షితాబు ఖాను కాకతీయుల పతనానంతరం ఏకశిలా నగరాన్ని కొంత కాలం పరిపాలించాడు. షితాబుఖాను గూర్చి లోకంలో అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అతడు సంస్కృత భాషలో వేసిన శాసనం ఒకటి వరంగల్లు కోటలో ఉన్నది. ఇంకా అతని గురించి తెలుగు కావ్యాల పీఠికల్లో, కైఫియతులల్లో సమాచారం లభిస్తున్నది.
అతడు పశువుల కాపరి ‘సీతడు’ అని కైఫియత్తులు చెప్తున్నాయి. కాని అతడు వేయించిన శాసనం అతన్ని ‘ఒక గొప్ప వీరుడిగా, విక్రమాదిత్య తుల్యునిగా విలువిద్యలో అర్జునుడు, శ్రీరామునితో సమానమైనవాడుగా గొప్ప విజేత’గా చెప్తున్నది. భూ దానాలు చేశాడని, బ్రాహ్మణులకు అగ్రహారాలు దానాలు చేశాడని తెలుస్తున్నది. పాకాల చెరువుకు మరమ్మత్తు చేయించాడని,
పాకాలలో లభించిన ‘షితాబుఖాను చబూతిరా’ ద్వారా తెలుస్తున్నది. అతడు ఏకశిలా నగరం చుట్టూ ఉన్న రాతిగోడను తిరిగి నిర్మింపజేశాడు.
ఇప్పటికీ వరంగల్లు కోటలో అతడు నిర్మించుకున్న దర్బారు హాలు, ఖుష్మహల్ శిథిలాలు నిలిచి ఉన్నాయి. అతడు వేయించిన సంస్కృత శాసనంలో 36 శ్లోకాలు ఉన్నాయి. ఆ శాసనాన్ని అన్నార్యుని కొడుకు మాధవుడు రచించాడని తెలుస్తున్నది. శాసనంలో చక్కని శైలి ఉన్నది. ఈ శాసనాన్ని బట్టి షితాబుఖాను తండ్రిపేరు మానయ అని తెలుస్తున్నది. తనది భోగి వంశమని చెప్పుకొన్నాడు. భోగి వంశమంటే అతడు ‘బోయ’ కులానికి చెందిన వాడు అని పరిశోధకులు అంటున్నారు. బోయలు ఉత్తరాంధ్రలో క్షత్రియ ధర్మాన్ని నిర్వహిస్తూ దుర్గాలను నిర్మించి పాలన చేసినట్లు తెలుస్తున్నది. క్రీ.శ. 848 నాటి తూర్పు చాళుక్యరాజు గుణగ విజయాదిత్యుని సేనాని పండరంగు వేయించిన అద్దంకి శాసనంలో ‘బొయ కొట్టముల్ పండ్రేండు గొని’ అని ఉన్నది.
వీరుడైన సేనాని పండరంగడు.. 12 బోయల దుర్గాలను జయించినట్లుగా గొప్పగా చెప్పుకొన్నాడు. దాన్ని బట్టి బోయలు దుర్గాలను నిర్మించుకొని ఆయా ప్రాంతాలను పాలించినట్లు తెలుస్తున్నది. ‘రామాయణం’ను రచించిన వాల్మీకి బోయ కులజుడు అని చెప్తుంటారు. ప్రోలయ కాపయనాయకులు బోయ కులజులే. బోయలు సైనికులు, సేనాపతులుగా ప్రోలయకాపయ సైన్యంలో ఉండి ఉత్తరాంధ్రంలోకి కూడా ప్రవేశించారు.
సర్వజ్ఞ భూపాలుడు 1453 ప్రాంతంలో మరణించాడు. అతని తమ్ముడు 1475లో గజపతుల చేతిలో ఓడిపోయి విజయనగరం పారిపోయాడు. దాంతో ఉత్తరాంధ్రలోని రాచకొండ రాజ్యం అంతరించింది. అంతకు ముందే రేచర్ల రాజులతో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు క్రీ.శ. 1366లో మరణించాడు. 1475లో బహమనీ రాజులు గోలకొండను జయించారు. బహమనీలు, గజపతులు పరస్పర యుద్ధాలలో మునిగి ఉన్నారు. అటువంటి అదను కనిపెట్టి రేచర్ల రాజుల దగ్గర సేనానిగా ఉన్న సీతాపతి ఏకశిలానగరాన్ని ఆక్రమించుకొని రాజైనాడు.
క్రీ.శ.1504లో అతడు వేయించిన శాసనంలో.. ‘సీతాపతి రమ్యమైన ‘ఏకోపల’ అంటే.. ఏకశిలా నగరం అనే రాజధానిని ఆక్రమించాడు’ అని ఉన్నది. దాన్ని బట్టి అక్కడ ఉన్న రాజప్రతినిధిని తొలగించి అతడు క్రీ.శ. 1504లో ఏకశిలానగరానికి రాజైనట్లుగా తెలుస్తున్నది. బహమనీలు, గజపతులు పరస్పర యుద్ధాలలో మునిగి ఉండటంతో వాళ్లు సీతాపతిని పట్టించుకోలేదు. సీతాపతి ‘షితాబుఖాను’ బిరుద నామాన్ని కవులు ‘గణ నియమాల’ కోసం పద్యాలలో ‘చితాపుఖాను’, ‘చిత్తాపుఖాను’ అని రచించారు.
ధర్మన రచించిన ‘చిత్రభారతా’న్ని షితాబుఖాను మంత్రి అయిన ఎనుములపల్లి పెద్దామాత్యునికి అంకితంగా ఇచ్చాడు.
–ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606