్రం హెచ్చరించినట్లు సమాచారం.
సాధారణంగా కేంద్రం పాలసీ ప్రకా రం మెట్రో రైల్వే నిర్మాణానికి ఆర్థిక సంస్థలు, బ్యాంకులు 2% వడ్డీతో రుణాలు ఇస్తున్నాయి. కానీ హైదరాబాద్ మెట్రో తాను సమకూర్చుకున్న నిధులకు అత్యధిక వడ్డీ 10 శాతం చెల్లిస్తున్నది. ఇలా కూడా మెట్రోపై అదనపు భారం పడుతున్నది.
ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో బిల్లులో పేర్కొన్నవిధంగా విజయవాడ, విశాఖ నగరాల మెట్రోలను ప్రభుత్వ నిధులతో కేం ద్రం నిర్మించలేకపోయింది. హైదరాబాద్ను తెలంగాణకు కొత్త రాజధానిగా కేంద్రం భావించటం లేదు. అందుకే వివక్షతో కూడిన కేటాయింపులు జరుపుతున్నది. ఈ స్థితిలో హైదరాబాద్ మెట్రో రెండు, మూడు దశలకు కేటాయింపులు ఎంతవరకు ఇస్తారనేది అంతుచిక్కడం లేదు. అలాగే విదేశీ ఆర్థిక సంస్థల నిధుల కేటాయింపుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఐటీఐఆర్ అటకెక్కగా, ఎంఎంటీఎస్ రెండోదశ ఆనవాళ్లు కనిపించకపోగా కేంద్రం నుంచి స్వచ్ఛభారత్ నిధులు కూడా అంతంత మాత్రంగానే అందుతున్నాయి.
2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి నేటివరకు 12 మెట్రో రైల్వేలకు 60,964 కోట్లు కేంద్రం తన వాటాగా విడుదల చేసింది. 11 నగరాలకు విదేశీ ఆర్థిక సహాయ ప్రాజెక్టుల కింద 53,536 కోట్లు మంజూరు చేసింది. కేవ లం 9 కిలోమీటర్లు ఉన్న అహ్మదాబాద్ మెట్రోకు 6,033.68కోట్లు, విదేశీ నిధులు 5,399 కోట్లు; 22 కి.మీ. ఉన్న లక్నో మెట్రోకు 4,801కోట్లు, విదేశీ నిధులు 3,284 కోట్లు; 33 కి.మీ. ఉన్న బెంగళూరు మెట్రోకు 10,529 కోట్లు, విదేశీ నిధులు 7,694 కోట్లు; ఢిల్లీ మెట్రోకు కేంద్రం నిధులు 25,863 కోట్లు, ముంబై మెట్రోకు విదేశీ నిధులు 16,689 కోట్లు, చెన్నై మెట్రోకు కేంద్రం నిధులు 7977 కోట్లు, విదేశీ నిధులు 7,911 కోట్లు; నాగ్పూర్ మెట్రోకు విదేశీ నిధులు 4,639 కోట్లు, పూణేకు విదేశీ నిధులు 3,030 కోట్లు, భోపాల్ మెట్రోకు విదేశీ నిధులు 1,967 కోట్లు, కలకత్తా ఈస్ట్, వెస్ట్ మెట్రోకు విదేశీ నిధులు 1,631 కోట్లు, కేంద్రం 77 కోట్లు ఇచ్చిం ది. కొచ్చి మెట్రోకు కేంద్రం 2,181 కోట్లు, విదేశీ నిధులు 212 కోట్లు, ఇవే కాకుండా నిర్మాణం తొలి దశలో ఉన్న కాన్పూర్కు కేంద్రం 959 కోట్లు కేటాయించింది. ఆగ్రా మెట్రోకు 229 కోట్లు, సూరత్కు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, విదేశీ ఆర్థికసంస్థల నుంచి 100 కోట్లు మంజూరు చేసింది.
ఇప్పటికైనా కేంద్రం బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలు, రాష్ర్టాలు, నగరాల పట్ల వివక్ష లేకండా సమభావంతో చూసి నిజమైన సమాఖ్య సిద్ధాంతాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నరేంద్ర మోదీ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి.
–ఇనగంటి రవికుమార్