కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిది. ఉభయ రాష్ర్టాల్లోని ప్రాజెక్టులను హస్తగతం చేసుకొని, వాటిపై అజమాయిషీ చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఈ నిర్ణయం ఉభయ రాష్ర్టాలకు, ముఖ్యంగా వ్యవసాయరంగానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కృష్ణా నదీజలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ 1976లో అవార్డు పాస్ చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం కృష్ణానదిలో 2060 టీఎంసీల నికరజలాలు, మరో 70 టీఎంసీల రిటర్న్ ఫ్ల్లోస్ జలాలు వస్తాయని
నిర్ధారించారు. ఇలా మొత్తం 75 శాతం డిపెండెబిలిటీ ప్రాతిపదికన 2130 టీఎంసీల నీరు కృష్ణానదిలో లభ్యత ఉందని నిర్ణయించారు. నది పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్రకు 584, కర్ణాటకకు 735, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటిని బచావత్ ట్రిబ్యునల్ పంపిణీ చేసింది. 2130 టీఎంసీలు కాకుండా కృష్ణా నదిలోని మిగులు జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకి వాడుకునే స్వేచ్ఛను బచావత్ అవార్డు కల్పించింది.
2000 మే నెలలో బచావత్ అవార్డు గడువు ముగుస్తుందని.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని నది పరీవాహక ప్రాంత రాష్ర్టాలు కేంద్రాన్ని కోరితే మళ్లీ ట్రిబ్యునల్ వేయాలని బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో పేర్కొన్నారు. అంతర్రాష్ట్ర నదీజలాల వివాదాల పరిష్కారం చట్టం కింద కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని రాష్ర్టాలు, కేంద్రాన్ని కోరాయి.
2004, ఏప్రిల్లో బ్రిజేష్కుమార్ ఆధ్వర్యంలో కేంద్రం కృష్ణా నదీజలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వాదనలు విని 2010, డిసెంబర్లో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదిక ఇచ్చింది. 2013లో బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అదనపు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను సవాలు చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డును నోటిఫై చేయకుండా సుప్రీం స్టే ఇచ్చింది. తుది నివేదిక ప్రకారం కృష్ణా నదిలో 2130 టీఎంసీల నికరజలాలే కాకుండా మరో 405 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయని భావించి వీటిని కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు మళ్లీ పంపిణీ చేశారు.
బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి ముందుగా కేటాయించిన 811 టీఎంసీలతోపాటు అదనంగా 194 టీఎంసీలు కలిపి మొత్తం 1005 టీఎంసీలు కేటాయించారు. దీనిపై అధికారిక నోటిఫికేషన్ రాకపోవడంతో అమల్లోకి రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్నిరంగాల్లో అన్యాయం జరుగుతున్న దని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతోనే దీనికి ముగింపు అవుతుందని.. ‘నీళ్లు, నిధులు, నియామకాల’ నినాదాలతో కేసీఆర్ నాయకత్వంలో పోరాటాల ఫలితంగా రాజ్యాంగంలోని మూడో ఆర్టికల్ ప్రకారం 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది.
ఏపీ పునర్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా నదీజలాలను అప్పటివరకు ఉన్న మూడు రాష్ర్టాలకు కాకుండా, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టానికి కూడా పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ 2014 జూలైలోనే కేంద్రానికి లేఖ రాశారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ నాలుగు రాష్ర్టాల వాదనలు విని కొత్తగా నీటి కేటాయింపులు చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. ఆ లేఖను కేంద్రం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్కు పంపించింది. కృష్ణా నదీజలాలను నాలుగు రాష్ర్టాలకు కేటాయించాలా? ఉమ్మడి రాష్ర్టానికి కేటాయించిన నీటిని ఏపీ, తెలంగాణలకు కేటాయించాలా అనే ప్రతిపాదనలపై ట్రిబ్యునల్ ముందు అనేక వాదనలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్రం వాటాను ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు పంపిణీ చేయాలని 2016లో బ్రిజేష్కుమార్ ట్రిబునల్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సమ్మతిస్తూ ఏపీకి కేటాయించిన 1005 టీఎంసీలలో తెలంగాణ వాటా తేల్చాలని.. రాష్ట్రంలో సుదీర్ఘ కృష్ణా పరీవాహక ప్రాంతం, తెలంగాణ రాష్ట్ర అవసరాలను, నీటి విషయంలో గతంలో తమకు జరిగిన అన్యాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సీఎం కేసీఆర్ మరోసారి లేఖలో కోరారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ర్టానికి కేటాయించిన 1005 టీఎంసీలలో ఏపీ, తెలంగాణలకు వాటాలను ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నది.
ఓ వైపు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదనలు సాగుతుండటంతో పాటు కేడబ్ల్యూడీటీ-2 అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ రాకుండా సుప్రీంకోర్టులో స్టే ఉండటం వల్ల ఏపీ సీఎం ఈ నెల 1, 7 తేదీ ల్లో కేంద్రానికి లేఖలు రాశారు. తెలంగాణ కేటాయించిన వాటా కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నదని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వలను నిర్వహించడం లే దని, కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల తమకు ఇబ్బంది అవుతున్నదని ఆ లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అనుమతి లేకుండా తెలంగాణ కరెంటు ఉత్పత్తి కోసం నీటిని వాడుతున్నదని ఆరోపించారు. ఉమ్మడి రిజర్వాయర్లుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని, కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.
ఏపీ ముఖ్యమంత్రి లేఖను సాకుగా చూపి కేంద్రం అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నది. ఏకపక్షంగా, రాజ్యాంగస్ఫూర్తికి భిన్నంగా, సమాఖ్యస్ఫూర్తిని కాలరాస్తూ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను హరిస్తూ జూలై 15న అర్ధరాత్రి కేంద్రం దుర్మార్గంగా గెజిట్ నోటిఫికేష్న్ జారీచేసింది.
ఏపీ సీఎం లేఖ రాసిన వారం రోజుల్లోనే హడావుడిగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కేఆర్ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని, నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతలను ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురావాలని, వీటివద్ద కేంద్ర బలగాలను మోహరించాలని ఏపీ సీఎం లేఖ రాస్తే, కృష్ణా బేసిన్లోని 36, గోదావరి బేసిన్లోని 71 మొత్తం కలిపి 107 ప్రాజెక్టులను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుని పెత్తనం చెలాయించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం ఉభయ రాష్ర్టాల అభివృద్ధిని అడ్డుకొనే దిశగా ఉన్నది. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలపై గెజిట్ నోటిఫికేషన్ రెండు రాష్ర్టాలకు గొడ్డలిపెట్టు లాం టిది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను, పూర్తయిన వాటి ని హస్తగతం చేసుకొని అధికారం చెలాయించాలనేది కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశంగా స్పష్టమైంది. ఏపీ సీఎం తెలంగాణ ప్రజల నెత్తిన చేయి పెట్టాలనుకొని భస్మాసురుడి వలె ఏపీ ప్రజల నెత్తి పైనే చేయి పెట్టారు. ఆయన అవగాహన రాహిత్యంతో రాయలసీమ ప్రాంతానికే ఎక్కువ నష్టం జరగనున్నది. కృష్ణా నదిలోని మిగులు జలాలను ఆధారంగా చేసుకొని నిర్మించే ప్రాజెక్టులు రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు వీటి పరిస్థితి ఏమిటనేది లేఖ రాసినవారికే తెలియాలి. కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లో వీటికి పరిష్కారం లేదు.
కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించి రెండు రాష్ర్టాల మధ్య ఉన్న అంశాలను పరిష్కరించేది. ప్రధానంగా రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పంపిణీ పూర్తిచేసేది. ఇవేం చేయకుండా ఏండ్ల పాటు ట్రిబ్యునల్ను నిద్రావస్థలో పెట్టి, ట్రిబ్యునల్ నిర్ణయాలు రాకుండా చేసి ప్రాజెక్టులపై పెత్తనం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులపై.. కరెంటు ఉత్పత్తికి నీటి వినియోగంపై అభ్యంతరాలు ఉన్నాయి. గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులపై ఎలాంటి వివాదాల్లేవు. గోదావరి నదిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు ఉమ్మడిగా ఎలాంటి ప్రాజెక్టుల్లేవు. అయినా గోదావరి నది బేసిన్లోని ప్రాజెక్టులను కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుంటున్నది. తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకువచ్చింది. కృష్ణా నదీజలాల విషయంలో మహారాష్ట్ర, కర్ణాటకలోనూ వివాదాలున్నాయి. కేంద్రానికి నిజం గా చిత్తశుద్ధి ఉంటే నాలుగు రాష్ర్టాలతో కలిపి అథారిటీ ఏర్పాటు చేయాలి.
తెలంగాణకు అన్యాయం చేస్తున్న గెజిట్ నోటిఫికేషన్ను బీజేపీ స్వాగతించడం సిగ్గుచేటు. తెలంగాణ బీజేపీ నేతలు రైతాంగానికి ఏం సమాధానం చెప్తారు? కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల పరిధిపై జారీ చేసిన గెజిట్ నోటికేషన్ అక్టోబర్ 14న అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. ఇప్పటికైనా కేంద్రం తమ వైఖరి మార్చుకోవాలి. గెజిట్ అమలును నిలిపివేయాలి. ప్రధాని మోదీ జోక్యం చేసుకొని ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో చర్చించి వివాదాలను పరిష్కరించాలి. అలా కాకపోతే తక్షణమే కృష్ణాలో తెలంగాణకు న్యాయమైన వాటా కేటాయింపు చర్యల్ని వేగవంతం చేయాలి.
(వ్యాసకర్త: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి)
–కడియం శ్రీహరి